పవన్! రిసార్టులో దీక్షలా? ఎయిర్ ఏషియాతో సంబంధం లేదు: అశోక్ గజపతిరాజు
అమరావతి: ప్రముఖ సినీనటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు మరోసారి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రిసార్ట్లో దీక్ష చేస్తే ఎవరికి లాభమని పవన్నుద్దేశించి ప్రశ్నించారు.
Recommended Video
గిరిజనులతో మమేకం, అండగా ఉంటాం: విశాఖ ఏజెన్సీలో పవన్ కళ్యాణ్ ఇలా..
రాజకీయాలపై ఆయన మరింత అవగాహన పెంచుకోవాలని సూచించారు. గత కొద్దిరోజులుగా అశోక్, పవన్ అభిమానుల మధ్య విమర్శల యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే.
కోటకొచ్చానంటూ పవన్
పవన్ కళ్యాణ్ ఎవరంటూ అశోక్ గతంలో ప్రశ్నించడంతో ఈ వివాదం మొదలైంది. ఆ తర్వాత దీనిపై పవన్ ఎక్కడా పెద్దగా మాట్లాడకపోయినా.. మొన్నటి విజయనగరం పర్యటనలో అశోక్ గజపతిరాజుపై నేరుగా విమర్శలు చేశారు.
'అశోక్ గారూ... మీ కోటకు వచ్చా.. నేనేనండి పవన్ కళ్యాణ్' అంటూ తనను తాను పరిచయం చేసుకున్నట్టు మాట్లాడారు. 2014 ఎన్నికల్లో టీడీపీ గెలుపులో తానెలా ప్రధాన పాత్ర పోషించింది తెలిపారు. ఈ నేపథ్యంలోనే అశోక్ బుధవారం మళ్లీ పవన్పై డైరెక్ట్గానే విమర్శలు చేసినట్టు తెలుస్తోంది.
ఎయిర్ ఏషియాతో సంబంధం లేదు
కాగా, ఎయిర్ ఏషియా సీఈవోల మధ్య జరిగిన ఫోన్ సంభాషణతో తనకు ఎలాంటి సంబంధం లేదని అశోక్ గజపతిరాజు తెలిపారు. అది ప్రైవేట్ వ్యక్తుల సంభాషణ అన్నారు. వైసీపీ ఎంపీల రాజీనామాతో ఎలాంటి ప్రయోజనం లేదని, రాజీనామాలపై వాళ్లకు చిత్తశుద్ధి లేదన్నారు.
అవినీతి జగన్ పోరాటమా?
ఒక అవినీతిపరుడు టీడీపీపై అవినీతి ముద్ర వేయాలని చూస్తున్నారని వైసీపీ అధినేత జగన్ను ఉద్దేశించి మంత్రి ప్రతిపాటి పుల్లారావు విమర్శించారు. బుధవారం గుంటూరు జిల్లాలోని యడ్లపాడులో నవనిర్మాణ దీక్షలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.... రాష్ట్రంలో తాము చాలా అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టామని తెలిపారు. వైసీపీ ఎంపీల రాజీనామా అంతా డ్రామా అని, ఉప ఎన్నికలకు భయపడే వారు సకాలంలో రాజీనామాలు చేయలేదని అన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు ధర్మపోరాటం చేస్తున్నారని, మరోవైపు జగన్ అవినీతి పోరాటం చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.
వైసీపీ ఎంపీల రాజీనామాల్లో చిత్తశుద్ధి ఏది?
వైసీపీ ఎంపీల రాజీనామాలవల్ల ఏపీకి ఎలాంటి ప్రయోజనం ఉండదని మచిలీపట్నం ఎంపీ కొనకళ్ల నారాయణ అన్నారు. జూన్ 4వ తేదీకి ముందే రాజీనామాలను ఆమోదింపచేసుకుని ఉంటే చిత్తశుద్ధి తెలిసేదని అన్నారు. ఇప్పుడు వారు రాజీనామాలు ఆమోదింప చేసుకున్నా ఉప ఎన్నికలు రావని, వైసీపీ రాజీనామాలంతా ఓ డ్రామా అని తాము ముందు నుంచి చెబుతున్నామని అన్నారు. వారు రాజీనామాలు చేసి రెండు నెలలు అయిందని, ఇంతవరకు వారు ఎందుకు రాజీనామాలను ఆమోదింపచేసుకోలేదని నారాయణ ప్రశ్నించారు. 2015 నుంచి రాజీనామాల డ్రామా ఆడుతున్నారని, వాళ్లకు చిత్తశుద్ది ఉంటే ఆనాడు రాజీనామాలు చేసుంటే.. వాళ్ల నిజాయితీని గౌరవించేవాళ్లమని నారాయణ అన్నారు.