వైసీపీ రెబల్ రఘురామ సంచలనం.. నర్సాపురానికి పయనం... ఏడాది తర్వాత సొంత ఇలాఖాకు.. ఏం జరగబోతుంది?
వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఎట్టకేలకు తన సొంత ఇలాఖాలో అడుగుపెట్టబోతున్నారు. దాదాపు ఏడాది కాలంగా నర్సాపురానికి దూరంగా ఉన్న ఆయన... శుక్రవారం(ఫిబ్రవరి 26) నియోజకవర్గంలోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఈ మేరకు ఫేస్బుక్లో తన పర్యటన వివరాలను వెల్లడించారు. మూడు రోజుల పాటు భీమవరంలోని క్యాంపు కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉండనున్నట్లు తెలిపారు. అయితే ఇన్నాళ్లు ముఖం చాటేసిన ఎంపీ ఇప్పుడు నియోజకవర్గానికి వస్తుండటంతో ప్రజల నుంచి ఎటువంటి రియాక్షన్ వస్తుందన్నది చర్చనీయాంశంగా మారింది. మరీ ముఖ్యంగా స్థానిక వైసీపీ శ్రేణులు ఆయన్ను కౌంటర్ చేసే అవకాశాలు లేకపోలేదు. అదే జరిగితే నర్సాపురంలో రాజకీయం హీటెక్కే సూచనలు కనిపిస్తున్నాయి.
వైసీపీకి కొరకరాని కొయ్యలా...
వైసీపీ టికెట్పై గెలిచినప్పటికీ... సొంత పార్టీ పైనే విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టి పార్టీకి దూరం జరిగారు రఘురామ. అధికారికంగా ఇప్పటికీ ఆయనపై ఎటువంటి చర్యలు లేకపోవడంతో వైసీపీ ఎంపీగానే కొనసాగుతున్నారు. రఘురామపై అనర్హత వేటు అంశం చాలాకాలంగా లోక్సభ స్పీకర్ ఓం బిర్లా వద్ద పెండింగ్లో ఉంది. దీనిపై స్పీకర్ ఎప్పుడు తేలుస్తారో తెలియదు. దీంతో వైసీపీ ఎంపీగా కొనసాగుతూనే ఆ పార్టీకి కొరకరాని కొయ్యలా తయారయ్యారు రఘురామ. రచ్చబండ పేరుతో నిత్యం వైసీపీ పాలనపై,సీఎం జగన్ విధానాలపై ఆయన విమర్శలు గుప్పిస్తున్నారు.
రఘురామ కనిపించట్లేదంటూ గతంలో...
గతేడాది సంక్రాంతి నుంచి రఘురామ కృష్ణంరాజు మళ్లీ నియోజకవర్గంలో అడుగుపెట్టలేదు. దీంతో ఏడాదికాలంగా అక్కడ అభివృద్ది పనులన్నీ ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్నట్లుగా ఉన్నాయి. లాక్డౌన్ సమయంలోనూ తమ కష్టాలను పట్టించుకున్న పాపాన పోలేదని నియోజకవర్గ ప్రజలు ఆయనపై ఆగ్రహంగా ఉన్నారు. రఘురామ కృష్ణంరాజు కనిపించట్లేదు... ఎవరికైనా తెలిస్తే చెప్పండి అంటూ గతంలో వైసీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెట్టారు. అయితే వీటన్నింటినీ రఘురామ తేలిగ్గానే తీసుకున్నారు. ఎవరెన్ని విమర్శలు చేసినా నియోజకవర్గానికి దూరంగా కేవలం ప్రెస్మీట్లకు పరిమితమయ్యారు.
అలా కవర్ చేసుకున్న రఘురామ...
నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో లేకుండా హైదరాబాద్కు,ఢిల్లీకి పరిమితమైన రఘురామ... ఇన్నాళ్లు దాన్ని మరో విధంగా కవర్ చేసుకుంటూ వచ్చారు. కేవలం నర్సాపురానికే పరిమితం కాకుండా తాను రాష్ట్ర ప్రజలందరి తరుపున ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నానని... రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలపై గొంతెత్తుతున్నానని చెప్పుకొచ్చారు. అంతేకాదు,ఒకవేళ తాను నియోజకవర్గంలో అడుగుపెడితే... ఏదో సాకుతో తనను అరెస్టు చేసేందుకు వైసీపీ ప్లాన్ సిద్దం చేసిందని గతంలో ఆరోపించారు. అలాంటిది ఎట్టకేలకు ఇప్పుడాయన నర్సాపురంలో అడుగుపెడుతుండటంతో వైసీపీ శ్రేణుల రియాక్షన్ ఎలా ఉండబోతుందన్నది హాట్ టాపిక్గా మారింది.
ఏం జరుగుతుందో...
వైసీపీపై విమర్శల విషయంలో రఘురామ చాలా దూరం వెళ్లారు. ఆంధ్రప్రదేశ్లో ఒక ప్లాన్ ప్రకారం విదేశీ నిధులతో క్రైస్తవ మత వ్యాప్తి జరుగుతోందని జగన్ను టార్గెట్ చేశారు. దళిత క్రిస్టియన్లతో వైసీపీ తనపై దాడికి యత్నిస్తోందన్నారు. అంతేకాదు,అమరావతి రాజధాని రెఫరెండంపై ఎన్నికలు నిర్వహిస్తే సీఎం జగన్పై తాను 2లక్షల మెజారిటీతో గెలుస్తానని గతంలో వ్యాఖ్యానించారు. దమ్ముంటే జగన్ ఎన్నికలకు వెళ్లాలని సవాల్ విసిరారు. మరోవైపు,రఘురామపై గ్రామ వాలంటీర్ను నిలబెట్టినా భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని వైసీపీ నేతలు ఆయన సవాల్ను తిప్పికొట్టిన సంగతి తెలిసిందే. రాజకీయంగా రఘురామకు-వైసీపీకి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఆయన నర్సాపురం పర్యటన ఎలా సాగుతుందో వేచి చూడాలి.