టీ బిల్లుపై చర్చ: విజయమ్మ నిరసన, జగన్ పార్టీ వాకౌట్
హైదరాబాద్: తెలంగాణ ముసాయిదా బిల్లును వ్యతిరేకిస్తూ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సభ్యులు శుక్రవారంనాడు శాసనసభ నుంచి వాకౌట్ చేశారు. శుక్రవారం ఉదయం సభ సమావేశమైన తర్వాత నిరసనలతో సభా కార్యక్రమాలు స్తంభించాయి. దాంతో స్పీకర్ నాదెండ్ల మనోహర్ సభను అర గంట పాటు వాయిదా వేశారు. ఆ తర్వాత తిరిగి సభ సమావేశమైన తర్వాత వైయస్ విజయమ్మ రాష్ట్ర విభజనపై తమ పార్టీ వైఖరిని తెలియజేస్తూ, విభజనను నిరసిస్తూ తమ పార్టీ సభ్యులు వాకౌట్ చేస్తున్నట్లు ప్రకటించారు.
నిరసన తెలియజేయడానికి మాత్రమే అనుమతి ఇచ్చానని స్పీకర్ పదే పదే చెప్పినప్పటికీ విజయమ్మ తన ప్రసంగంలో తమ పార్టీ వైఖరిని వివరించారు. విభజన ముసాయిదా బిల్లుపై ఓటింగ్ జరుపుతారా, లేదా చెప్పాలని, ఓటింగు జరిపితే ఎప్పుడు జరుపుతారో తెలపాలని విజయమ్మ స్పీకర్ను కోరారు. బిల్లులోని షెడ్యూల్ వారీగా ఓటింగు జరుపుతారా, క్లాజులవారీగా ఓటింగు జరుపుతారా తెలపాలని ఆమె విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర విభజనను అడ్డుకోవాలనేదే తమ విధానమని విజయమ్మ చెప్పారు. తాము విభజనకు వ్యతిరేకమని రాష్ట్రపతికి ఇచ్చిన అఫిడవిట్లలో స్పష్టం చేసినట్లు తెలిపారు.
విభజనకు అనుకూలమా, వ్యతిరేకమా అనేది తేల్చాల్సింది శాసనసభనే అని ఆమె అన్నారు. తాము విభజనలో పాలు పంచుకోదలుచుకోలేదని చెప్పారు. తెలుగుజాతిని బలిపెట్టవద్దని ఆమె అన్నారు. సమైక్యంలోనే అభివృద్ధి జరుగుతుందని శ్రీకృష్ణ కమిటీ తెలిపిందని ఆమె గుర్తు చేశారు. విభజనకు కాంగ్రెసు, తెలుగుదేశం సహకరిస్తున్నాయని, సమైక్యం ముసుగులో అధికార, ప్రతిపక్ష పార్టీలు కుట్ర చేస్తున్నాయని ఆమె దుమ్మెత్తి పోశారు.
అరవై ఏళ్ల పాటు కలిసి ఉన్న తెలుగుజాతి ఎందుకు విడిపోవాలని ఆమె అడిగారు. ఎన్టీ రామారావు, వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో తెలంగాణ ఉద్యమం బలంగా లేదని ఆమె అన్నారు. ఆ తర్వాతనే ఎందుకు తెలంగాణ ఉద్యమం తలెత్తిందని ఆమె అడిగారు. బ్రిటిష్, నిజాం హయాంల్లో కూడా కలిసే ఉన్నామని ఆమె చెప్పారు. భావోద్వేగాలున్నాయంటూ చీల్చుకుంటూ పోతే భారతదేశం చీలికలు, పేలికలు అవుతుందని ఆమె అన్నారు.