చంద్రబాబుపై దాడి చేసిందెవరు: వైసీపీనా..పోలీసులా: డీజీపీ పైన ఫైర్.. పార్లమెంట్ లో ప్రస్తావన..!
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి పర్యటనలో చోటు చేసుకున్న పరిణామాల పైన రాజకీయంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇది వైసీపీ చేయించిన పనిగా టీడీపీ ఆరోపిస్తోంది. అయితే, డీజీపీ మాత్రం చంద్రబాబు కాన్వాయ్ పైన చెప్పి విసిరింది ఒక రైతు..రాళ్లు వేసిన వ్యక్తి రియల్టర్ అంటూ స్పష్టం చేసారు. అయితే, తాజాగా టీడీపీ చంద్రబాబు బస్సు పైన పోలీసు లాఠీ విసిరారని ఆరోపించారు. ఇది ఎవరు చేసారో డీజీపీ చెప్పాలని మాజీ మంత్రి అచ్చెన్నాయుడు డిమాండ్ చేసారు. చంద్రబాబు పర్యటనలో నిరసనలు..దాడుల వ్యవహారం పైన పార్లమెంట్ లో ప్రస్తావించాలని టీడీపీ భావిస్తోంది. అయితే, టీడీపీ వర్సెస్ వైసీపీగా ఉన్న ఈ వ్యవహారం టీడీపీ వర్సెస్ పోలీసులుగా మారుతోంది.
చంద్రబాబుపై చెప్పులు, రాళ్లు వేసింది రైతు, ఓ వ్యాపారీ....! డీజీపీ వివరణ, ఖండించిన బాబు
చంద్రబాబు పై దాడి చేసెందెవరంటే..
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి పర్యటనలో చోటు చేసుకున్న పరిణామాలు ఇప్పుడు రాజకీయంగా చర్చకు కారణమయ్యాయి. చంద్రబాబు పైన దాడి చేసింది వైసీపీ వర్గీయులే అని..వైసీపీ నేతలు దీని వెనుక ఉన్నారంటూ టీడీపీ ఆరోపిస్తోంది. తాము అధికారంలో ఉన్న సమయంలో వైసీపీ నిరసనలకు దిగితే..శాంతియుతంగా జరిగే వాటికి అనుమతి ఇచ్చామని..కానీ, వైసీపీ ఇప్పుడు వ్యవహరిస్తున్న విధంగా తాము వ్యవహరించి ఉంటే వైసీపీ రోడ్ల మీదకు రాగలిగేదా అంటూ టీడీపీ ప్రశ్నిస్తోంది. చంద్రబాబు ప్రయాణిస్తున్న బస్సు పైకి చెప్పు..రాళ్లు నిరసన వ్యక్తం చేస్తున్న వారు విసిరారు. అదే విధంగా చంద్రబాబు కు వ్యతిరేకంగా నల్లజెండాలతో నిరసనలు నిర్వహించారు. ఈ మొత్తం వైసీపీ నేతల పర్యవేక్షణలోనే జరిగిందని టీడీపీ ఆరోపిస్తోంది. అయితే, డీజీపీ మాత్రం ఈ ఘటన వెనుక ఎవరున్నారో ఇప్పటికే స్పష్టం చేసారు. దీంతో..టీడీపీ నేతలు ఇప్పుడు డీజీపీని టార్గెట్ చేస్తున్నారు.
చంద్రబాబుపై దాడి చేసింది రైతు..రియల్టర్..
అమరావతిలోచంద్రబాబు కాన్వాయ్ పైన దాడి జరిగిన అంశం పైన డీజేపీ సవాంగ్ స్పందించారు. చంద్రబాబుపై చెప్పు విసిరింది ఓ రైతు. రాళ్లు వేసిన వ్యక్తి రియల్టర్. నిరసన వ్యక్తం చేసే హక్కు అందరికీ ఉందంటూ రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ వ్యాఖ్యానించారు. చంద్రబాబు కాన్వాయ్పై రాళ్లు, చెప్పులు విసిరిన ఇద్దరిని పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకున్నారని వెల్లడించారు. అలాఎందుకు చేయాల్సి వచ్చిందని బాధ్యులను ప్రశ్నించగా... తాను రైతునని ఒకరు, రియల్ ఎస్టేట్ వెంచర్ వేసి చంద్రబాబు వల్ల నష్టపోయానని మరో వ్యక్తి చెప్పినట్లు తెలిపారు. ఇటువంటి సమయాల్లో పోలీసులను తప్పుబట్టడం సహజమేనని వ్యాఖ్యానించారు. డీజీపీ వ్యాఖ్యల పైన టీడీపీ నేతలు వరుసగా అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.
డీజీపీ తేల్చాలి..పార్లమెంట్ లో ప్రస్తావన
పోలీసుల తీరుపై టీడీపీ నేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడు తీవ్ర ఆరోపణలు చేశారు. రాజధానిలో పర్యటిస్తుండగా చంద్రబాబు బస్సుపై పోలీస్ లాఠీ విసిరారు.. ఎవరు వేశారో డీజీపీ చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబుపై దాడి ఘటనను పార్లమెంట్లో ప్రస్తావిస్తామని చెప్పారు. చంద్రబాబుపై దాడికి సీఎం జగన్, డీజీపీ సవాంగ్ బాధ్యత వహించాలన్నారు. డీజీపీ ప్రకటన ఆశ్చర్యకరంగా ఉందని వ్యాఖ్యానించారు. రాజధాని ప్రాంత ప్రజలకు ఆగ్రహం ఉంటే అన్నిచోట్లా దాడి జరగాలి కదా అని ప్రశ్నించారు. జగన్ పర్యటనలో కూడా తాము నిరసనలు తెలుపుతామని.. వీటికి డీజీపీ అనుమతి ఇవ్వకపోతే.. ఆయన్ను వైసీపీ కార్యకర్తగా పరిగణిస్తామన్నారు, మంత్రి బొత్స పక్కన అనువాదకుడిని పెట్టుకుని మాట్లాడాలని సూచించారు టీడీపీ ఇన్సైడ్ ట్రేడింగ్ చేస్తే.. ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు.