మత్తు మందిచ్చి వివాహితపై ఎఎస్సై, బావమరిది రేప్: ప్రేమ పేరుతో యువతిపై గ్యాంగ్ రేప్
గుంటూరు: ఓ వివాహితపై ఏఎస్ఐతోపాటు అతని బావమరిది అత్యాచారం జరిపిన సంఘటన గుంటూరు జిల్లాలో జరిగింది. బెల్లంకొండలో ఏఎస్ఐ శ్రీనివాసరావు, అతని బావమరిది కలిసి ఓ మహిళకు విద్యుత్తు కనెక్షన ఇప్పిస్తామంటూ తీసుకువెళ్లి అత్యాచారం జరిపారు.
బాధిత మహిళ జిల్లా రూరల్ ఎస్పీని ఆశ్రయించడంతో పోలీసులు ఏఎస్ఐతోపాటు అతని బావమరిదిపై బెల్లంకొండ స్టేషనులో కేసు నమోదు చేశారు. వివాహిత మహిళకు కూల్డ్రింక్లో మత్తు మందిచ్చి లైంగికదాడికి పాల్పడ్డారు.
గుంటూరు జిల్లా అచ్చంపేట కొత్తపల్లి గ్రామానికి చెందిన వివాహితకు మూడెకరాల పొలం ఉంది. అందులో బోరు వేయించే అంశంపై అదే గ్రామ వాసి మందపాటి శ్రీను మాటలు కలిపాడు. తన బావ శ్రీనివాసరావు పిడుగురాళ్ల ఏఎస్ఐగా పని చేశారని, విద్యుత్ కనెక్షన్ సులభంగా ఇప్పిస్తానని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లాడు. అక్కడే మత్తుమందు కలిపిన కూల్డ్రింక్ తాగించి అత్యాచారానికి పాల్పడ్డారు.
దీన్ని వీడియోలో చిత్రీకరించామని, భర్తకు చూపుతామని బెదిరిస్తుండటంతో ఐదు రోజుల క్రితం బాధితురాలు గుంటూరు రూరల్ ఎస్పీని ఆశ్రయించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు బెల్లంకొండ పోలీసులు తెలిపారు.
ఇదిలావుంటే, విశాఖ నగరంలోని వనటౌన్ పరిధిలో ఓ యువతిపై సామూహిక అత్యాచారం జరిగింది. ప్రేమ పేరిట వేలంపేటకు చెందిన యువతిని నగర శివార్లకు తీసుకువెళ్లి మరో ఇద్దరితో కలిసి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు సాగిస్తున్నారు.