ప్రజలను మభ్య పెడుతున్న కేంద్రం:చంద్రబాబు;వేల కోట్లు టిడిపి నేతలు మింగేశారు:సోమూ వీర్రాజు
అమరావతి:అసెంబ్లీ సమావేశాలు టిడిపి,బిజెపి నేతల మద్య మాటల యుద్దానికి వేదికగా మారుతున్నాయి. అటు శాసన సభలోను, ఇటు శాసన మండలి లోను ఈ రెండు పార్టీ మధ్య వాగ్వాదాలు, ఆరోపణలు,ప్రత్యారోపణలు ముమ్మరంగా సాగుతున్న పరిస్థితి.
ఆపరేషన్ గరుడపై డిజిపికి బిజెపి ఫిర్యాదు:బాబును మించిన అవినీతిపరుడు ప్రపంచంలో ఉండరన్న కన్నా
అంతేకాదు సభ వెలుపలు సైతం ప్రెస్ మీట్ లలోను, లేదా మీడియాతో చిట్ చాట్ సదర్భాల్లోనూ ఈ రెండు పార్టీల నేతలు ఒకరిపై మరొకరు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పెట్రోల్ ధరల విషయంలో కేంద్రం ప్రజలను మభ్య పెడుతోందని టిడిపి అధినేత చంద్రబాబు కేంద్ర ప్రభుత్వంపై ఆరోపించగా, రాజధానికి ఇచ్చిన వేలకోట్లు టిడిపి నేతలు మింగేశారని బిజెపి ఎమ్మెల్సీ సోమూ వీర్రాజు మండిపడ్డారు. వివరాల్లోకి వెళితే...
చంద్రబాబు...ఏమన్నారంటే?
అంతర్జాతీయ పరిస్థితుల వల్లే పెట్రోల్ ధర పెరిగిందని, కేంద్ర ప్రభుత్వం ప్రజలను మభ్య పెడుతోందని సీఎం చంద్రబాబు ఆరోపించారు. 2013-14లో ముడి చమురు ధర బ్యారెల్కు రూ.105.52 డాలర్లు, 2015-16లో క్రూడాయిల్ ధర కేవలం 46 డాలర్లకు పడిపోయినప్పుడు కూడా దేశంలో ఇంధన ధరలు తగ్గించలేదని చంద్రబాబు ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు.
ఎలాంటి...చర్యలు తీసుకోలేదు
ప్రస్తుతం బ్యారెల్ చమురు ధర అంతర్జాతీయ విపణిలో రూ.76 డాలర్లుగా ఉందని, 2014లో లీటర్ పెట్రోల్ ధర రూ.49.60 ఉండగా...ప్రస్తుతం పెట్రోల్ ధర రూ.86.70 గా ఉందని చంద్రబాబు వివరించారు. పెట్రోల్, డీజిల్పై కేంద్రం, చమురు సంస్థలు రోజురోజుకూ ధరలు పెంచుతున్నాయని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంధన ధరలు తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం నాలుగేళ్లుగా ఎలాంటి చర్యలు తీసుకోలేదని చంద్రబాబు దుయ్యబట్టారు.
బిజెపిపై...బుద్దా వెంకన్న ఫైర్
బీజేపీ నేతలు కళ్ళు ఉండి చూడలేని స్థితిలో ఉన్నారని ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఎద్దేవాచేశారు. రాష్ట్రానికి ప్రధాని మోడీ చేస్తున్న అన్యాయాన్ని ప్రశ్నించాలని బుద్దా వెంకన్న ప్రజలకు పిలుపునిచ్చారు. మోడీకి బీజేపీ నేతలు చెంచాగిరి చెయ్యడం మానుకోవాలని ఆయన సూచించారు. మోడీని గద్దె దింపాలని దేశ ప్రజలు ఎంతగానో ఎదురుచూస్తున్నారని బుద్ధా వెంకన్న వ్యాఖ్యానించారు.
టిడిపి నేతలపై...మండిపడ్డ సోమూ వీర్రాజు
టిడిపి నేతలు రాజధాని పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని సోమూ వీర్రాజు మండిపడ్డారు. కేంద్రం ఇచ్చిన రూ.32వేల కోట్లను టీడీపీ నేతలు మింగేశారని ఆయన ఆరోపించారు. బీజేపీ, టీడీపీ కలిసి ఉన్నప్పుడు కేంద్రాన్ని పొగుడుతూ తీర్మానాలు చేశారని, విడిపోయాక సభలో మోడీని విమర్శిస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. శాసనమండలి అబద్ధాలకు నిలయంగా మారిందని వీర్రాజు దుయ్యబట్టారు.
అరిగిపోయిన రికార్డులాగా...అదే పేరు
టిడిపి నేతలు అరిగిపోయిన రికార్డులాగా పదే పదే అమరావతి పేరు చెబుతున్నారని...రాజధానికి రూ.1500 కోట్లు ఇస్తే కారిపోతున్న తాత్కాలిక భవనాలను కట్టారని, అదే విషయాన్ని బీజేపీ సభ్యులు ప్రశ్నిస్తే ముప్పేట దాడి చేస్తున్నారని సోము వీర్రాజు మండిపడ్డారు. అమరావతిపై శాసనమండలిలో చర్చ సందర్భంగా ప్రధాని మోడీపై శాసనమండలిలో విమర్శల నేపథ్యంలో మండలి నుంచి సోమూ వీర్రాజు, కంతేటి సత్యనారాయణరాజు వాకౌట్ చేసిన సంగతి తెలిసిందే. ఇదిలావుంటే రాజధానికి జరిగిన అన్యాయం గురించి ప్రధాని మోడీ గురించి ప్రస్తావించడంలో తప్పులేదని టీడీపీ ఎమ్మెల్సీలు పయ్యావుల కేశవ్, మాణిక్య వరప్రసాద్ అన్నారు.