ఎన్టీఆర్ పేరు నేను పెట్టలేదు: కెసిఆర్పై అశోక్ గజపతి
న్యూఢిల్లీ/ హైదరాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం దేశీ టెర్మినల్కు ఎన్టీ రామారావు పేరు పెట్టడాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు వ్యతిరేకించడాన్ని పౌర విమానయానాల మంత్రి, తెలుగుదేశం పార్టీ నాయకుడు పి. అశోక్ గజపతి రాజు తప్పు పెట్టారు. ఎన్టీఆర్ పేరును తాను పెట్టలేదని, గతంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నాయని, మంత్రి వర్గం ఆమోదించిందని, ఆ నిర్ణయాలనే తాను అమలు చేశానని ఆయన శుక్రవారం మీడియాతో అన్నారు.
ఎన్టీఆర్ పేరు ఇప్పుడు పెట్టింది కాదని, 1999లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నాయని ఆయన అన్నారు. ఎలాంటి తీర్మానమైనా చేసే స్వేచ్ఛ శాసనసభకు ఉందని, తెలంగాణ శాసనసభ తీర్మానాన్ని పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని ఆయన అన్నారు. కెసిఆర్ తన కుమారుడికి అభిమానంతో ఎన్టీఆర్ పేరు పెట్టుకున్నారని ఆయన గుర్తు చేశారు.
కెసిఆర్ కుటుంబానికి రాజకీయ భిక్ష పెట్టింది ఎన్టీ రామారావేనని ఆంధ్రప్రదేశ్ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దేశీ టెర్మినల్కు ఎన్టీఆర్ పేరు ఉండాల్సిందేనని ఆయన అన్నారు. పటేల్, పట్వారీ వ్యవస్థ నుంచి ఎన్టీఆర్ తెలంగాణకు విముక్తి కలిగించారని ఆయన శుక్రవారం మీడియాతో అన్నారు. ఎన్టీ రామారావు పేరు పెట్టినందుకు తెలుగుజాతి గర్వించాలని ఆయన అన్నారు. తెలంగాణ శాసనసభ తీర్మానం సిగ్గుచేటు అని ఆయన వ్యాఖ్యానించారు.
శంషాబాద్ విమానాశ్రయంలో దేశీ టెర్మినల్కు ఎన్టీఆర్ పేరు తొలగించాలని అడిగే హక్కు కెసిఆర్కు ఎక్కడిదని ఆంధ్రప్రదేశ్ ముంత్రి అచ్చెన్నాయుడు అడిగారు. ఎన్టీఆర్ పేరు ఇష్టం లేకపోతే ముందు కెసిఆర్ తన కుమారుడి పేరు తొలగించాలని ఆయన శుక్రవారం మీడియాతో అన్నారు. తనకు రాజకీయ భిక్ష పెట్టింది ఎవరో కెసిఆర్ మరిచిపోయారని ఆయన వ్యాఖ్యానించారు.
రాజీవ్ గాంధీ తెలంగాణ వ్యక్తా... తెలుగువాడా.. రాజీవ్ పేరు తొలగించాలని ఎందుకు అడగరని ఆయన ప్రశ్నించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువాళ్లంతా ఎన్టీఆర్ను అభిమానిస్తారని, రాజకీయ దురుద్దేశంతో అలాంటి వ్యక్తి పేరు తొలగించాలని అనడం సరికాదని ఆయన అన్నారు.