తిరుపతి ఇష్యూ: కేఈ అనుమానం, కర్నాటక ఎన్నికలవల్లే కేంద్రం మెట్టు దిగిందా?
అమరావతి: తిరుమలలోని శ్రీవారి ఆలయాన్ని తన ఆధీనంలోకి తీసుకోవాలన్న పురా వస్తు శాఖ ప్రతిపాదన అనుమానాలు కలిగిస్తోందని ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి అన్నారు. తిరుమలకు సంబంధించి ఏ నిర్ణయం తీసుకున్నా భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకోవాలని, దేశ విదేశాల్లో ఈ ఆలయానికి ప్రత్యేకత ఉందన్నారు.
చదవండి: తిరుమలపై కేంద్రం గిల్లికజ్జాలు! అసలేం జరిగింది, పురావస్తుశాఖ తీసుకుంటే ఏమవుతుంది?
ఎవరికి ఏ అనుమానాలున్నా నివృత్తి చేసేందుకు టీటీడీ, ప్రభుత్వం సిద్ధంగా ఉన్నాయన్నారు. శ్రీవారి ఆలయాన్ని, ఉప ఆలయాలను పరిరక్షించుకునే సామర్థ్యం టీటీడీకి, ప్రభుత్వానికి ఉందన్నారు. పురావస్తుశాఖ లేఖ విషయమై ముఖ్యమంత్రితో చర్చించి ఏం చేయాలో నిర్ణయిస్తామన్నారు. శ్రీవారి భక్తుల్లో ఎలాంటి ఆందోళన అవసరం లేదన్నారు.
మరోవైపు, లేఖ అంశాన్ని కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి మహేష్ శర్మ దృష్టికి తీసుకు వెళ్లామని, వెంటనే ఆ లేఖను వెనక్కి తీసుకోవడం సంతోషంగా ఉందని, లేఖ రాసిన అధికారిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని, తమ అధికారుల వైపు నుంచి జరిగిన పొరపాటుకు బాధ్యత వహించి టీటీడీకి పురావస్తు శాఖ డీజీ స్వయంగా క్షమాపణలు చెప్పారని జీవీఎల్ నర్సింహా రావు అన్నారు.
కర్నాకటక ఎన్నికల కారణంగానేనా?
తిరుమల విషయంలో కేంద్రం వెనక్కి తగ్గడానికి కర్నాటక ఎన్నికలు అనే ప్రచారం కూడా సాగుతోంది. కర్ణాటక ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే కొన్ని గంటల్లోనే కేంద్రం దిగివచ్చిందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుండటం, అక్కడి పీఠాధిపతులు, మఠాధిపతులు స్పందించేందుకు సంసిద్ధులవుతున్నారన్న వార్తల నేపథ్యంలో తక్షణమే నష్ట నివారణ చర్యలు చేపట్టిందట.