
ఆత్మకూరులో చంద్రబాబు చాణక్యం.. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు??
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు తన రాజకీయ చాణక్యాన్ని ప్రదర్శించడంతో ఆయన అనుకున్న లక్ష్యాన్ని సులువుగా చేరుకున్నారు. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్న చందంగా తన టార్గెట్ను పూర్తిచేసుకున్నారు. ఆత్మకూరులో అసలు అభ్యర్థినే నిలబెట్టనప్పుడు లక్ష్యం ఎలా నెరవేరిందన్న సందేహం మీకు రావచ్చు.. కానీ అక్కడే అసలైన రాజకీయం ఇమిడివుంది. తనను అందరూ రాజకీయ చాణక్యుడు అని ఎందుకు పిలుస్తారో మరోసారి నిరూపించారు చంద్రబాబు.

డిపాజిట్ దక్కించుకోలేని బీజేపీ
ఆత్మకూరు ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున అభ్యర్థిని నిలబెట్టలేదు. నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించే వ్యక్తి మరణించినప్పుడు వారి కుటుంబంలోని వ్యక్తిని నిలబెడితే పోటీకి దూరంగా ఉండాలనే సాంప్రదాయాన్ని మొదటినుంచి తెలుగుదేశం పాటిస్తోంది. గౌతమ్రెడ్డి హఠాన్మరణంతో ఆయన సోదరుడు విక్రమ్రెడ్డిని అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బరిలోకి దింపింది. జనసేన కూడా తెలుగుదేశం పార్టీ సాంప్రదాయాన్నే పాటించడంతో వాస్తవానికి ఎన్నిక ఏకగ్రీవం కావాలి. కానీ బీజేపీ బరిలో నిలవడంతో ఎలాగైనా లక్ష ఓట్ల మెజారిటీని సాధించాలనే లక్ష్యంతో వైసీపీ పట్టుదలను ప్రదర్శించినప్పటికీ 82వేల ఓట్ల మెజారిటీతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. బీజేపీ అభ్యర్థికి డిపాజిట్ దక్కలేదు. 19,332 ఓట్లు సాధించగలిగింది. జనసేనతో స్నేహంగా మెలిగివుంటే కనీసం డిపాజిట్ అన్నా దక్కించుకొని పరువు నిలుపుకునేది. కానీ ఆ అవకాశం కూడా లేకపోయింది.

ఢిల్లీ పెద్దలతో దూరం పెరగడానికి వీర్రాజే కారణం
భారతీయ జనతాపార్టీ ఢిల్లీ పెద్దలతో చంద్రబాబుకు దూరం పెరగడానికి ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజే కారణమని బీజేపీ నాయకులు కూడా చెబుతుంటారు. 2019 ఎన్నికల సమయంలో ఏపీలో చంద్రబాబు, ఇతర టీడీపీ నేతలు మాట్లాడిన మాటలను హిందీలోకి తర్జుమా చేయించి మరీ మోడీ, అమిత్ షాలకు పంపించిన ఘనాపాటి సోము వీర్రాజు అంటూ టీడీపీ నేతలు మండిపడుతుంటారు. ఆయన పదవీ కాలం త్వరలోనే పూర్తికావస్తోంది. రెండోసారి ఎంపిక చేయడం అనుమానమేనంటున్నారు రాజకీయ విశ్లేషకులు. పార్టీని ప్రజలకు చేరువ చేసే ఎటువంటి కార్యక్రమాలను నిర్వహించలేకపోవడంతోపాటు తాజాగా జరిగిన ఆత్మకూరు ఉప ఎన్నికల్లో డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోవడమనేది బీజేపీ ఢిల్లీ పెద్దలను అసంతృప్తికి గురిచేస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో ఆయనకు రెండోసారి పదవి దక్కడమనేది అనుమానమే.

ఓట్లు మళ్లించిన తెలుగుదేశం
చంద్రబాబునాయుడు ఇక్కడే చాణక్యం ప్రదర్శించి తెలుగుదేశం పార్టీ ఓటర్లను వైసీపీవైపు మళ్లించారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. దీనివల్ల బీజేపీకి డిపాజిట్ కూడా దక్కలేదు. ఈసారి ఎన్నికల్లో తెలుగుదేశంపార్టీ జనసేన, బీజేపీతో కలిసి పోటీచేయాలనే భావనలో ఉంది. అయితే దీనికి సోము వీర్రాజు వర్గం అడ్డుపడుతోంది. ఇక్కడ డిపాజిట్ కూడా దక్కలేదంటే అధ్యక్షుడిగా ఆయనపై ఢిల్లీలో అసంతృప్తి ముద్ర పడుతుంది. అంతేకాకుండా జనసేనతో సఖ్యతగా మెలిగినా పరువు నిలుపుకునే అవకాశం ఉండేది. కానీ ఈ రెండూ ఇప్పుడు బీజేపీకి దక్కలేదు.

బీఎస్పీ, నోటాకు కూడా బాగానే వచ్చాయి
సాధారణ ఎన్నికలు జరిగితే బీజేపీకి మహా అయితే రెండు నుంచి నాలుగువేల ఓట్ల లోపు వస్తుంటాయి. ఏపీలో ఏ నియోజకవర్గంలోనైనా అంతే. డిపాజిట్ దక్కించుకోవడమే కనా కష్టమవుతుంది. ఆత్మకూరు ఉప ఎన్నికల్లో నోటాకు 4వేలకు పైగా, ఇతరులకు 6వేలకు పైగా, బీఎస్పీకి దాదాపు 5వేల ఓట్లు వచ్చాయి. వీటితో పోల్చుకుంటే బీజేపీకి వచ్చిన ఓట్లు తక్కువ అనే భావన రాజకీయ వర్గాల్లో ఉంది. జనసేనానిని లెక్కచేయకపోవడం, అధికార పార్టీతో అంటకాగుతుండటంలాంటివన్నీ సోముకు మైనస్ అవుతున్నాయి. తాను వైసీపీపై ఎంత పోరాడుతున్నా మిత్రపక్షంగా ఉన్న బీజేపీ అధికారంలో ఉన్న పార్టీ పెద్దలతో సఖ్యతగా మెలుగుతుండటాన్ని పవన్ కల్యాణ్ జీర్ణించుకోలేకపోయారు. అందుకే ఎక్కడా ఆత్మకూరు ఉప ఎన్నికల్లో జనసేన జెండా ఎగరలేదు. చివరగా సోము వీర్రాజువల్ల డిపాజిట్ దక్కించుకోలేకపోతుండటమే కాక, జనసేనాని కూడా దూరమవడమనేది రెండోసారి అధ్యక్షుడిగా ఎంపికవుదామనుకుంటున్న ఆయన ఆశలపై నీళ్లు చల్లినట్లేనని సీనియర్ రాజకీయవేత్తలు సైతం భావిస్తున్నారు.