మాన్సాస్పై అశోక్ భారీ ప్లాన్-తెరపైకి సంచలన ఆధారాలు-వైసీపీ దూకుడుకు బ్రేక్ ?
హైకోర్టు తీర్పు తర్వాత మాన్సాస్ ట్రస్టులో అక్రమాల పేరుతో తనను టార్గెట్ చేస్తున్న వైసీపీ ప్రభుత్వం, నేతలపై అశోక్ గజపతిరాజు ఓ రేంజ్లో ఎదురుదాడి చేస్తున్నారు. ఈ క్రమంలో గతంలో మాన్సాస్ ట్రస్టు వ్యవహారాల్లో జోక్యం చేసుకున్న వైసీపీ పెద్దల్ని, స్ధానిక ప్రజాప్రతినిధుల్ని, అధికారుల్ని ఈ వివాదంలోకి లాగారు. దీనికి సంబంధించిన ఆధారాలతో ఇవాళ ఆయన చేసిన ట్వీట్లు వైసీపీ సర్కారులో కలకలం రేపుతున్నాయి. ముఖ్యంగా ఫోరెన్సిక్ ఆడిట్ పేరుతో వైసీపీ చేస్తున్న విమర్శలకు వీటితో గట్టి కౌంటర్ ఇచ్చారు.
మాన్సాస్ అటాక్పై అశోక్ కౌంటర్
మాన్సాస్ ట్రస్టు వ్యవహారాల్లో అక్రమాలపై తనను జైలుకు పంపుతానంటూ వైసీపీ నేతలు హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో అశోక్ గజపతిరాజు క్రమంగా జూలు విదుల్చుతున్నారు. తన కుటుంబానికే చెందిన మాన్సాస్లో తానే అక్రమాలు చేశానంటూ వైసీపీ చేస్తున్న ప్రచారానికి ఓవైపు కౌంటర్లు ఇస్తూనే.. మరోవైపు మాన్సాస్ వ్యవహారాల్లో వైసీపీ నేతల జోక్యంపై ఆధారాలు ఒక్కొక్కటిగా బయటపెడుతున్నారు. రెండు రోజుల క్రితం మాన్సాస్ భూముల్లో ఇసుక తవ్వకాలకు అనుమతులు ఇచ్చిందెవరంటూ ప్రశ్నించిన అశోక్... ఇవాళ మరికొన్ని ప్రశ్నలతో ట్వీట్లు చేశారు.
వైసీపీ నేతల జోక్యంపై ఆధారాల విడుదల
మాన్సాస్ ట్రస్టులో అక్రమాల పేరుతో పలు విచారణలు, దర్యాప్తుల పేరుతో వైసీపీ నేతలు ఇందులో ఎలా జోక్యం చేసుకున్నారో తెలియజేస్తూ అశోక్ గజపతి రాజు ఇవాళ పలు ట్వీట్లు చేశారు. ఇందులో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డితో పాటు విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి, జిల్లా కలెక్టర్ వివరాలు కోరడాన్ని ఆయన ట్వీట్లలో ప్రశ్నించారు. ఈ వివరాలు ఎందుకు కోరారని, వీటి ద్వారా ఏం బయటపడిందో చెప్పాలంటూ ఆయన వీరిని సూటిగా నిలదీశారు.
బొత్స, సాయిరెడ్డి, కోలగట్ల టార్గెట్
2019 జూన్ 29న అంటే వైసీపీ అధికారంలోకి వచ్చిన నెలరోజుల్లోనే మంత్రి బొత్స సత్యనారాయణ విజయనగరం కలెక్టర్ను మాన్సాస్పై నివేదిక ఇవ్వాలని కోరారని ఈనాడులో వచ్చిన వార్త క్లిప్తో సహా ట్వీట్ చేశారు. అలాగే గతేడాది జనవరి 21న మాన్సాస్ ఈవోను వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వివరాలు కోరారు. దీనిపైనా ట్వీట్ చేసిన అశోక్.. ఆ వివరాలతో తీర్చుకోవాల్సిన అనుమానాలేంటని ప్రశ్నించారు. అసలా వివరాలు కోరడంలో ఉద్దేశం ఏంటని ప్రశ్నించారు. మరో ట్వీట్లో విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి 2019 అక్టోబర్ 20న మాన్సాస్ ఈవోను ఆర్ధిక లావాదేవీల వివరాలు కోరిన విషయాన్ని బయటపెట్టారు. ఆ వివరాలతో కోలగట్ల ఏ అభిప్రాయానికి వచ్చారని ప్రశ్నించారు.
Recommended Video
ఫోరెన్సిక్ ఆడిట్ డిమాండ్ గుట్టు విప్పిన అశోక్
సంచైత మాన్సాస్ ఛైర్మన్గా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆమెతో పాటు ఎంపీ విజయసాయిరెడ్డి మాన్సాస్ ట్రస్టులో ఫోరెన్సిక్ ఆడిట్కు డిమాండ్ చేస్తున్నారని, కానీ ప్రభుత్వం చేతుల్లో ఉన్న ఆడిట్ను ఇప్పటికీ చేయించలేకపోయారని అశోక్ ధ్వజమెత్తారు. అసలు ఈ ఫోరెన్సిక్ ఆడిట్లో క్లయింట్ ఎవరు ?, ఆడిట్ జరిగిందా అని అశోక్ ప్రశ్నించారు. ఫోరెన్సిక్ ఆడిట్లో నిందితులెవరని, దాని ఆసక్తికరమైన ఫలితాలు చూసే అవకాశం ఉందా అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇప్పుడు మీడియా ముందు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారంటూ సంచైత, సాయిరెడ్డిని అశోక్ నిలదీశారు. ఈ ప్రహసనం సాగుతున్నంత సేపు మాన్సాస్ విద్యాసంస్ధలపై దృష్టిపెట్టడం కష్టమని అశోక్ స్ఫష్టం చేశారు.