చంపేవరకు తాళిబొట్టు వేసుకోమన్నారు: నాగరాజు
హైదరాబాద్: తనపై కాల్పులు జరిపించింది తన వియ్యంకుడైన బూతం గోవింద్, ఆయన సోదరుడు శ్రీనివాసేనని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జ్యోతిష్యుడు నాగరాజు శుక్రవారం వెల్లడించారు. శ్రీనివాస్ అనుచరులతో కాల్పులు జరిపించాడని అన్నారు. కాల్పులు జరిపిన వారికి పశ్చిమగోదావరి జిల్లా పోలీసుల అండదండలు ఉన్నాయని నాగరాజు ఆరోపించారు.
ఈ నెల 6వ తేదీ లోపు తనను హతమార్చుతామని బూతం బ్రదర్స్ కుటుంబ సభ్యులు గ్రామంలో ప్రచారం చేస్తున్నారని చెప్పారు. సంవత్సరం క్రితం హత్యకు గురైన బి.దుర్గారావు భార్య నాగమ్మ, వారి బంధువులు తిరుపతమ్మ, కొండమ్మతో పాటు తన కోడలు ఉమాదేవి కూడా తనను హత్య చేసే వరకు తాళిబొట్లు వేసుకోబోమని శపథం చేసినట్టు నాగరాజు చెప్పారు. వారి నుంచి తనకు ప్రాణహాని ఉందన్నారు.
నివాస్, గోవింద్ను పట్టుకునే వరకు ప్రాణరక్షణ లేదన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల ముఖ్యమంత్రులు కేసీఆర్, చంద్రబాబు ఆయా రాష్ట్రాల్లోని కేసులపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని కోరారు. దుర్గారావు హత్యకేసులో సంబంధం లేకున్నా తన పేరు ఇరికించారని ఆవేదన వ్యక్తం చేశారు.
తన భార్య, బిడ్డలపై నెల రోజుల క్రితం ఎఫ్ఐఆర్ నమోదు చేశారని వాపోయారు. తనను హతమార్చేందుకు ఢిల్లీ గ్యాంగ్కు సుపారి ఇచ్చి ఉంటారని అనుమానం వ్యక్తం చేశాడు. కాల్పులు జరిపిన నిందితులను గుర్తుపట్టలేనన్నారు. తన ఇంటి సమీపంలో ఉన్న డ్రైక్లీనింగ్ వ్యక్తి గుర్తుపట్టవచ్చన్నాడు.