యువ మృగాళ్లు:తొమ్మిదేళ్ల బాలుడిపై లైంగిక దాడి...68ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారం
ప్రకాశం:మానవ మృగంలా ప్రవర్తించిన ఓ యువకుడు తొమ్మిదేళ్ల బాలుడిపై అసహజ లైంగిక దాడికి పాల్పడ్డాడు. అతని వికృత చేష్టల కారణంగా తీవ్రంగా గాయపడిన బాలుడు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
డబ్బులు ఇస్తానని ఆశపెట్టి 4 వతరగతి చదువుతున్న బాలుడిని అదే ఊరికి చెందిన యువకుడు ఊరు చివర తోటల్లోకి తీసుకెళ్లి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. తీవ్రంగా గాయపడి నొప్పితో విలవిల్లాడుతున్న బాలుడిని చూసి తల్లడిల్లిన తండ్రి జరిగిన విషయం తెలుసుకొని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ దారుణం వెలుగు చూసింది. ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలంలోని రమణారెడ్డిపాలెంలో ఈ దారుణం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే...
పోలీసుల కథనం ప్రకారం...రమణారెడ్డిపాలెంలో జరుగుతున్న పోలేరమ్మ జాతర చూద్దామని తొమ్మిదేళ్ల బాలుడు ఇంట్లోనుంచి వీధిలోకి వచ్చాడు. ఈ బాలుడిని గమనించిన అదే గ్రామానికి చెందిన సోబత్తిన వెంకటేశ్ అనే యువకుడు ఆ బాలుడి దగ్గరకు వచ్చి...నాతో వస్తే డబ్బులు ఇస్తానని కావాల్సినవి కొనుక్కోవచ్చని ఆశపెట్టాడు.
దీంతో అమాయకంగా నమ్మిన ఆ బాలుడు వస్తానని చెప్పగానే వెంకటేష్ అతడిని తన బైక్ పై ఎక్కించుకొని ఊరికి దూరంగా ఉన్న జామాయిల్ తోటలోకి తీసుకెళ్లాడు. అక్కడ ఆ బాలుడిపై అసహజ పద్దతుల్లో లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ తరువాత బాలుడిని ఇంటి సమీపంలో దిగబెట్టాడు. బాలుడి పరిస్థితి చూసి విషయం తెలుసుకున్న తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు.
మరోవైపు కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం కలువపాములలో ఓ 20 సంవత్సరాల యువకుడు 68 సంవత్సరాల వృద్ధురాలిపై అత్యాచారానికి పాల్పడిన ఘటన సంచలనం సృష్టించింది. ఆదివారం రాత్రి చోటుచేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఉయ్యూరు రూరల్ పోలీసుల కథనం ప్రకారం...గ్రామానికి చెందిన ఒక వృద్దురాలు ఇంట్లో ఒంటరిగా నిద్రిస్తుండగా ఆ సమయంలో ఆమె నివాసంలోకి చొరబడిన కొడాలి సతీష్ అనే 20 ఏళ్ల యువకుడు ఆమెని బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు.
అనంతరం ఆమె చట్టుప్రక్కలవారికి విషయం చెప్పడంతో తద్వారా సమాచారం తెలుసుకున్న ఎస్సై రామారావు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని ఉన్నతాధికారులకు తెలియపరిచారు. అనంతరం సంఘటనపై విచారణ జరిపిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదుచేశారు. వృద్ధురాలిని వైద్యపరీక్షల నిమిత్తం విజయవాడ ప్రభుత్వ వైద్యశాలకు తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.