atchannaidu:అరెస్ట్ కక్షసాధింపే, జగన్ డైరెక్షన్లోనే ఏసీబీ: యనమల, జవహర్ ఫైర్
ఈఎస్ఐ మందుల కొనుగోళ్లలో అవకతవకలు జరిగాయని అవినీతి నిరోధక శాఖ మాజీమంత్రి అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేసింది. ఇదీ ముమ్మాటికీ కక్షసాధింపు చర్య అని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. అసెంబ్లీ వేదికగా ప్రభుత్వాన్ని నిలదీసే నేత గొంతు నొక్కేందుకు అరెస్ట్ చేశారని మాజీమంత్రి జవహర్ ఆరోపించారు. ప్రశ్నించే గొంతులను అణచివేస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అచ్చెన్నాయుడు అరెస్ట్ కుట్ర అని, ఉద్దేశపూర్వకంగా అదుపులోకి తీసుకున్నారని ఆరోపించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే నేతలను అరెస్ట్ చేసి భయభ్రాంతులకు గురిచేస్తారా అని అడిగారు.
ఈఎస్ఐ స్కాంలో 19 మంది - అచ్చెన్నాయుడు సహా ఇద్దరు డాక్టర్ల అరెస్ట్ - సాయంత్రం కోర్టుకు..
ఎదుగుదల చూసి..
సీఎం జగన్మోహన్రెడ్డిపై మాజీమంత్రి యనమల రామకృష్ణుడు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీసీ నాయకుడు ఎదుగుదలను చూసి సీఎం జగన్ ఓర్వలేకపోతున్నారని ఆరోపించారు. ఈఎస్ఐ మందుల కొనుగోళ్ల సమయంలో అచ్చెన్నాయుడు మంత్రిగా ఉన్నారని.. కానీ ఆయనకు తెలిసి ఏం జరగలేదని చెప్పారు. కుట్ర మోపి మరీ అరెస్ట్ చేయడం సరికాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వ చర్యను ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు.
జగన్ డైరెక్షన్..
రాష్ట్రంలో ఏసీబీ సొంతంగా చేసేదేమీ లేదు అని యనమల ఆరోపించారు. సీఎం జగన్ ఏదీ చెబితే అదే చేస్తుందని తెలిపారు. జగన్ డైరెక్షన్ మేరకు పనిచేస్తున్నారే తప్ప.. సొంతంగా నిర్ణయాలు తీసుకోవడం లేదన్నారు. అచ్చెన్నాయుడు కుటుంబం గత 40 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉంది అని యనమల గుర్తుచేశారు. ఆ కుటుంబంపై ఇప్పటివరకు ఎలాంటి ఆరోపణలు రాలేదని చెప్పారు. మంత్రిగా పనిచేసిన నేతను అరెస్ట్ చేసే సమయంలో కుటుంబసభ్యులకు సమాచారం ఇవ్వాలని.. కానీ ఏసీబీ తీరు సరిగాలేదన్నారు.
ముమ్మాటికీ కిడ్నాపే..
అచ్చెన్నాయుడి అరెస్ట్ చూపించలేదు అని యనమల అన్నారు. అందుకే అతనిని కిడ్నాప్ చేసినట్టు భావిస్తున్నామని తెలిపారు. మరోవైపు అచ్చెన్నాయుడు అరెస్ట్కు సంబంధించి ఏసీబీ జేడీ రవికుమార్ మీడియాకు వెల్లడించారు. ఈఎస్ఐ స్కాంలో మాజీమంత్రి అచ్చెన్నాయుడు సహా డాక్టర్ రమేశ్ కుమార్, డాక్టర్ విజయ్ కుమార్ అరెస్ట్ చేశామని వివరించారు. శుక్రవారం సాయంత్రం విజయవాడ ఏసీబీ కోర్టులో ప్రవేశఫెడతామని చెప్పారు.
19 మంది పాత్ర
అచ్చెన్నాయుడిని అదుపులోకి తీసుకునే సమయంలో నిబంధనలను ఫాలో అయ్యాయని పేర్కొన్నారు. మందులు, వైద్య పరికరాల కొనుగోళ్లలో రూ.150 కోట్ల అవినీతి జరిగిందని గుర్తించామని తెలిపారు. స్కాంలో 19 మంది పాత్ర గుర్తించామని.. డాక్టర్ జనార్థన్, రమేశ్ బాబు, చక్రవర్తిని అదుపులోకి తీసుకుంటామని జేడీ రవికుమార్ తెలిపారు.