స్కెచ్ చలపతిదే!...హిట్ లిస్ట్ లో ఆ వివాదాస్పద టిడిపి ఎమ్మెల్యే;మరో నలుగురు
విశాఖపట్నం:అరకు ఎమ్మెల్యే కిడారి,మాజీ ఎమ్మెల్యే సోమ కాల్చివేత ఘటనకు స్కెచ్ వేసింది మావోయిస్టు పార్టీ అగ్ర నేత ప్రతాప్ రెడ్డి అలియాస్ చలపతిగా పోలీసులు విశ్వసిస్తున్నారు.
సుదీర్ఘ అనుభవంతో పాటు గెరిల్లా దాడుల్లో రాటుదేలిన మావోయిస్ట్ నేత చలపతి ఈ దాడి ద్వారా తాను అనుకున్న విధంగానే తమకు సవాల్ విసిరినట్లయిందని పోలీసు వర్గాలే అంతర్గత చర్చల్లో వ్యాఖ్యానిస్తున్నట్లు తెలిసింది. లిపిటుపుట్టు దాడి ఆపరేషన్ ఆద్యంతం చలపతి కనుసన్నల్లోనే జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ దాడి సందర్భంగా మావోయిస్టులు తరుచూ వాకీ టాకీల్లో సంప్రదించింది చలపతినేననేది పోలీసుల అంచనా.
ఆయనదే...స్కెచ్ అంతా!
టీడీపీ నేతలను తమ దళాలు మట్టుబెట్టే ఆపరేషన్ ను పూర్తి చేసేంతవరకూ మావోయిస్ట్ అగ్రనేత చలపతి ఉజ్జంగి పరిసర ప్రాంతాల్లోని అడవుల్లోనే ఉన్నరని పోలీసులు విశ్లేషిస్తున్నారు. ఎప్పటికప్పుడు ఆపరేషన్ పూర్తి చేసే విషయమై తమవారికి వాకీటాకీల ద్వారా సూచనలు చేస్తూ...చివరకు ‘ఆపరేషన్ సక్సెస్' అనే కన్ఫర్మేషన్ వారి నుంచి వచ్చిన తరువాతే అక్కడ నుంచి చలపతి నిష్క్రమించారని పోలీసులు చెబుతున్నారు. ఇదే విషయాన్ని నిఘా అధికారులు కూడా ప్రాథమికంగా నిర్థారించారని తెలిపారు.
వీడియో బయటపడింది: కిడారి హత్య తర్వాత పరుగులు తీసిన మావోలు శ్రీనుబాబు ,కామేశ్వరి
వ్యూహం అమలు...స్వీయపర్యవేక్షణ
ఇక ఈ ఆపరేషన్ కు రెండునెలల క్రితమే మావోయిస్టు అగ్రనేతలు వ్యూహం ప్రారంభించినట్లు...ఈ పని పూర్తి చేసే బాధ్యత చలపతికి అప్పగించినట్లు తెలిసింది. దీంతో ఈ ఆపరేషన్ కోసం చురుగ్గా పని పూర్తి చేసే దళ సభ్యులను ఎంపిక చేసుకోవడం మొదలు పరిస్థితులకు అనుగుణంగా ఆయుధాల వినియోగం, సాంకేతిక పరిజ్ఞానం సమన్వయ పరుచుకోవడం వంటి విషయాల్లో వారికి తర్ఫీదు ఇవ్వడం వంటి ప్రతి అంశాన్ని చలపతి స్వీయపర్యవేక్షణలో జరిగిందని పోలీసులు చెబుతున్నారు.
ఆ మిస్టరీ...వీడలేదు.
ఇక ఈ దాడి సందర్భంగా మావోయిస్టులు యథేచ్ఛగా వాకీటాకీలు వాడినట్టు పోలీసుల విచారణలో వెల్లడయింది. మరైతే వీరు నెట్ వర్క్ కనెక్టవిటి కోసం ఏ సెల్ టవర్ వాడారు?...ఆ పాయింట్ ఎక్కడ ఏర్పాటు చేసుకున్నారనే మిస్టరీ ఇంకా వీడకపోవడం పోలీసులను కలవరపరుస్తోంది. మావోయిస్ట్ ల సెల్ ఫోన్ కాల్స్ వివరాల కోసం వివిధ సెల్ టవర్ల వేలాది కాల్స్ ను జల్లెడ పట్టినా ఏమాత్రం ప్రయోజనం లేకపోయిందని తెలిసింది. అదే సమయంలో మావోయిస్టులు వారి దగ్గర ఉన్న స్కానర్ల ద్వారా చుట్టుపక్కల పోలీసుల కాల్స్ ను వినగలిగారని ప్రత్యక్ష సాక్షులు చెబుతుండటం పోలీసు వర్గాలను నివ్వెరపరిచింది. మావోయిస్టుల శాటిలైట్ టెక్నాలజీ వినియోగం వల్లే వారి కాల్స్ వివరాలు కనుగొనలేక పోతున్నామా?...ఒక వేళ అదే నిజమైతే ఇది కూడా ప్రమాదకర అంశంగానే పరిగణించాల్సి ఉంటుందని పోలీసు వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
దాడి తరువాత...రెండు రోజులు మన్యం లోనే
ఇదిలావుంటే అందరూ భావిస్తున్నట్లు టార్గెట్ పూర్తవగానే మావోయిస్టులు వెంటనే ఒడిశాకు పారిపోలేదని తెలిసింది. అలాచేస్తే తమ కదలికలు ఒడిశా పోలీసులకు తెలిసి దొరికిపోయే అవకాశం ఉంటుందని...ఒక వ్యూహం ప్రకారం ఏవోబీలోని హుకుంపేటకు సమీపంలోని ఒక గ్రామంలో మావోయిస్టులు ఏకంగా రెండు రోజులు షెల్టర్ తీసుకున్నట్లు తెలిసింది. అక్కడ ఉండి ఇటు ఆంధ్రా...అటు ఒడిశా పోలీసుల కూంబింగ్ వివరాలపై ఒక అవగాహనకు వచ్చిన తరువాత ఆ గ్రామాన్ని వదిలి ఒడిశాలోకి వెళ్లిపోయారని తెలుస్తోంది.
డిజిపి...ఇక్కడే మకాం!
మరోవైపు ఎపి డిజిపి ఆర్ పి ఠాకూర్ ఇంకా మన్యంలోనే మకాం వేయడం ప్రాధాన్యత సంతరించుకోవడంతో పాటు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. పోలీసుల్లో, ప్రజల్లో నైతిక స్థైర్థ్యం పెంపొందించేందుకే డిజిపి ఆర్పి ఠాకూర్ ఇక్కడ కేవలం పర్యటనతో సరిపెట్టుకోకుండా ఏకంగా బసే ఏర్పాటు చేశారని అర్థంచేసుకోవచ్చు. ఈ క్రమంలో ఆయన తానే స్వయంగా ప్రత్యక్ష సాక్షుల నుంచి మావోయిస్టుల దాడి వివరాలు సేకరించడంతో పాటు పోలీసుల అప్రమప్తతను పరీక్షించేందుకు విశాఖజిల్లా నర్సీపట్నం, చింతపల్లి పోలీసుస్టేషన్లను ఆకస్మిక తనిఖీలు కూడా జరిపారు. అంతేకాదు ఈ దాడికి తాము ప్రతీకారం తీర్చుకొని తీరుతామని డిజిపి ఠాకూర్ పలుమార్లు ప్రకటించడం ఈ దాడి పోలీసులపై ఎంతటి ప్రభావం చూపిందో అర్థం చేసుకోవచ్చు.
హిట్ లిస్ట్ లో...ఆ ఐదుగురు
ఇదిలావుంటే మావోయిస్టులు మరో ఐదుగురు టిడిపి ఎమ్మెల్యేలపై గురిపెట్టారని పోలీసుల విచారణలో తేలిందని సమాచారం. వారిని ప్రజాద్రోహులుగా పరిగణిస్తున్న మావోయిస్టులు గతంలో లాగా సాచివేత ధోరణి కాకుండా వీలైనంత త్వరగా మరో టార్గెట్ పూర్తిచేసి పోలీసులను మరింత ఢిఫెన్స్ లోకి నెట్టాలనే యోచనలో ఉన్నట్లు పోలీసు వర్గాలే విశ్లేషిస్తున్నాయి. తమ టార్గెట్ పూర్తిచేయడానికి అనువుగా ఉండే నలుగురు ఉత్తరాంధ్ర అధికార పార్టీ నేతలతో పాటు పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన వివాదాస్పద టిడిపి ఎమ్మెల్యేని కూడా ఈ హిట్ లిస్ట్ లో చేర్చారట.