నా చరిత్రలో లేదు: చంద్రబాబు, లోకేష్ హౌస్ అరెస్ట్, భారీగా పోలీసులు, మాజీ సీఎం వార్నింగ్
అమరావతి: ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అరాచక పాలన కొనసాగిస్తున్నారంటూ చలో పల్నాడుకు పిలుపునిచ్చిన నేపథ్యంలో మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేష్లను ముందస్తు భద్రత చర్యల్లో భాగంగా పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. దాదాపు బుధవారం మొత్తం వారిని బయటికి రాకుండా అడ్డుకున్నారు.
చరిత్రలో చూడలేదు..
ఈ క్రమంలో చంద్రబాబు నాయుడు వైసీపీ సర్కారుపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ రాష్ట్రంలో అరాచకపాలన కొనసాగిస్తున్నారని, రాష్ట్ర చరిత్రలో ఇలాంటి పాలనను తాను చూడలేదని ఆయన మండిపడ్డారు. ఈ ప్రభుత్వం మానవ హక్కులు, ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తోందని ధ్వజమెత్తారు.
చంద్రబాబు వార్నింగ్
తమను అరెస్ట్ చేసి ప్రజాస్వామ్య పోరాటాన్ని అడ్డుకోలేరని ఏపీ ప్రభుత్వాన్ని, పోలీసులను చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. జగన్ పాలనకు వ్యతిరేకంగా బుధవారం రాత్రి 8గంటల వరకు ఆయన నిరాహారదీక్షను కొనసాగించారు. చంద్రబాబుతోపాటు దేవినేని అవినాశ్, కేశినేని నాని, భూమా అఖిలప్రియలు ఉన్నారు.
ఇంట్లోనే నిర్బంధం..
చలో ఆత్మకూరులో పాల్గొనేందుకు చంద్రబాబు ఇంటి నుంచి బయటికి వెళ్లే సమయంలోనే భారీగా చేరుకున్న పోలీసులు ఆయనను అక్కడే అడ్డుకున్నారు. గేటు నుంచి బయటికి వెళ్లకుండా కట్టడి చేశారు. ఆ తర్వాత ఆయనను ఇంట్లోనే నిర్బంధించారు పోలీసులు. దీంతో ఆయన నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ప్రభుత్వం, పోలీసులకు వ్యతిరేకంగా నేతలు, కార్యకర్తలు నినాదాలు చేశారు.
మంచి పద్ధతి కాదు..
తమ పార్టీ చలో ఆత్మకూరుకు పిలుపునిచ్చిన నేపథ్యంలో రాష్ట్రంలో టీడీపీ నేతల నిర్బంధకాండ జరుగుతోందని మండిపడ్డారు. అమరావతిలో తన నివాసం ముందు మీడియాతో మాట్లాడుతూ.. తమ పార్టీ నేతలు, కార్యకర్తలను నిర్బంధిస్తున్నారని అన్నారు. నేతలను అరెస్టులు చేయడం, మాజీ మంత్రి అచ్చెన్నాయుడును పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పడం మంచి పద్ధతి కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
జగన్పై పరోక్ష విమర్శలు
ఆత్మకూరులో 120 ఎస్సీ కుటుంబాలు శిబిరంలో ఉంటే అక్కడికి భోజనాలు కూడా రానీయకుండా అడ్డుకుంటున్నారని చంద్రబాబు మండిపడ్డారు. పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని, ఈ ఘటనలన్నీ రాష్ట్రాన్ని పాలించే వ్యక్తి వ్యక్తిత్వాన్ని తెలియజేస్తున్నాయని జగన్మోహన్ రెడ్డిన ఉద్దేశించి వ్యాఖ్యానించారు. తనను ఎన్ని రోజులు గృహ నిర్భంధంలో ఉంచుతారో చూస్తానని చంద్రబాబు అన్నారు.
అందుకే అరెస్ట్ చేశాం..
ఇది ఇలా ఉండగా, పల్నాడులో ఉద్రిక్తతలు తలెత్తే అవకాశం ఉన్నందువల్లే ముందుస్తు చర్యలో భాగంగా టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడును అడ్డుకొని గృహ నిర్భంధం చేశామని డీజీపీ గౌతం సవాంగ్ తెలిపారు. చలో ఆత్మకూరు కార్యక్రమానికి వెళ్లేందుకు బయల్దేరిన చంద్రబాబును పోలీసులు ఆయన నివాసం వద్ద అడ్డుకున్నారు. గేటుకు తాళం వేసి ఆయనను బయటకు రాకుండా భారీగా పోలీసులు మోహరించారు.