ఏసీబీ కోర్టులో అచ్చెన్న... అనుచరులతో వెళ్లిన లోకేష్.. అర్ధరాత్రి హైడ్రామా...
ఈఎస్ఐ మందుల కొనుగోళ్లలో స్కామ్కి పాల్పడ్డారంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి,టీడీపీఎల్పీ ఉపనేత అచ్చెన్నాయుడుని అధికారులు విజయవాడలోని ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా న్యాయమూర్తి ఆయన్ను విచారించనున్నారు. అచ్చెన్నాయుడిని ఏసీబీ కోర్టులో హాజరుపరచడంతో టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ తన అనుచరులు, కార్యకర్తలతో కలిసి అక్కడికి చేరుకున్నారు. దీంతో ప్రస్తుతం అక్కడ అర్ధరాత్రి హైడ్రామా కొనసాగుతోంది.
ఏం జరుగుతుందో చూద్దామంటూ లోపలికి వెళ్లిన అచ్చెన్న..
ఏసీబీ కోర్టులో హాజరుపరచడం కంటే ముందు గొల్లపూడిలోని ఏసీబీ ఆఫీసులో అచ్చెన్నాయుడికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ సమయంలో అచ్చెన్నాయుడు తరుపు న్యాయవాదులు కొంతమంది అక్కడికి వచ్చి.. కొన్ని కాగితాలపై ఆయనతో సంతకం తీసుకునే ప్రయత్నం చేశారు. అయితే ఏసీబీ అధికారులు అందుకు అభ్యంతరం చెప్పడంతో ఆ ప్రయత్నం విరమించుకున్నారు. అనంతరం ఏసీబీ కోర్టు లోపలికి వెళ్తున్న క్రమంలో అచ్చెన్న మీడియాతో మాట్లాడారు. లోపలికి వెళ్తున్నా.. ఏం జరుగుతుందో చూద్దామంటూ వెళ్లారు. బయటకొచ్చాక అన్ని విషయాలు చెబుతానన్నారు.
సంఘీభావంగా అక్కడికి వెళ్లిన నారా లోకేష్..
అచ్చెన్నాయుడిని ఏసీబీ కోర్టులో హాజరుపరిచారన్న విషయం తెలిసి నారా లోకేష్ సహా టీడీపీ శ్రేణులు ఆయనకు సంఘీభావంగా పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. అయితే పోలీసులు వారిని లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో ఇరువురి మధ్య స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది. తాము పోలీసులకు సమాచారం ఇచ్చాకే.. తమ నాయకుడిని పరామర్శించేందుకు వచ్చామని లోకేష్ చెప్పారు. కృష్ణా,గుంటూరు రెండు జిల్లాల్లోనూ తమకు పోలీసులు అనుమతులు ఇవ్వడమే కాదు.. ఎస్కార్ట్ కూడా ఇచ్చి పంపించారని చెప్పారు.
న్యాయమూర్తి అనుమతి కావాలన్న పోలీసులు..
పోలీసులే తమకు ఎస్కార్ట్ ఇచ్చి పంపించాక కూడా కోర్టు వద్ద తమను అడ్డుకోవడం సరికాదని లోకేష్ అన్నారు. అయితే పోలీసులు అందుకు ససేమిరా అన్నారు. ఏసీబీ కోర్టు లోపలికి వెళ్లి అచ్చెన్నాయుడిని కలవాలంటే న్యాయమూర్తి అనుమతి తీసుకోవాలని చెప్పారు. దీంతో నారా లోకేష్ ఫోన్ ద్వారా తమ న్యాయవాదులను సంప్రదించి.. ఆ దిశగా ప్రయత్నాలు చేసినప్పటికీ అవేవీ ఫలించనట్టు తెలుస్తోంది. ఈ వార్త రాసే సమయానికి ఇంకా అక్కడ హైడ్రామా కొనసాగుతూనే ఉంది.
Recommended Video
నిమ్మాడలో అచ్చెన్న అరెస్ట్
శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలోని అచ్చెన్నాయుడి స్వగృహంలో శుక్రవారం(జూన్ 12) తెల్లవారుజామున ఏసీబీ అధికారులు ఆయన్ను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అనంతరం ఆయన్ను విజయవాడకు తరలించారు. ఈఎస్ఐలో మందుల కొనుగోళ్లకు సంబంధించి టెండర్లు పిలవకుండానే కేవలం అచ్చెన్నాయుడు నోటి మాటతో.. ఆయన చెప్పిన కంపెనీలకు కోట్ల రూపాయల విలువ చేసే ఆర్డర్స్ ఇచ్చినట్టు విజిలెన్స్ రిపోర్ట్ ఇచ్చింది. రూ.155కోట్లు మేర అవినీతి జరిగినట్టు లెక్క కట్టింది. మరోవైపు టీడీపీ మాత్రం ఇదంతా సీఎం జగన్ కక్ష సాధింపు రాజకీయాలు అని విమర్శిస్తోంది.