సభను హుందాగా నడుపుతాం..! చట్టసభల పట్ల ప్రజల్లో గౌవరం పెరగాలన్న ఏపి స్పీకర్..!!
అమరావతి/హైదరాబాద్ : బడ్జెట్ సమావేశాల నిర్వహణపై అదికారులతో ఏపి స్పీకర్ తమ్మినేని సీతారం నిర్వమించిన సమీక్షా సమావేశం ముడిసింది. ఏపీ శాసనసభ బడ్జెట్ సమావేశాల నిర్వహణపై అసెంబ్లీ కమిటీ హాలులో స్పీకర్ తమ్మినేని సీతారాం సీనియర్ ఐఏఎస్ అధికారులు, పోలీసు అధికారులతో వేర్వేరుగా సమావేశమయ్యారు. సమావేశాల నిర్వహణపై ఉన్నతాధికారులకు పలు సూచనలు చేశారు.
అసెంబ్లీ సమావేశాలు సజావుగా నిర్వహించేందుకు అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. 70 మంది సభ్యులు తొలిసారి శాసనసభలో అడుగుపెట్టారని, వాస్తవిక దృక్పథంతో అసెంబ్లీ సమావేశాలు జరిగేలా కృషి చేద్దామని స్పీకర్ ఆకాంక్షించారు. సభలో మాట్లాడేందుకు అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. గత అసెంబ్లీ సమావేశాల్లో ఉద్దేశపూర్వకంగానే కొన్ని అంశాలు చర్చకు రాకుండా చేశారని, ఈసారి అలాంటి పరిస్థితులు ఉండబోవన్నారు. అసెంబ్లీలో అర్థవంతమైన చర్చ జరిగిందని ప్రజలు భావించేలా ఇకపై అసెంబ్లీ నిర్వహణ ఉంటుందన్నారు ఏపి స్పీకర్.
సభ్యులు అడిగిన ప్రశ్నలకు అధికారులకు సకాలంలో సమాధానాలు సిద్ధం చేయాలని స్పీకర్ సూచించారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు ఒక బృందంగా పనిచేసి శాసనసభ గౌరవాన్ని పెంపొందించాలని ఆకాంక్షించారు. ప్రభుత్వ బిల్లులు వాటి ఉద్దేశాలను ఉన్నతాధికారులు అధ్యయనం చేసిన తర్వాత ముసాయిదాను సభ ముందు ఉంచాలన్నారు. ఆదరాబాదరాగా బిల్లులు రూపొందించవద్దని సూచించారు. అసెంబ్లీ సమావేశాలకు కల్పించాల్సిన భద్రతపైనా పోలీసు ఉన్నతాధికారులతో స్పీకర్ సమీక్ష నిర్వహించారు.
భద్రతా ఏర్పాట్లు, బందోబస్తు సమన్వయం కోసం అసెంబ్లీ ఆవరణలో ఓ కమాండ్ కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా నిర్ణయించారు. భద్రతా కారణాలరీత్యా అసెంబ్లీ సందర్శకుల సంఖ్యను పరిమితం చేయాలని స్పీకర్ ఆదేశించారు. రోజుకు ఐదు వందల మంది వరకు మాత్రమే సందర్శకులను అనుమతించాలని స్పష్టం చేశారు. ఈ సమీక్షకు సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం, వివిధ శాఖల కార్యదర్శులు హాజరయ్యారు.