ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడు... నాయకత్వ మార్పు టీడీపీకి లాభిస్తుందా ?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టిడిపి బలం పుంజుకునే దిశగా కొత్త కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఏపీ టీడీపీ కొత్త కమిటీపై కసరత్తు దాదాపుగా పూర్తయింది. రాష్ట్రంలో టిడిపి గళాన్ని బలంగా వినిపిస్తున్న సీనియర్ నేత, మాజీ మంత్రి, అచ్చెన్నాయుడుకి అధ్యక్ష బాధ్యతలను అప్పగించేందుకు టీడీపీ అధిష్టానం సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ఈ నెల 27వ తేదీన ఇదే విషయాన్ని అధికారికంగా ప్రకటించనున్నట్లుగా సమాచారం.
తెలంగాణా టీడీపీలో కొత్త రచ్చ .. అధ్యక్షుడిని మార్చాలని చంద్రబాబుకు లేఖలు .. రీజన్ ఇదే
కళా వెంకట్రావు స్థానంలో అచ్చెన్నాయుడు
ప్రస్తుతం టిడిపి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కళావెంకట్రావు స్థానంలో అచ్చెన్నాయుడుకి అధ్యక్షుడిగా పట్నం కట్టనున్నారు. మళ్లీ బీసీ కే పట్టం కట్టడం వెనుక ఉత్తరాంధ్ర కు ప్రాధాన్యత ఇచ్చినట్లుగా, అదేవిధంగా బిసి సామాజిక వర్గానికి సముచిత స్థానం ఇచ్చినట్లుగా అవుతుందన్న కారణాలు ఉన్నట్లుగా తెలుస్తుంది. అచ్చెన్నాయుడు అయితే పార్టీ వాయిస్ ను బలంగా వినిపిస్తారని చాలామంది సీనియర్ నాయకులు అభిప్రాయపడినట్లు సమాచారం. అందుకే టీడీపీ శాసనసభ ఉపనేత అచ్చెన్నాయుడు పేరు చాలాకాలంగా టిడిపి వర్గాలలో వినిపిస్తూ వచ్చింది.
రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ కమిటీలు .. బలోపేతంపై టీడీపీ ప్రధాన దృష్టి
గత ఎన్నికల్లో ఓటమి తర్వాత టిడిపి ఏపీ అధ్యక్షుడిగా ఉన్న కళావెంకట్రావు తప్పించి, ఆయన స్థానంలో కొత్త అధ్యక్షుడి నియామకం జరుగుతుందని పలుమార్లు ప్రచారం జరిగింది. అయినప్పటికీ చంద్రబాబు దీనిపై అధికారికంగా ప్రకటన చేయలేదు . తాజాగా టిడిపి రాష్ట్ర అధ్యక్ష పదవిని అచ్చెన్నాయుడికి అప్పగించి పట్టం కట్టే ఆలోచనలో అధినేత చంద్రబాబు ఉన్నట్లుగా సమాచారం. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పార్టీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియకు సంబంధించి మండల స్థాయి వరకు కమిటీలను పూర్తిచేశారు. సంస్థాగత ఎన్నికల నేపధ్యంలోనే ఆ ప్రక్రియను పూర్తి చేశారు .
త్వరలోనే అధికారికంగా చంద్రబాబు ప్రకటన
ఇక లోక్ సభ నియోజకవర్గాల వారీగా ఇన్చార్జి లను నియమించడం, శాసన సభా నియోజకవర్గాల్లోనూ పార్టీని బలోపేతం చెయ్యటంపై దృష్టి పెట్టటం ,అలాగే పార్టీ రాష్ట్ర కమిటీలను ఏర్పాటు చేయడం కూడా త్వరలోనే పూర్తి చేస్తారని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఇక తెలుగు యువత పదవికి రాయలసీమ నుండి పరిటాల శ్రీరామ్ పేరు ప్రధానంగా వినిపిస్తుంది. త్వరలోనే అధికారికంగా చంద్రబాబు ఏపీ పార్టీ అధ్యక్షుడి పేరును ప్రకటించనున్నట్లు గా తెలుస్తుంది.
Recommended Video
పార్టీ లో నాయకత్వ మార్పు టీడీపీకి లాభం చేకూరుస్తుందా?
ఇప్పటికే ఈఎస్ఐ స్కామ్ లో వైసీపీ ప్రభుత్వ తీరుతో కేసుల్లో చిక్కుకుని ఇబ్బంది పడుతున్న అచ్చెన్నాయుడు ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా సమర్ధంగా పార్టీని ముందు నడిపిస్తారా ? అన్నది తెలియాల్సి ఉంది. ఇప్పటికే ఏపీలో టీడీపీ, వైసీపీ ప్రభుత్వ దెబ్బకు విలవిలలాడుతుంది. టీడీపీ ముఖ్యనేతలు కేసుల్లో చిక్కుకుని ఇబ్బంది పడుతున్నారు. పలువురు పార్టీ ఫిరాయించి దెబ్బ కొడుతున్నారు . ఈ సమయంలో పార్టీ నాయకత్వ మార్పు ఏపీ టీడీపీకి లాభిస్తుందా ? అనేది తేలాల్సి ఉంది .