లాంచీ ప్రమాదంలో 22 మంది మృతి: అనుమతులు సరిగాలేవు.. తప్పెవరిది: పవన్ ప్రశ్న
ఏలూరు: తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం మంటూరు, పశ్చిమ గోదావరి జిల్లా కొండ్రుకోట సమీపంలోని వాడపల్లి మధ్య గోదావరి నదిలో బుధవారం మునిగిన పడవ గురువారం ఒడ్డుకు చేరింది. సుమారు 55 మంది ప్రయాణీకులతో వెళ్తున్న పడవ భారీ వర్షం, గాలుల ధాటికి నీట మునిగింది. ఈ ప్రమాదం పెను విషాదాన్ని నింపింది.
బోట్ ప్రమాదం: నది నుండి లాంచీ వెలికితీత, లాంచీలోనే మృతదేహలు, బాబు సందర్శన
ఈ దుర్ఘటనలో 22 మంది మృతి చెందారు. 12 మంది మృతదేహాలను వెలికి తీశారు. మిగతా వాటి కోసం గాలిస్తున్నారు. లాంచీలో ఉన్న తమవారి ఆచూకీ కోసం రెండు రోజులుగా ఎదురు చూసిన వారు మృతదేహాలను కన్నీరుమున్నీరు అవుతున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం చేస్తున్నారు.
60 అడుగుల లోతుకు వెళ్లిన లాంచీ
అక్కడే పోస్టుమార్టం చేసి వారి వారి స్వస్థలాలకు తరలిస్తున్నారు. మంగళవారం సాయంత్రం ప్రమాదం జరిగింది. పోలీసు యంత్రాంగం, ప్రభుత్వ సిబ్బంది రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. లాంచీ నదిలో 60 అడుగుల లోతుకు వెళ్లిపోవడంతో సహాయక చర్యలకు ఇబ్బందికరంగా మారింది. ఉదయం ఎన్డీఆర్ఎఫ్, నేవీ సిబ్బంది నదిలో గాలించి లాంచీని గుర్తించారు. అద్దాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించేందుకు ప్రయత్నించినా సాధ్యపడలేదు.
సహాయక చర్యల్లో 126 మంది
లాంచీ తలుపులు తెరచుకోలేదు. ఫలితంగా తాళ్లు కట్టి ఇతర బోట్లు, క్రేన్ల సాయంతో బోటును బయటకు లాగారు. సీఎం చంద్రబాబు హెలికాప్టర్లో ప్రమాద స్థలానికి చేరుకుని సహాయ చర్యలను పరిశీలించారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్గ్రేసియా ప్రకటించారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్టీఆర్ఎఫ్, నేవీ సిబ్బంది మొత్తం 126 మంది సహాయక చర్యలు చేపట్టినట్లు చంద్రబాబు తెలిపారు.
బోటు నిర్వాహకుల తప్పిదం వల్లే ఘోరం
బుధవారం ప్రమాదం అనంతరం చీకటి కావడంతో ఏం చేయలేకపోయామని చంద్రబాబు చెప్పారు. గురువారం ఉదయం నుంచి సహాయక చర్యలు వేగవంతం చేశామన్నారు. బాధిత కుటుంబాలను చూస్తుంటే బాధ వేస్తోందన్నారు. ప్రమాదానికి కారణమైన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. బోటు నిర్వాహకుల వల్లే ఈ ప్రమాదం జరిగిందన్నారు.
బోటు ప్రమాదంపై పవన్ కల్యాణ్ దిగ్భ్రాంతి
బోటు ప్రమాదంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. లాంచీ ప్రమాదం గురించి తెలియగానే గుండె బరువెక్కింది అన్నారు. రోజువారీ అవసరాలకు ఇతర ప్రాంతాలకు వెళ్లి తిరుగు ప్రయాణంలో ఉన్న గిరిజనులు జలమాధి కావడం ఆందోళన కలిగించిందన్నారు. 60 అడుగుల లోతున లాంచీ మునిగిపోయిందన్నారు. సహాయక చర్యల్లో పాల్గొనాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ప్రభుత్వ నిర్లక్ష్యం గిరిజనులకు శాపం కావొద్దన్నారు. ప్రమాదానికి గురైన లాంచీకి అనుమతులు సరిగా లేవంటే లోపం ఎవరిదని ప్రశ్నించారు. జవాబుదారీతనం లేని పాలనా విధానాలే అమాయకులను బలి చేశాయన్నారు. దుర్ఘటన జరగగానే హడావుడి చేసే పాలకులు సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించాలన్నారు.