ఈఎస్ఐ స్కామ్ : అచ్చెన్నాయుడు అరెస్టులో ట్విస్ట్... తెర పైకి కొత్త పాయింట్..
ఈఎస్ఐ మందుల కొనుగోళ్ల కుంభకోణంలో మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్ట్ వ్యవహారం ఏపీ రాజకీయాలను కుదిపేస్తోంది. ఎటువంటి ఆధారాలు లేకుండానే అచ్చెన్నాయుడిని అక్రమంగా అరెస్ట్ చేశారని టీడీపీ ఆరోపిస్తుండగా.. తప్పు చేశారని రుజువైంది కాబట్టే ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారని వైసీపీ చెబుతోంది. జగన్ది రాక్షసానందం అని టీడీపీ విమర్శిస్తుండగా... ఇది ట్రైలర్ మాత్రమే అంటూ వైసీపీ కవ్విస్తోంది. మొత్తంగా అచ్చెన్న అరెస్ట్ వ్యవహారం ఏపీ రాజకీయాలను తీవ్రంగా కుదిపేస్తోంది. ఈ నేపథ్యంలో గతంలో సెంట్రల్ ఈఎస్ఐ బోర్డు సభ్యుడిగా పనిచేసిన బీజేపీ నేత రామ కోటయ్య పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
బీజేపీ నేత ట్విస్ట్
ఈఎస్ఐ డైరెక్టర్గా విజయ్ కుమార్ పనిచేసిన కాలంలో అచ్చెన్నాయుడు మంత్రిగా లేరని రామ కోటయ్య అన్నారు. వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన పితాని సత్యనారాయణ ఆ సమయంలో మంత్రిగా ఉన్నారని చెప్పారు. తాను గుంటూరు డిస్పెన్సరీలో తనిఖీలకు వెళ్లినప్పుడు అవసరం లేని మందులను ఎందుకు కొనుగోలు చేశారని ప్రశ్నించినట్టు చెప్పారు. పైనుంచి ఒత్తిళ్ల కారణంగా కొనుగోలు చేయాల్సి వచ్చిందని వారు బదులిచ్చినట్టు తెలిపారు. ఈఎస్ఐలో స్కామ్ జరిగి ఉండవచ్చునని.. అయితే అది అధికారులకే పరిమితమైందా.. లేక మంత్రి వరకు వెళ్లిందా అన్నది తేలాల్సి ఉందన్నారు.
హంతకుడి తరహాలో అరెస్ట్ చేశారని విమర్శలు
మంత్రి లిఖితపూర్వకంగా కొనుగోళ్లు జరపాలని ఆదేశాలిస్తే.. ఆయన్ను అరెస్ట్ చేయవచ్చునని రామ కోటయ్య అన్నారు.మంత్రి నుంచి లిఖితపూర్వక ఆదేశాలు లేకుండా అధికారులు మందుల కొనుగోళ్లు జరపరాదని.. అలా చేస్తే అధికారులు ఇరుక్కుపోతారని రామ కోటయ్య చెప్పారు. తాజా వ్యవహారంతో చూస్తుంటే.. కొండను తవ్వి ఎలుకను పట్టుకునే లాగా ఉందన్నారు. ప్రజల దృష్టిని మరల్చేందుకే ప్రభుత్వం ఇలా వ్యవహరిస్తోందని.. దీన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. అచ్చెన్నాయుడు అరెస్ట్ జరిగిన తీరు విచారకరమని.. అయితే అవినీతిలో ఆయన పాత్ర ఉందని తేలితే శిక్షించాల్సిందేనని స్పష్టం చేశారు. నిజానికి ఆయన్ను మొదట వివరణ కోరి.. అందుకు ఆయన సహకరించకపోతే అరెస్ట్ చేసి ఉండాల్సిందన్నారు. అంతే తప్ప తెల్లవారుజామున ఇంటికెళ్లి.. ఏదో హంతకుడిని అరెస్ట్ చేసినట్టు చేయడం ఆశ్చరకరంగా ఉందన్నారు.
విజిలెన్స్ రిపోర్టులో అచ్చెన్న పేరు లేదంటున్న టీడీపీ
మరోవైపు టీడీపీ కూడా ఇది కేవలం కక్ష సాధింపు చర్యేనని ఆరోపిస్తోంది. ఈ నెల 16వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉన్న నేపథ్యంలో.. సభలో అచ్చెన్నాయుడు గొంతుక వినిపించకుండా చేసేందుకే అరెస్ట్ చేశారని ఆరోపించారు. నిజానికి ఈఎస్ఐ కేంద్ర ఆధీనంలో నడిచే సంస్థ అని.. రాష్ట్ర ప్రభుత్వానికి కేవలం పర్యవేక్షణ బాధ్యతలు మాత్రమే ఉంటాయని అన్నారు. నిధులు,కొనుగోళ్లన్నీ కేంద్రం ఆధీనంలోనే ఉంటాయన్నారు. కొనుగోళ్లకు రీజినల్ డైరెక్టర్స్,ఈఎస్ఐ డైరెక్టర్స్దే బాధ్యత ఉంటుందని పేర్కొన్నారు. గతంలో ప్రభుత్వం ఇచ్చిన జీవో.51లోనూ ఇదే విషయాన్ని పేర్కొన్నారని చెప్పారు.గతంలో వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన విజిలెన్స్ ఎంక్వైరీ రిపోర్టులోనూ అచ్చెన్నాయుడు పేరు ఎక్కడా లేదన్నారు. డా.సీకే రమేష్ కుమార్,డా.విజయ్ కుమార్,కేపీ చక్రవర్తి,ప్రమోద్ రెడ్డి పేర్లు మాత్రమే ఉన్నాయన్నారు.
Recommended Video
దూకుడుగా వైసీపీ..
మరోవైపు అటు వైసీపీ నేతలు కూడా దూకుడుగానే స్పందిస్తున్నారు. గత ఐదేళ్ల చంద్రబాబు పాలనలో అన్ని శాఖల్లోనూ అవినీతి జరిగిందని, దోపిడీ అంతా ఒక్కొక్కటిగా బయటపడుతుందని కార్మిక మంత్రి గుమ్మనూరు జయరాం అన్నారు. కుంభకోణాలకు పాల్పడిన వారందరినీ ఆధారాల ప్రకారం అరెస్టు చేస్తామన్నారు. అచ్చెన్నాయుడు అరెస్ట్ ఆరంభం మాత్రమేనని.. అవినీతి కేసుల్లో చంద్రబాబు,లోకేష్ కూడా జైలుకు వెళ్లక తప్పదని హెచ్చరించారు. ఆర్నెళ్ల క్రితం డిస్పెన్సరీల్లో తనిఖీలు చేసినప్పుడు.. మందుల కొరత ఉన్నట్లు తెలిసిందని, మెడిసిన్ సప్లై చేసే కంపెనీలకు రూ.300 కోట్లు బకాయిలున్నాయని చెప్పడంతో అనుమానం వచ్చి దర్యాప్తు చేయించామన్నారు. విజిలెన్స్ దర్యాప్తులో రూ.150 కోట్లు అవినీతి జరిగిందని తేలడంతోనే అచ్చెన్నాయుడిని అరెస్టు చేయడం జరిగిందన్నారు.