టీడీపీలోకి కిషోర్ చంద్రదేవ్, చంద్రబాబుతో విభేదాలపై అశోక్ గజపతి రాజు ఏమన్నారంటే
విశాఖపట్నం: ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు అసంతృప్తితో ఉన్నారనే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై ఆయన ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ వివరణ ఇచ్చారు.
చంద్రబాబుకు, తనకు మధ్య గ్యాప్ ఉన్నట్లుగా వస్తున్న వార్తలు అవాస్తవం అన్నారు. తాను దాదాపు గత నాలుగు దశాబ్దాలుగా టీడీపీ కార్యకర్తనని, పార్టీ సిద్ధాంతం కోసం పని చేస్తున్నానని చెప్పారు. చంద్రబాబుతో ఎలాంటి విభేదాలు లేవన్నారు.
ధర్మపోరాట దీక్షలోను చంద్రబాబుతో రాష్ట్రపతిని కలిశానని చెప్పారు. తాను విశాఖపట్నం వెళ్లేందుకు ఢిల్లీలో విమానం ఎక్కుతున్న సమయంలో పొలిట్ బ్యూరో సమావేశం గురించి తెలిసిందని, అందువల్లే హాజరుకాలేదని చెప్పారు. ఈ విషయాన్ని అధినేతకు చెప్పానని అన్నారు. కేంద్ర మాజీ మంత్రి కిషోర్ చంద్రదేవ్ పార్టీలోకి రావడం తనకు ఇష్టం లేదనే ప్రచారం జరుగుతోందని, అది కూడా సరికాదన్నారు. ఆయన చాలా మంచి వ్యక్తి అని, ఆయన టీడీపీలోకి రావడం స్వాగతించాల్సిందే అన్నారు.