రెండు రాష్ట్రాల్లో కొత్త చరిత్ర: నాదెండ్ల, నిద్రపోలేదని..
హైదరాబాద్: రెండు రాష్ట్రాల్లోనూ కొత్త చరిత్ర ప్రారంభం కాబోతోందని మాజీ శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్ అన్నారు. శాసనసభ సిబ్బంది ఇచ్చిన వీడ్కోలు విందుకు హాజరైన ఆయన, అనంతరం మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర విభజనను వేరే ఉద్దేశంతో చూడాల్సిన అవసరం లేదని నాదెండ్ల మనోహర్ అన్నారు.
ఏ రాష్ట్రంలో లేనన్నీ సమస్యలు ఎదుర్కొన్నామని తెలిపారు. చాలా రోజులు నిద్ర కూడా పోలేదని చెప్పారు. కంప్యూటరైజేషన్ కోసం రూ. 18 కోట్ల గ్రాంట్ తెచ్చామని తెలిపారు. ప్రభుత్వ సహకారం లేక కొన్ని పనులు సాధించుకోలేకపోయామని తెలిపారు. కాగా, ఇటీవల జరిగిన ఎన్నికల్లో తెనాలి నుంచి కాంంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసిన నాదెండ్ల మనోహర్ ఓటమిపాలయ్యారు.
చంద్రబాబును కలిసిన చీరాల ఎమ్మెల్యే
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడును చీరాల శాసనసభ సభ్యుడు ఆమంచి కృష్ణ మోహన్ కలిశారు. ఆయన ఇటీవల జరిగిన ఎన్నికల్లో చీరాల నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. తెలుగుదేశం పార్టీలో చేరేందుకే చంద్రబాబును కలిసినట్లు తెలుస్తోంది.