ఎవరీ అశ్విని: 3 దశాబ్దాల తరువాత చంద్రబాబు కుప్పం కోటను కుప్పకూల్చిన 23 ఏళ్ల యువతి
చిత్తూరు: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి జనాదరణ ఏ మాత్రం తగ్గలేదనే విషయం మరోసారి నిరూపితమైంది. ఇదివరకు పంచాయతీలు, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లను క్లీన్స్వీప్ చేసిన విధంగానే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాల్లోనూ వైఎస్సార్సీపీ తిరుగులేని విజయాలను సొంతం చేసుకుంటోంది. అన్ని జిల్లాల్లోనూ వైసీపీ ప్రభంజనం కనిపిస్తోంది. అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్ల తరువాత కూడా ప్రభుత్వ వ్యతిరేక పవనాలు ఏ మాత్రం వీయట్లేదనే విషయాన్ని ఈ ఫలితాలు స్పష్టం చేస్తోన్నాయి.
కుప్పం కోట కుప్ప
కుప్పం.. చిత్తూరు జిల్లా చివరన ఉండే ఓ నియోజకవర్గం. మూడు రాష్ట్రాల సరిహద్దుల్లో ఉండే ఈ అసెంబ్లీ నియోజకవర్గం.. ఇప్పుడు మరోసారి వార్తల్లోకి ఎక్కింది. లోక్సభ మొదలుకుని పంచాయతీ వరకు ఏ ఎన్నిక జరిగినా అందరి కళ్లూ- ఈ నియోజకవర్గం మీదే ఉంటాయి. దీనికి కారణం- తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ స్థానానికి ప్రాతినిథ్యాన్ని వహిస్తుండటమే. 1989 తరువాత ఈ నియోజకవర్గం నుంచి చంద్రబాబుకు తప్ప మరొకరికి స్థానమే లేదిక్కడ.
తొలిసారిగా బలహీనం..
2019 అసెంబ్లీ ఎన్నికల తరువాత.. చంద్రబాబు కుప్పం కోటకు బీటలు వారడం ఆరంభమైనట్టే కనిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో తొలి రెండు రౌండ్లల్లో చంద్రబాబు వెనుకంజలో ఉండటం అప్పట్లో సంచలనంగా మారింది. వైఎస్సార్సీపీ తరఫున పోటీ చేసిన రిటైర్డ్ ఐఎఎస్ అధికారి చంద్రమౌళి తొలి రెండు రౌండ్లలో భారీ ఆధిక్యాన్ని కనపరిచారు. దీనితో హోరాహోరీ పోరు తప్పదనే అభిప్రాయం విశ్లేషకుల్లో కనిపించింది. ఆ తరువాత చంద్రబాబు ఆధిక్యతలోకి దూసుకెళ్లారు. 30 వేలకు పైగా ఓట్ల తేడాతో విజయం సాధించారు.
చాలామంది కొత్తవారితో పోల్చుకుంటే..
నిజానికి- చంద్రబాబు నాయుడు 30 వేల ఓట్ల తేడాతో గెలుపొందడాన్ని ఆయన నైతిక ఓటమిగా భావించే వారి సంఖ్య కూడా లేకపోలేదు. ఎందుకంటే- 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేసిన చాలామంది కొత్త ఎమ్మెల్యేలు సైతం 40 వేలకు పైగా ఓట్ల తేడాతో టీడీపీ అభ్యర్థులను ఓడించారు. పలువురు కొత్త ఎమ్మెల్యేలు చంద్రబాబు కంటే భారీ మెజారిటిని సాధించారు. కుప్పంలో చంద్రబాబు తొలి రెండు రౌండ్లల్లో ఓడిపోవడం, ఆయన మెజారిటీ 30 వేలకు మాత్రమే పరిమితం కావడంతో కుప్పం కోట బలహీనపడినట్టుగా భావించారు.
పంచాయతీ ఎన్నికల్లో మళ్లీ ప్రూవ్
కుప్పంలో తెలుగుదేశం పార్టీ బలహీన పడిందనే విషయం పంచాయతీ ఎన్నికల ద్వారా మరోసారి రుజువైంది. ఇదివరకు పంచాయతీ ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో వైసీపీ మద్దతు ఇచ్చిన అభ్యర్థులు గెలుపొందిన విషయం తెలిసింది. కుప్పం నియోజకవర్గంలో మొత్తం 93 పంచాయతీలు ఉండగా.. మెజారిటీ స్థానాలను వైసీపీ మద్దతు ఇచ్చిన అభ్యర్థులు గెలిచారు. 70 చోట్ల వైసీపీ, 12 చోట్ల టీడీపీ మద్దతు దారులు గెలుపొందారు.
టీడీపీ పుంజుకోనట్టే
ఇప్పుడు తాజాగా- వెలువడిన ఎంపీటీసీ ఎన్నికల్లోనూ ఇదే తరహా ఫలితం కనిపించింది. తెలుగుదేశం పార్టీ ఏ మాత్రం పుంజుకోలేదనేది స్పష్టమైంది. కుప్పం నియోజకవర్గం పరిధిలోని టీ సదుమూరు జెడ్పీటీసీ స్థానంలో వైసీపీ జెండా ఎగురవేసింది. ఈ జెండాను ఎగురవేసింది ఓ యువతి కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆమె పేరు అశ్విని. 23 సంవత్సరాల యువతి. టీ సద్దుమూరు ఎంపీటీసీ స్థానం వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. వైఎస్సార్సీపీ అభ్యర్థిని అశ్విని 1073 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. మొత్తం 1243 ఓట్లకు గాను అశ్వినికి 1143 ఓట్లు పోల్ అయ్యాయి. టీడీపీ అభ్యర్థికి 70 ఓట్లు మాత్రమే పడ్డాయి. ఇన్వ్యాలిడ్గా 27 ఓట్లను గుర్తించారు.
నో పొలిటికల్ బ్యాక్గ్రౌండ్..
ఎలాంటి రాజకీయ నేపథ్యంలేని కుటుంబం నుంచి వచ్చారు అశ్విని. రాజకీయాలకు పూర్తిగా కొత్త. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబం అంటే అభిమాని. 2019 ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేసిన రిటైర్డ్ ఐఎఎస్ అధికారి, దివంగత చంద్రమౌళి వెంట నడిచారామె. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే అభిమానిస్తారు. అసెంబ్లీ ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారం చేశారు. వైఎస్ జగన్ కుప్పం ప్రచారానికి వచ్చినప్పుడు ఆయన వెంటే కనిపించారు.