దెబ్బ తిన్న జగన్ వ్యూహం: మూజువాణితో అవిశ్వాసం ఓటమి
హైదరాబాద్: ఓటింగ్ లేకుండానే మూజువాణి ఓటుతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి ప్రభుత్వంపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. ప్రతిపక్ష నేత వైయస్ జగన్ న్యాయమూర్తులకు క్షమాపణ చెప్పే వరకు సభ జరిగేది లేదంటూ పట్టుబట్టిన అధికార పక్షం ఓటింగ్ లేకుండా మూజువాణి ఓటుతో అవిశ్వాస తీర్మానాన్ని ఓడించే వ్యూహాన్ని అనుసరించింది.
మూజువాణి ఓటుతో అవిశ్వాస తీర్మానం వీగిపోయిందని స్పీకర్ కోడెల శివప్రసాద్ ప్రకటించి, బడ్జెట్పై చర్చను ప్రారంభించారు. ఓటింగు కోసం ప్రతిపక్ష వైయస్సార్ కాంగ్రెసు పార్టీ చేసిన విజ్ఞప్తిని స్పీకర్ పట్టించుకోలేదు. ఓటింగ్ జరపాలని ప్రతిపక్ష సభ్యులు పట్టుబడుతుండగానే చర్చను ప్రారంభింపజేసి స్పీకర్ సభను మంగళవారానికి వాయిదా వేశారు.
న్యాయమూర్తులను కించపరిచే విధంగా జగన్ వ్యాఖ్యలు చేశారని, ఆ వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పేవరకు సభ జరిగేది లేదంటూ పట్టుబడుతూ వచ్చిన అధికార తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరించి, మూజువాణి ఓటుతో అవిశ్వాసం వీగిపోయే విధంగా చేయగలిగింది. అంతకు ముందు న్యాయమూర్తులను కించపరిచే విధంగా జగన్ మాట్లాడారనే ఆరోపణలపై సభలో తీవ్ర గందర గోళం చెలరేగింది.
రాజ్యాంగ వ్యవస్థలను జగన్ కించపరుస్తున్నారని పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఆరోపించారు. ఐఏఎస్లను జైలుకు పంపించిన ఘనత జగన్దేనని రామానాయుడు అన్నారు. సభా సమయాన్ని వృథా చేయడం సరికాదని, న్యాయ వ్యవస్థపై జగన్ చేసిన వ్యాఖ్యలను బేషరతుగా ఉపసంహరించుకోవాలని రామానాయుడు సూచించారు.
మంత్రి అచ్చెన్నాయుడు తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకుని క్షమాపణ చెప్పారని, అయినా జగన్ తన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పకపోవడం ఆయన విజ్ఞతకు నిదర్శనమని ఎమ్మెల్యే రామానాయుడు వ్యాఖ్యానించారు. సభా మర్యాదలను తెలుసుకుని బేషరతుగా జగన్ క్షమాపణ చెప్పాలని రామానాయుడు డిమాండ్ చేశారు.
జగన్కు రాజ్యాంగ పరిజ్ఞానం లేదని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఎద్దేవా చేశారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ సభకు జగన్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. న్యాయ వ్యవస్థపై గౌరవం లేకుండా మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. జగన్ బేషరతుగా క్షమాపణ చెప్పాలన్నారు. జగన్ సభా సమయాన్ని వృథా చేస్తున్నారని బుచ్చయ్య చౌదరి ఆరోపించారు.
ప్రతివారం బోనులో నిలబడుతానని జగన్ చెబుతున్నారని, తప్పు చేసిన వారే బోనులో నిలబడుతారని శాసనసభా వ్యవహారాల మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. నోరు జారితే పుచ్చపల్లి సుందరయ్యలాంటి పెద్దవారైనా క్షమాపణలు చెప్పేవారని ఆయన అన్నారు. తానేమీ తెప్పు చేయలేదని జగన్ న్యాయవ్యవస్థను తప్పు పడుతున్నారని ఆయన అన్నారు. క్షమాపణ చెప్తే తప్ప జగన్ సభలో ఉండడానికి వీల్లేదని ఆయన అన్నారు. స్పీకర్ డైరెక్షన్ ఇచ్చినా జగన్ పట్టించుకోవడం లేదని ఆయన అన్నారు. ఎవరి మీదా గౌరవం లేని వ్యక్తి సభలో ఉన్నారని, అటువంటి సభలో తాము ఉండడానికి సిగ్గుపడుతున్నామని ఆయన అన్నారు.
న్యాయమూర్తుల మీద తాను వ్యాఖ్యలు చేయలేదని జగన్ చెప్పారు. మీకున్న రాజకీయ పలుకుబడితో నాపై కేసులు పెట్టించారని ఆయన తెలుగుదేశం పార్టీని విమర్శించారు. చంద్రబాబు అవినీతిని ప్రశ్నిస్తున్నామని ప్రతిపక్షమే లేకుండా చేయాలని చూస్తున్నారని ఆయన అన్నారు. తానేమీ తప్పు చేయలేదని ఆయన అన్నారు. న్యాయవ్యవస్థపై తనకే ఎక్కువ గౌరవం ఉందని ఆయన అన్నారు.
11 కేసుల్లో ముద్దాయిగా కోర్టుకు హాజరువుతున్న వ్యక్తి అడిగే ప్రశ్నలకు తాను సమాధానం ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చిందని మంత్రి మాణిక్యాలరావు అన్నారు. అవిశ్వాసం ఎందుకు పెట్టారో కూడా చెప్పలేనని స్థితిలో జగన్ ఉన్నారని టిడిపి సభ్యురాలు అనిత అన్నారు. తెలిసీ తెలియని జగన్ లాంటివారికి ఏమీ అర్థం కాదని మంత్రి పల్లె రఘునాథ రెడ్డి అన్నారు.
తాము కౌరవసభను చూశామని, స్పీకర్పై రేపు (మంగళవారం) అవిశ్వాస తీర్మానం ప్రతిపాదిస్తామని వైయస్ జగన్ సభ వాయిదా పడిన తర్వాత అన్నారు.