ఏపీలో రంగుల రచ్చ..పోలీస్ వాహనాలు వైసీపీ ప్రచార రథాలా?:అచ్చెన్నాయుడు, లోకేష్ ఫైర్
ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి రంగుల పంచాయితీ కొనసాగుతూనే ఉంది. అది తాజాగా జగన్ పుట్టినరోజు నాడు కూడా మరోమారు ఏపీలో రాజకీయ దుమారానికి కారణమైంది. ఏపీలో ప్రభుత్వ భవనాలకు, గ్రామ సచివాలయాలకు , స్మశానాలకు, స్కూల్ లకు ఇలా ఎక్కడపడితే అక్కడ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రంగులనే వేయడం రాజకీయ దుమారం రేపిన విషయం తెలిసిందే. ఏకంగా ప్రతిపక్ష పార్టీలు రంగుల మంత్రిత్వశాఖను ఏర్పాటు చేయాలని ఎద్దేవా చేసిన విషయం కూడా తెలిసిందే.
పోలీస్ బైక్ లకు వైసీపీ రంగులు .. డీజీపీకి అచ్చెన్న లేఖ
ఇదిలా ఉంటే తాజాగా గుంటూరు పోలీసులు బైకులకు వైసిపి రంగులు వేసి , దిశ పోలీసుల కోసం కొత్త బైక్ లను నిన్న ప్రారంభించారు. ఇక ఇది మరోమారు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. దీనిపై టిడిపి నేతలు మండిపడుతున్నారు. టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పోలీస్ షీటీమ్స్ కు ఇచ్చిన వాహనాలపై వైసిపి రంగులు వేయడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ డీజీపీ గౌతమ్ సవాంగ్ కు లేఖ రాశారు. పోలీస్ షీటీమ్స్ కు ఇచ్చిన వాహనాలపై వైసీపీ రంగులు వేయడమే కాకుండా ప్రభుత్వ అధికారులు వాటిని ప్రారంభించి చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడ్డారని ఆయన ఆరోపించారు.
కోర్టులు అక్షింతలు వేసినా మారరా ? ప్రశ్నించిన అచ్చెన్న
ప్రజలను రక్షించే పోలీసులకు రాజకీయ ముద్ర అవసరమా అంటూ అచ్చెన్న ప్రశ్నించారు. మహిళల రక్షణ కోసం టీడీపీ షీ టీమ్స్ ను ఏర్పాటు చేసి షీ టీమ్స్ ను బలోపేతం చేయడానికి 800 వాహనాలకు పైగా సమకూర్చింది అని చెప్పిన అచ్చెన్నాయుడు ఆ వాహనాలకు వైసిపి రంగులద్ది పంపిణీ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే పలు మార్లు సర్వోన్నత న్యాయస్థానం సైతం అక్షింతలు వేసినా వైసీపీ నేతల తీరు మాత్రం మారలేదు అంటూ మండిపడ్డారు .
పోలీసు షీటీమ్స్ వాహనాలకు వైసిపి రంగులు.. ప్రచార రథాలుగా మార్చారు
రంగుల కోసం 3500 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారంటూ ఆరోపించిన అచ్చెన్నాయుడు రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారశైలిపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఎవరికైనా ఒకే విధంగా న్యాయం చేయాలని చేసేలా పని చేయాల్సిన పోలీసు వ్యవస్థను కూడా వైసిపి నాశనం చేస్తుందని విమర్శించారు . పోలీసులపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని వమ్ము చేసేలా ప్రవర్తిస్తున్నారన్నారు . రాత్రింబవళ్లు శాంతిభద్రతలను సంరక్షిస్తూ ప్రజలకు రక్షణ కల్పించే పోలీసులకు రాజకీయ ముద్ర వేసే విధంగా వ్యవహరించడం దారుణమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసు షీటీమ్స్ వాహనాలకు వైసిపి రంగులు వేసి వాటి ప్రచార రథాలు గా మార్చారని నిప్పులు చెరిగారు.
పాత వాహనాలకు వైసీపీ రంగులేసి ..దిశా పేరుతో ఘరానా మోసం : లోకేష్
పోలీసు వాహనాలకు వైసిపి రంగులా అంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి నారా లోకేష్ నిప్పులు చెరిగారు. పాత వాహనాలకు కొత్తగా రంగులు వేసి దిశా పేరుతో ఘరానా మోసం చేస్తున్నారంటూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టారు లోకేష్ . కొంతమంది పోలీసు అధికారుల అత్యుత్సాహం చూస్తుంటే త్వరలో యూనిఫాం కూడా వైసీపీ రంగుల్లోకి మార్చేసేలా ఉన్నారు అంటూ వ్యాఖ్యానించారు. రంగులతో మహిళలకు రక్షణ రాదన్నారు లోకేష్.
మూడు రంగుల మదంతో రోడ్ల మీద పడి మహిళలను వేధిస్తున్న మృగాళ్లను శిక్షించండి : లోకేష్
మూడు రంగుల మదంతో రోడ్ల మీద పడి మహిళలను వేధిస్తున్న మృగాళ్లను శిక్షిస్తే మహిళలు ధైర్యంగా బయటకు రాగలుగుతారు అంటూ నారా లోకేష్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు ఫాక్ట్ చెక్ పేరుతో అవి వైసిపి రంగులు కాదు, శాంతికి చిహ్నాలు అంటూ సమయం వృధా చెయ్యకుండా , మహిళలకు భద్రత కల్పించడం పై పోలీసులు దృష్టి పెడితే మంచిది అంటూ లోకేష్ షీ టీమ్స్ వాహనాలకు వైసిపి రంగులు వేయడం పై తీవ్ర విమర్శలు గుప్పించారు.