షాకింగ్..మంత్రి పేర్నినానిపై హత్యాయత్నం: పదునైన ఆ ఆయుధం: ఆ హత్యతో లింక్ ఉందా?
మచిలీపట్నం: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రవాణాశాఖ మంత్రి పేర్నినానిపై హత్యాయత్నం చోటు చేసుకుంది. మచిలీపట్నంలోని ఆయన నివాసంలోనే ఈ ఘటన సంభవించింది. ఈ హత్యాయత్నం నుంచి మంత్రి తృటిలో తప్పించుకోగలిగారు. ఆయన చొక్కా చిరిగిపోయింది. గుర్తు తెలియని వ్యక్తి ఒకరు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. తాపీతో ఆయనపై దాడి చేశాడు.
Recommended Video
అక్కడే ఉన్న మంత్రి అనుచరులు, పార్టీ నేతలు అతణ్ని అడ్డుకున్నారు. అతణ్ని పట్టుకున్నారు. పోలీసులకు అప్పగించారు. ఆదివారం ఉదయం ఆయన తన నివాసంలో పెద్ద కర్మ కార్యక్రమాలన్ని నిర్వహిస్తోన్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
తల్లి పెద్ద కర్మ కార్యక్రమంలో..
పేర్నినాని తల్లి కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆమె పెద్ద కర్మ కార్యక్రమాన్ని పేర్నినాని ఆదివారం ఉదయం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి అనుచరులు, వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. పెద్ద కర్మ సందర్భంగా నిర్వహించ తలపెట్టిన పూజాదికాలను ముగించుకుని, భోజనాల కోసం బయలుదేరారు. కార్యకర్తలు, నాయకులతో మాట్లాడుతూ గేటు దగ్గరికి చేరుకున్నారు. అక్కడే ఓ వ్యక్తి పేర్ని నాని కాళ్లు మొక్కడానికి ప్రయత్నిస్తున్నట్లు నటించాడు. ఎదురుగా వచ్చిన అతని బెల్ట్ బకిల్లో తాపీ కనిపించింది. ప్రమాదాన్ని శంకించిన అనుచరులు అతణ్ని పట్టుకున్నారు.
నాకేమీ కాలేదు.. ఆందోళన వద్దు: పేర్ని నాని
ఈ దాడిలో తనకు ఏమీ కాలేదని పేర్నినాని స్పష్టం చేశారు. తాను సురక్షితంగా ఉన్నానని చెప్పారు. తనపై దాడి చేసిన వ్యక్తిని గుర్తు పట్టగలనని అన్నారు. తాను క్షేమంగా ఉన్నానని, ఏమీ జరగలేదని స్పష్టం చేశారు. ఈ దాడి చోటు చేసుకున్న వెంటనే పోలీసులు వచ్చి, అతణ్ని తీసుకెళ్లారని వివరించారు. ఈ ఘటనతో కృష్ణా జిల్లా ఉలిక్కి పడింది. పలువురు వైఎస్ఆర్సీపీ నేతలు ఫోన్ చేశారు. పరామర్శించారు. మంత్రి కొడాలి నాని, మచిలీపట్నం లోక్సభ సభ్యుడు వల్లభనేని బాలశౌరి ఆయనకు ఫోన్ చేశారు. సంఘటన గురించి ఆరా తీశారు.
తాపీ మేస్త్రీ నాగేశ్వర రావుగా గుర్తింపు..
పేర్నినానిపై దాడికి పాల్పడిన ఆ వ్యక్తిని తాపీ మేస్త్రీ నాగేశ్వర రావుగా గుర్తించారు. అతణ్ని విచారిస్తున్నారు. అతను ఈ దాడికి పాల్పడటానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని సమాచారం. అన్ని కోణాల్లోనూ పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు. మంత్రికి చేరువగా వెళ్లిన అతని అనుమానాస్పద కదలికలను గుర్తించిన అనుచరులు వెనక్కి లాగేయడంతో ప్రమాదం తప్పిందని చెబుతున్నారు. అనంతరం తప్పించుకుని పారిపోవడానికి ప్రయత్నించగా..పట్టుకున్నారు. దేహశుద్ధి చేశారు. అతని సెల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. అతని నేపథ్యం గురించి ఆరా తీస్తున్నారు.
ఇదివరకు మోకా భాస్కర్ రావు హత్య..
ఇదివరకు మచిలీపట్నంలోనే పేర్నినాని అనుచరుడొకరు దారుణహత్యకు గురైన విషయం తెలిసిందే. మచిలీపట్నం మార్కెట్ యార్డు మాజీ ఛైర్మన్ మోకా భాస్కర్ రావును ఆయన ప్రత్యర్థులు హత్య చేశారు. ఆ హత్యకు, పేర్నినాని మీద చోటు చేసుకున్న హత్యాయత్నానికి సంబంధాలు ఏవైనా ఉన్నాయోమోననే కోణంలో దర్యాప్తు సాగిస్తున్నారు పోలీసులు. పేర్నినాని అనుచరుడు హత్య కేసులో తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు, మాజీమంత్రి కొల్లు రవీంద్ర అరెస్టయిన విషయం తెలిసిందే. అనంతరం ఆయన బెయిల్పై విడుదలయ్యారు.