‘మోడీ దిగిరావాల్సిందే, మంచినీళ్లు కూడా ఇవ్వరా?: జగన్ ఒప్పందం అందుకే..’
అమరావతి: ఆంధ్రప్రదేశ్ మంత్రులు కింజారపు అచ్చెన్నాయుడు, దేవినేని ఉమామహేశ్వరరావు వేర్వేరుగా మీడియాతో మాట్లాడుతూ కేంద్రం ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంకటాయపాలెంలో సైకిల్ ర్యాలీలో పాల్గొన్న సందర్భంగా అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడారు.
ఏపీకి ప్రత్యేక హోదా కోసం తెలుగుదేశం చిత్తశుద్ధితో పోరాటం చేస్తోందని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. పార్లమెంటులో గురువారం నాటి పరిణామాలు చూస్తుంటే టీడీపీ ఎంపీల పోరాటాన్ని అణచివేయాలని యత్నిస్తున్నారనే విషయం అర్థమవుతోందని అన్నారు.
మోడీ దిగిరావాల్సిందే..
చిన్న విషయాన్ని సాకుగా చూపి అవిశ్వాసంపై చర్చించకుండా కేంద్రం తప్పించుకుంటోందని మంత్రి అచ్చెన్నాయుడు మండిపడ్డారు. ఐదు కోట్ల ఏపీ ప్రజల పోరాటానికి ప్రధాని నరేంద్ర మోడీ తప్పనిసరిగా దిగిరావాల్సిందేనని అన్నారు.
అందర్నీ కలుపుకుని ముందుకు
రాజకీయాలకతీతంగా అందరినీ కలుపుకుని టీడీపీ ముందుకెళ్తుందోని అచ్చెన్నాయుడు చెప్పారు. అఖిలపక్షానికి రాని పార్టీల వద్దకు స్వయంగా మంత్రులు వెళ్లి.. ఏపీకి న్యాయం కోసం అందరం కలిసి పోరాటం చేయడానికి ముందుకు రావాలని కోరనున్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు.
బాబు ఏపీని నడిచేలా చేశారు
ఇది ఇలా ఉండగా, మరో మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కూడా వెంకటాయపాలెంలో నిర్వహించిన సైకిల్ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఓ మీడియా ఛానల్తో మాట్లాడుతూ.. అప్పుడే పుట్టిన శిశువులాంటి ఏపీని అడుగులేసేలా చంద్రబాబు తీర్చిదిద్దారని అన్నారు. చివరి బడ్జెట్లో కేంద్రం ఏపీకి తీరని అన్యాయం చేసిందని అన్నారు.
మా ఎంపీలకు మంచినీళ్లు కూడా ఇవ్వలేదు..
అభివృద్ధిలో ఏపీ.. గుజరాత్ను దాటి ముందుకెళ్తుందనే ఉద్దేశంతోనే మోడీ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం పార్లమెంటులో తమ సభ్యులపై అనుచితంగా ప్రవర్తించారని, కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వకుండా దుర్మార్గంగా ప్రవర్తించారని మంత్రి దేవినేని అన్నారు.
మోడీతో జగన్ లోపాయికారి ఒప్పందం
కేంద్రంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ లోపాయికారి ఒప్పందం కుదుర్చుకుందని.. అందుకే అన్నాడీఎంకేతోపాటు వైసీపీ ఎంపీలు కేంద్ర వైఖరికి నిరసనగా పార్లమెంటులో విపక్షాలు చేపట్టిన మానవహారంలో పాల్గొనలేదని అన్నారు. ప్రత్యేక హోదా సాధించే వరకు తమ పోరాటం కొనసాగుతోందని మంత్రి తేల్చి చెప్పారు.