వైసీపీ మంత్రులు కుక్కల కంటే హీనంగా..ఖబడ్దార్ మంత్రులారా: కొడాలి నానీ,పేర్ని నానీలకు అచ్చెన్నాయుడు వార్నింగ్
అమరావతి ఉద్యమంలో భాగంగా రాయపూడిలో జరిగిన జన రణభేరి సభలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు ఏపీ మంత్రులు కొడాలి నానీ , పేర్ని నానీలు రివర్స్ కౌంటర్ ఇచ్చారు. అయితే ఏపీ మంత్రులు చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకు ఎన్టీఆర్ కు పట్టిన గతే పడుతుందని చంద్రబాబును ప్రజలు రాజకీయంగా ఎప్పుడో సమాధి చేశారని, మంగళగిరిలో నారా లోకేష్ ను పాతాళానికి తొక్కారని పేర్కొన్నారు. అంతేకాదు వచ్చే ఎన్నికల్లో కుప్పంలో కూడా చంద్రబాబుకు అదే గతి పడుతుందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై టిడిపి నేతలు నిప్పులు చెరుగుతున్నారు.మంత్రులకు వార్నింగ్ ఇస్తున్నారు.
రాజకీయాల్లో ఓనమాలు రాని వారు కూడా చంద్రబాబుపై విమర్శలు చేసేవారే .. కొడాలి నానీకి కౌంటర్
వైసీపీ మంత్రులు కుక్కల కంటే హీనంగా మాట్లాడుతున్నారని ఏపీ టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబుపై విమర్శలు చేస్తున్న వైసీపీ నేతలకు అచ్చెన్నాయుడు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. శుక్రవారం టిడిపి సమావేశంలో మాట్లాడిన ఆయన రాజకీయాల్లో ఓనమాలు రాని వారు కూడా చంద్రబాబుపై విమర్శలు చేసేవారే అంటూ కొడాలి నాని కి కౌంటర్ వేశారు. రాజకీయ భిక్ష పెట్టిన వ్యక్తి పై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.
వైసీపీ నేతలు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడకుంటే .. జాగ్రత్త అంటూ వార్నింగ్
కనీస ఇంగిత జ్ఞానం కూడా లేకుండా మాట్లాడుతున్నారు అంటూ ఫైర్ అయ్యారు. చంద్రబాబుని నోటికొచ్చినట్లు మాట్లాడుతున్న వారిని మనిషి అనాలా .. ఇంకేమైనా అనాలా అంటూ ప్రశ్నించారు. ఆ దేవుడు కూడా వాళ్ళని క్షమించడంటూ శాపనార్థాలు పెట్టారు. వైసీపీ నేతలు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడకుంటే, తగిన మూల్యం చెల్లిస్తారు అంటూ అచ్చెన్నాయుడు వార్నింగ్ ఇచ్చారు . మంత్రుల వ్యాఖ్యలు చాలా బాధ కలిగిస్తున్నాయని పేర్కొన్న అచ్చెన్నాయుడు, 40 ఏళ్ల సీనియర్ రాజకీయ నాయకుడైన చంద్రబాబుపై ఇలాంటి వ్యాఖ్యలు మాట్లాడటం, ఇంత నీచంగా మాట్లాడటం పద్ధతి కాదన్నారు.
అన్నీ రాసుకుంటున్నాం .. ఎవర్నీ వదిలిపెట్టం
వాళ్ళ కంటే ఎక్కువ తాము కూడా మాట్లాడగలమని కాకుంటే తమకు సంస్కారం అడ్డొస్తోంది అన్నారు అచ్చెన్నాయుడు. అంతేకాదు వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని, చంద్రబాబు పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారి పేర్లు రాసుకున్నామని, ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదంటూ వార్నింగ్ ఇచ్చారు. జగన్ కు ఆ మంత్రులు తాబేదార్లు గా పని చేస్తున్నారంటూ అచ్చెన్నాయుడు విరుచుకుపడ్డారు. సహనంతో ఉన్నామని, తమ సహనాన్ని పరీక్షిస్తే వైసీపీ నేతలు రోడ్డుమీద తిరగలేని పరిస్థితి వస్తుందంటూ ఖబడ్దార్ మంత్రులారా అంటూ హెచ్చరించారు.
నోరు అదుపులో పెట్టుకోండి .. దమ్ము ధైర్యం ఉంటే చర్చకు రండి
నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలన్నారు. దమ్ము ధైర్యం ఉంటే అభివృద్ధిపై చర్చకు రావాలని అచ్చెన్నాయుడు సవాల్ విసిరారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జుట్టు మీద తప్ప అన్నింటిపైనా పన్నులు వేసిందని అచ్చెన్నాయుడు ఆరోపించారు. జగన్ ఒక వింత ముఖ్యమంత్రి అంటూ వ్యంగ్యంగా మాట్లాడిన అచ్చెన్నాయుడు ఎన్నికలు పెడితే కరోనా వస్తుందన్న సీఎం, వేలమందితో మీటింగ్ పెడితే కరోనా రాదా అంటూ ప్రశ్నించారు.
జగన్ ను ఓడించటానికి ప్రజలు రెడీగా ఉన్నారు
వైసిపి నాయకులు డ్రామాలాడుతున్నారని ధ్వజమెత్తారు. ఏలూరు ఘటనకు కారణమేంటో బయటకు చెప్పలేని అసమర్ధ దద్దమ్మ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అని మండిపడ్డారు. జగన్ ను చిత్తుగా ఓడించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్న అచ్చెన్న బీసీల కోసం ఎవరేం చేశారో చర్చించడానికి తాము సిద్ధంగా ఉన్నామంటూ సవాల్ విసిరారు.