రాజు ఒక్కరే!: కొత్త రికార్డు.. ఆ 70ఏళ్లు ఒక ఎత్తు, ఈ మూడేళ్లు ఒక ఎత్తు..
దేశంలో నిరుపయోగంగా ఉన్న 80విమానశ్రయాలను ఆయన అందుబాటులోకి తీసుకురాగలిగారు.
న్యూఢిల్లీ: రాజకీయాల్లో పదవులు చేపట్టేవాళ్లు చాలామందే ఉన్నా.. వాటికి వన్నె తెచ్చేవారు మాత్రం కొందరే ఉంటారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు ఇప్పుడా జాబితాలో చేరిపోయినట్టే కనిపిస్తోంది.
అశోక్ గజపతిరాజు విమానయాన బాధ్యతలు చేపట్టిన తర్వాత దాని రూపు రేఖలను మార్చివేశారు. సామాన్యుడికి విమానప్రయాణానికి పెద్ద పీట వేస్తూ దేశవ్యాప్తంగా 80విమానశ్రయాలను అందుబాటులోకి తీసుకొచ్చారు.
రాజు ఒక్కరే:
కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పరంగా దేశ విమానయాన రంగం పదో స్థానంలో ఉండేది. కానీ గడిచిన మూడేళ్లలోనే ఆ పరిస్థితిలో చాలా మార్పు వచ్చింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో 2017కి గాను విమానయాన రంగానికి మూడో స్థానం దక్కడం అశోక్ గజపతిరాజు కృషిని చాటుతోంది. అలాగే విమానయాన రంగంలో ఇంత ఎక్కువ కాలం కొనసాగిన మంత్రి కూడా అశోక్ గజపతి రాజు ఒక్కరే. 42నెలలుగా ఆయన ఆ పదవిలో కొనసాగుతున్నారు.
కొత్తగా 80ఎయిర్ పోర్టులు:
టీడీపీతో పొత్తు నేపథ్యంలో 2014లో కేంద్రం అశోక్ గజపతిరాజుకు విమానయాన రంగ బాధ్యతలు అప్పగించింది. అప్పటికీ దేశంలో 70ఎయిర్ పోర్టులు ఉన్నాయి. ఈ మూడేళ్లలో దేశంలో నిరుపయోగంగా ఉన్న 80విమానశ్రయాలను ఆయన అందుబాటులోకి తీసుకురాగలిగారు. ఏదో తూతూ మంత్రంగా కాకుండా.. సామాన్యులకు ఆ విమానశ్రయాలను చేరువ చేయడానికి సరికొత్త పథకానినికి కూడా రూపకల్పన చేశారు.
రీజనల్ కనెక్టివిటీ స్కీమ్:
చిన్న తరహా పట్టణాల్లో విమానాశ్రయాలను అభివృద్ధి చేసి చేయడం రీజనల్ కనెక్టివిటీ స్కీమ్ ప్రత్యేకత. విమాన రాకపోకలు జరిగేలా చర్యలు తీసుకుంటారు. ఈ విమానశ్రయాల్లో మిడిల్ క్లాస్ వారిని దృష్టిలో పెట్టుకుని తక్కువ ధరలకే విమాన టికెట్లను అందుబాటులోకి తెచ్చారు. కేవలం రెండు గంటల ప్రయాణ నిడివి గల సామాన్యులకు తక్కువ ధరకు టికెట్లు అందించడం కూడా ఈ పథకం లక్ష్యాల్లో ఒకటి. ఇందుకోసం విమానంలో ముందుగానే మిడిల్ క్లాస్ వర్గాల కోసం టికెట్లు రిజర్వ్ చేసే నిబంధనలు తీసుకొచ్చారు.
అదంతా ఒక ఎత్తు.. ఇదొక ఎత్తు:
విమానయాన రంగంలో అశోక్ గజపతిరాజు చేపట్టిన సంస్కరణలకు మంచి గుర్తింపు లభిస్తోంది. ఒకరకంగా గత 70ఏళ్లలో జరిగిన ప్రగతి ఒక ఎత్తు అయితే, ఈ మూడేళ్ల వ్యవధిలో జరిగిన పురోగతి మరో ఎత్తు అని చెబుతున్నారు. సమర్థవంతంగా బాధ్యతలు నిర్వర్తించడం ద్వారా అటు టీడీపీకి కూడా రాజు మంచి పేరు తెచ్చినవారయ్యారు.