కరోనా దెబ్బకు దుర్భరంగా ప్రైవేట్ టీచర్ల బ్రతుకులు: ఆదుకోవాలని వైఎస్ జగన్ కు అచ్చెన్నాయుడు విజ్ఞప్తి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ఏడాది కాలంగా కరోనా మహమ్మారి విసిరిన పంజాకు రాష్ట్ర ప్రజల ఆర్థిక పరిస్థితి దారుణంగా తయారైంది. ముఖ్యంగా చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పే టీచర్లు కరోనా దెబ్బకు విలవిలలాడుతున్నారు. గతేడాది కరోనా వ్యాప్తిని కట్టడి చేయడానికి విధించిన లాక్ డౌన్ నేపథ్యంలో స్కూళ్లు, కళాశాలలు మూతపడ్డాయి. ప్రైవేటు యాజమాన్యాలు టీచర్లకు స్కూళ్లు, కళాశాలలు లేని కారణంగా జీతాలు కూడా ఇవ్వకపోవడంతో వారు దుర్భర పరిస్థితులు ఎదుర్కొన్నారు. పాఠశాలల యాజమాన్యాలను గట్టిగా నిలదీస్తే వారు విద్యార్థులు ఇవ్వాల్సిన ఫీజులకు లింక్ పెట్టి టీచర్ల జీతాలు ఇవ్వలేదు.
కరోనా దెబ్బకు ప్రైవేట్ టీచర్లు విలవిల
ఇక ఇటీవల తిరిగి స్కూళ్లు, కళాశాలలు పునః ప్రారంభం కావడంతో కనీసం ఆకలి బాధ అయినా తీరుతుందని భావించిన టీచర్లకు మళ్లీ విపరీతంగా పెరుగుతున్న కేసులతో ప్రభుత్వం ఒకటో తరగతి నుండి తొమ్మిదో తరగతి వరకు విద్యార్థులకు సెలవులు ప్రకటించటం అశనిపాతంగా తయారైంది .అన్నమో రామచంద్రా అని అలమటించే పరిస్థితిలో ప్రైవేట్ స్కూల్స్ లో పనిచేసే టీచర్లు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే టీచర్లకు స్కూల్స్ క్లోజ్ చేసినప్పటికీ ప్రతి నెలా వారికి రావాల్సిన జీతాలు వారి ఖాతాలో పడిపోతాయి. కానీ ప్రైవేట్ స్కూల్ లో పనిచేసే టీచర్ల పరిస్థితి మాత్రం దారుణం .
ఏపీలో దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్న టీచర్ల పరిస్థితిపై స్పందించిన అచ్చెన్నాయుడు
స్కూల్స్ క్లోజ్ చేస్తే టీచర్ల పరిస్థితి అగమ్యగోచరంగా తయారవుతుంది. దుర్భరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ఇక ప్రైవేట్ స్కూల్ టీచర్ల పరిస్థితి పై టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్పందించారు . కరోనా దెబ్బకు ఉపాధ్యాయుల బతుకులు దుర్భరంగా మారాయని పేర్కొన్న అచ్చెన్నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేటు పాఠశాలల్లో దాదాపు ఐదు లక్షల మందికి పైగా టీచింగ్, నాన్-టీచింగ్ స్టాఫ్ ఉన్నారని తెలిపారు.
ఏపీలో టీచర్లకు పదివేల రూపాయల ఆర్థిక సహాయం ఇవ్వాలని అచ్చెన్న డిమాండ్
కరోనా దెబ్బకు స్కూళ్ళు మూతపడి ఉపాధ్యాయులు కార్మికులుగా మారుతున్నారు అని, ఇప్పటి వరకు 25 మంది ప్రైవేటు టీచర్లు మృతిచెందినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదని పేర్కొన్న అచ్చెన్నాయుడు టీచర్లను ఆదుకోవాలని సీఎం జగన్ కు బహిరంగ లేఖ రాశారు. ఒక్కొక్క టీచర్ కు, బోధనేతర సిబ్బందికి కూడా పదివేల రూపాయల ఆర్థిక సహాయం అందించి ప్రభుత్వం ఆదుకోవాలని అచ్చెన్న డిమాండ్ చేశారు. ఇప్పటికే చాలామంది ప్రైవేట్ స్కూల్ లో పనిచేసే టీచర్లు, స్కూల్స్ లేక కూలినాలి చేసుకునే పరిస్థితి ఏర్పడింది.
ప్రభుత్వం ఆదుకోవాలని ప్రైవేటు టీచర్ల విజ్ఞప్తి
పుట్టెడు దుఃఖాన్ని దిగమింగి ప్రైవేట్ స్కూల్ టీచర్లు దుర్భర జీవితాన్ని గడుపుతున్నారు. చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పి భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాల్సిన టీచర్లు పడుతున్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఎవరికీ చెప్పుకోలేక , బాగా చదువుకుని కూలి పనులు చెయ్యలేక నానా అగచాట్లు పడుతున్నారు. తమని ప్రభుత్వం ఆదుకోవాలని ప్రైవేటు టీచర్లు సైతం విజ్ఞప్తి చేస్తున్నారు.