ఏపీలో జ్యోతిష్యం Vs వాస్తు ! జగన్కు జై కొడుతున్న జోతిష్యం , బాబుకు సై అంటున్న వాస్తు !
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ముగిశాయి. ఓటర్ల తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమై ఉంది. ఇక ఏ పార్టీకి ఆపార్టీ తమదే విజయం అన్న కాన్ఫిడెన్స్ను వ్యక్తం చేస్తున్నాయి. పోలింగ్ శాతం ఎక్కువగా ఉండటంతో అది ప్రభుత్వ వ్యతిరేకతకు దారి తీసి వైసీపీని అధికారంలోకి తీసుకొస్తుందని ఆ పార్టీ భావిస్తోంది. మరోవైపు సంక్షేమ పథకాలే తమకు తిరిగి అధికారాన్ని కట్టబెడుతాయని టీడీపీ లెక్కలేసుకుంటోంది. గట్టి పోటీలో తాము కూడా ఓ మాదిరిగా సీట్లు గెల్చుకుంటున్నామని జనసేన భావిస్తోంది. అయితే ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో అనేదానిపై కూడా భారీగానే బెట్టింగులు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే జ్యోతిష్యులు ఇప్పుడు బిజీగా అయిపోయారు. వారు ఎవరికి ఓటు వేస్తున్నారో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
నేతలు నాయకుల రాకతో జ్యోతిష్యులు బిజీ బిజీ
ఏపీలో పోలింగ్ ముగిసినా... ఎన్నికల వేడి మాత్రం తగ్గలేదు. ప్రచారంలో భాగంగా విరామం లేకుండా ప్రచారం నిర్వహించిన నాయకులు విశ్రాంతి తీసుకుంటున్నారు. అయితే ఓటు వేసిన ప్రజలు మాత్రం ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో చర్చించుకుంటున్నారు. అదే సమయంలో పందేలు కూడా కాస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు జ్యోతిష్యులు ఫుల్ బిజీగా ఉన్నారు. వారింటి చుట్టూ నేతలు నాయకులు, సాధారణ ప్రజలు తిరుగుతున్నారు. ఏపీ భవిష్యత్తు ఏంటని తెలుసుకుంటున్నారు. ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి ఎవరని జోస్యం చెప్పించుకుంటున్నారు.
చంద్రబాబుకు అనుకూలించని గ్రహాలు..ఓకే అంటున్న వాస్తు
ప్రధాన పోటీ వైసీపీ టీడీపీల మధ్యే జరిగిందని చెబుతున్న జ్యోతిష్యులు ఎవరు గెలిచి అధికారం చేపడుతారన్న విషయంపై గ్రహాలను తిరిగేస్తున్నారు. వారు చెబుతున్న ప్రకారం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు గ్రహాలు అనుకూలించడం లేదని ఆయనకు ఈసారి రాజయోగం దక్కకపోవచ్చని జోస్యం చెబుతున్నారు జోతిష్యులు. 2014లో చంద్రబాబు నాయుడు విజయం సాధించినప్పటికీ ఈ సారి ఎన్నికల్లో ఆయనకు కలిసి రాలేదని జోతిష్యులు అంచనా వేస్తున్నారు. కుజుడు, కేతువు ఆయనకు ఇబ్బందులు సృష్టించాయని చెబుతున్నారు. మే 3 నుంచి నవంబర్ 6, 2019 వరకు కుజుడు కేతువు ఒకే దిశలో పయనించడం ఈ సమయమే చంద్రబాబుకు అత్యంత కీలకం కానుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. అంతేకాదు ఈసారి చంద్రబాబు అనేక సవాళ్లను ఎదుర్కోనున్నారని ప్రముఖ జ్యోతిష్యులు చెప్పారు. ఇక వాస్తు ప్రకారం చంద్రబాబు నాయుడు హైదరాబాదులో కట్టించుకున్న నూతన గృహం ఆయన్ను తిరిగి సీఎం పదవిలో కూర్చోబెడుతాయని వాస్తు పండితులు చెబుతున్నారు.
జగన్కు కలిసొచ్చిన కాలం..ప్రభుత్వం వైసీపీదే..!
ఇక 2014లో స్వల్ప మెజార్టీతో అధికారం కోల్పోయిన వైసీపీకి 2019 ఎన్నికల్లో అన్నీ కలిసొచ్చాయని చెబుతున్నారు. వైయస్ జగన్కు మంచి రోజులు వచ్చాయని వారు జోస్యం చెబుతున్నారు. 2019లో బుద్ద మహాదశ ప్రారంభం కానుండటంతో జగన్కు కలిసొస్తుందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో బలమైన ప్రభుత్వం ఏర్పాటుకు వైసీపీకే అవకాశాలున్నాయని గ్రహాలన్నీ జగన్కు అనుకూలంగా ఉన్నాయని చెబుతున్నారు. ఇక సర్వేలు కూడా చాలావరకు వైసీపీకే అనుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది.
మొత్తానికి సర్వేల జోస్యం ఓ వైపు, జ్యోతిష్యుల జోస్యం ఓ వైపు రెండూ వైసీపీకే అనుకూలంగా ఉన్నాయి. అయితే గత ఎన్నికల్లో కూడా జ్యోతిష్యులు వైసీపీ అధికారంలోకి వస్తుందని చెప్పారని కానీ ఫలితాలు తారుమారయ్యాయని కొందరు వాదిస్తున్నారు. ఎవరి లెక్కలు ఎలా ఉన్నా... మే 23న అసలైన ఓటరు లెక్క బయటపడుతుంది. అంతవరకు వేచిచూడక తప్పదు.