అందుకే విష్ణును చెప్పుతో కొట్టాను -అమరావతి నేత శ్రీనివాసరావు వివరణ -లైవ్లో దాడిపై పెను దుమారం
రాజధాని అమరావతిపై టీవీ చానెల్ డిబేట్ లైవ్ ప్రసారంలో ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి నేత డాక్టర్ కొలికపూడి శ్రీనివాసరావు చెప్పుతో దాడి చేసిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో పెనుదుమారం రేపింది. ఈ ఘటనపై జాతీయ స్థాయిలోనూ చర్చ జరిగింది. చెప్పుతో దాడిని బీజేపీతోపాటు అధికార వైసీపీ సైతం తీవ్రంగా ఖండించగా, ప్రతిపక్ష టీడీపీ మాత్రం వ్యూహాత్మక మౌనం వహించింది. పేరుమోసిన న్యాయ కోవిదులు సైతం ఈ ఘటనపై తమ అభిప్రాయాలను వెలిబుచ్చారు. కాగా, అసలు దాడికి దారితీసిన పరిణామాలు, ఆ పని ఎందుకు చేయాల్సి వచ్చింది అనే విషయాలపై జేఏసీ నేత శ్రీనివాసరావు వివరణ ఇచ్చారు..
లైవ్ డిబేట్లో విష్ణుపై చెప్పుతో దాడి -అమరావతి జేఏసీ నేతపై ఛానల్ ఆగ్రహం -కులం కోణం -బీజేపీvsటీడీపీ
అసలేం జరిగిందంటే..
ఆంధ్రప్రదేశ్లో మూడు రాజధానుల ఏర్పాటుకు సంబంధించి కోర్టుల్లో వివాదాలు, అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ రైతులు, మహిళల నిరసనలు కొనసాగుతోన్న దరిమిలా, అనూహ్య రీతిలో అమరావతిలో ఇప్పటికే 50 శాతం నిర్మాణం పూర్తయి, పెండింగ్లో ఉన్న భవనాలను పూర్తి చేయాలని జగన్ సర్కారు నిర్ణయించడం, అందుకోసం అప్పులు చేసే ప్రక్రియకు కేబినెట్ ఆమోదించిన నేపథ్యంలో ''గ్రాఫిక్స్ను పూర్తి చేద్దాం'' పేరుతో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్ లో మంగళవారం రాత్రి ఓ లైవ్ డిబేట్ నిర్వహించారు. ఆ చర్చలో పాల్గొన్న బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి, జేఏసీ నేత శ్రీనివాసరావు మధ్య వాగ్వాదం చెలరేగి, ఒక దశలో సహనం కోల్పోయిన జేఏసీ నేత.. విష్ణును చెప్పుతో కొట్టారు. ఆ వెంటనే ఛానల్ వారు సదరు నేతను బయటికి పంపేసి, డిబేట్ల నుంచి బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. ఈ అంశంపై దాదాపు అన్ని రాజకీయ పార్టీలూ ఘాటుగా స్పందించాయి. అసలీ వివాదానికి కారణాలను జేఏసీ నేత శ్రీనివాసరావు బుధవారం వివరించారు..
విష్ణుతో గత పరిచయం లేదు..
లైవ్ డిబేట్ లో చెప్పు దాడి తర్వాత బాధిత బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. జేఏసీ నేత శ్రీనివాసరావు ఎవరో కూడా తెలీదని, 15ఏళ్లుగా టీవీ డిబేట్లకు వెళుతోన్న తనకు ఇలాంటి అనుభవం ఎప్పుడూ ఎదురుకాలేదని, జేఏసీ నేత చర్యల వల్ల పోయేది ఆయన ప్రతిష్టేగానీ, బీజేపీ విలువ తగ్గబోదని చెప్పారు. కాగా, బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డితో గతంలో ఎలాంటి పరిచయం లేదని శ్రీనివాసరావు చెప్పారు. వైఎస్ జగన్ సీఎం అయిన మొదటిరోజే అమరావతిలో నిర్మాణాలను ఆపేశారని, ఆ రోజు నుంచీ రైతులు, జేఏసీతో కలిసి ఉద్యమంలో పని చేస్తున్నానని, ఐఏఎస్ కోచింగ్ సెంటర్ ను మూసేసీ మరీ ఉద్యమంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. అయితే.. విష్ణు వాడిక ఒక పదం వల్లే తాను ఆవేశానికి లోనుకావాల్సి వచ్చిందని తెలిపారు..
అందుకే కొట్టాల్సి వచ్చింది..
''నేను ఎవరో తెలియకుండానే నన్ను టీడీపీ పెయిడ్ ఆర్టిస్ట్ అని విష్ణు ఆరోపించారు. అమరావతి ఉద్యమంలో పెయిడ్ ఆర్టిస్ట్ అనే పదం చాలా దుర్మార్గమైనది. ఉద్యమం చేస్తున్న రైతులను పెయిడ్ ఆర్టిస్టులు అని అవమానించినప్పుడు ప్రతిఒక్కరికీ కడుపు రగిలిపోతుంది. నన్ను ఉద్దేశించి ఆ పదం వాడారు కాబట్టే, క్షణికావేశంలో విష్ణువర్థన్రెడ్డి పట్ల అలా ప్రవర్తించాను. కానీ, జరిగిన దానికి బలమైన కారణాలు ఇంకా ఉన్నాయి..
ఏడాదిగా అతనేం మాట్లాడాడు..
అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ స్థానిక ప్రజలు ఏడాది కాలంగా ఉద్యమిస్తున్నారు. నిజానికి, గడిచిన ఈ ఏడాది కాలంగా బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు మా అందరి(అమరావతి ఉద్యమకారుల) మనసులో ఉన్నాయి. రాజధాని కోసం రైతులు చేసిన త్యాగాలను అవహేళన చేస్తూ విష్ణుగానీ, ఇంకొకరు గానీ మాట్లాడటం సరికాదు. లైవ్ టీవీ డిబేట్ లో జరిగింది ఒక దురదృష్టకరమైన ఘటన. ఆ చర్చలో నేను రైతులందరి తరఫున వెళ్లానేగానీ, ఏనాడూ ఒక కులానికి ప్రతినిధిగా నేను మాట్లాడలేదు. నా మనసులో ఏముందో అదే మాట్లాడుతాను'' అని ఏపీ పరిరక్షణ జేఏసీ నేత కొలికపూడి శ్రీనివాసరావు వివరణ ఇచ్చారు. కాగా,
చెప్పులు వృధాగా వాడొద్దు..
రాజధాని అమరావతిపై లైవ్ డిబేట్ సందర్భంగా బీజేపీ నేతపై జేఏసీ నాయకుడు చెప్పుతో దాడి చేయడంపై ప్రముఖ న్యాయకోవిదుడు, మాజీ సీఐసీ మాడభూషి శ్రీధర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆందోళనను ఒక భారీయంత్రాంగం టోకుగా అప్రతిష్టపాలు చేస్తున్నప్పుడు.. ఒకొక్కరికి సమాధానం చెప్పు. కాని చెప్పులను వృధాగా వాడ కూడదని, అలాగే, సమాధానం చెప్పుడం అనేది సద్వినియోగ చర్య అయితే, చెప్పుతోనే సమాధానం చెప్పడం దుర్వినియోగమే అవుతుందని, చెప్పుకోవడమా, చెప్పు మాట్లాడడమా? అనే విషయాన్ని ఆలోచించుకోవాలని మాడభూషి తన అధికారిక ఫేస్ బుక్ లో రాశారు. ఇక, విష్ణుపై దాడిని వైసీపీ ఖండించగా, ఆ పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు మాత్రం తప్పు బీజేపీ నేతదే అని, పెయిడ్ ఆర్టిస్టు పదం వాడటం పొరపాటేఅని వ్యాఖ్యానించారు.
ప్రభుత్వ రంగ సంస్థలను నడపలేం -4తప్ప మిగతావన్నీ ప్రైవేటుకే: ప్రధాని మోదీ సంచలనం -పూర్తి వివరాలివే