చంద్రబాబు ఇంటిపై దాడి : వైసీపీ గూండాలతో జగన్ తాలిబన్ పాలన; అచ్చెన్నతో పాటు టీడీపీ ఫైర్
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇంటిని వైసీపీ నేతలు ముట్టడించే ప్రయత్నం చేశారు. కోడెల శివప్రసాద్ వర్ధంతి నాడు అయ్యన్న పాత్రుడు చేసిన వ్యాఖ్యలతో వైసీపీ నేతలు చంద్రబాబు ఇంటి వద్దకు చేరుకొని ఆందోళనకు దిగటంతో చంద్రబాబు ఇంటి దగ్గర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది . సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు అనుచిత వ్యాఖ్యలు చేశారని, చంద్రబాబు టిడిపి నేతలను రెచ్చగొట్టి అనుచిత వ్యాఖ్యలు చేయిస్తున్నారని, చంద్రబాబు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ ఆధ్వర్యంలో వైసీపీ నేతలు చంద్రబాబు ఇంటి ముందు బైఠాయించి ఆందోళనకు దిగారు.
చంద్రబాబు ఇంటివద్ద టీడీపీ వర్సెస్ వైసీపీ .. నేతల బాహాబాహీ .. పోలీసుల లాఠీచార్జ్
టిడిపి నేతలకు వైసీపీ నేతలకు బాహాబాహీ చోటుచేసుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎమ్మెల్యే జోగి రమేష్, మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న ల మధ్య వాగ్వాదం దాడుల దాకా వెళ్ళింది. ఒకరిపై ఒకరు రాళ్లతో దాడి చేసుకోవడంతో, రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గాలను అదుపుచేసే ప్రయత్నం చేశారు. ఈ ఉద్రిక్తత మధ్య బుద్దా వెంకన్న సొమ్మసిల్లి పడిపోయారు. టీడీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. ఎమ్మెల్యే రమేష్ కారు అద్దం ధ్వంసం అయ్యింది. చంద్రబాబు ఇంటి వద్ద ఆందోళనకు దిగిన ఎమ్మెల్యే జోగి రమేష్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. టిడిపి నాయకులను సైతం పోలీసులు కట్టడి చేశారు.
వైసీపీ గూండాల దాడి అంటూ అచ్చెన్న ఆగ్రహం
తాజా పరిణామాలతో తెలుగుదేశం పార్టీ నేతలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల తీరుపై నిప్పులు చెరుగుతున్నారు. చంద్రబాబు ఇంట్లోకి చొరబడిన వైసిపి గుండాలు దాడులకు తెగ బడ్డారని, అడ్డుకున్న టిడిపి నేతలపై రాళ్ల దాడికి దిగారని ఆరోపిస్తున్నారు. వైసిపి గుండాల దాడి దారుణమని టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. సీఎం జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని ఆఫ్ఘనిస్తాన్ లా తయారు చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు ఇంటి ముట్టడికి వైసీపీ గుండాలు ప్రయత్నించడం దారుణమైన చర్య అని ఆయన ఆక్షేపించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు లేవని చెప్పడానికి ఇదే నిదర్శనమని అచ్చెన్నాయుడు అభిప్రాయపడ్డారు.
తాలిబన్లను మించిన వైసీపీ నేతలు .. ఆఫ్ఘనిస్థాన్ లా ఆంధ్రప్రదేశ్
ఫ్యాక్షన్ రాజకీయాలకు అలవాటుపడిన జగన్ రెడ్డి ఏపీని ఆఫ్ఘనిస్తాన్ లా తయారు చేస్తున్నారని, రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పూర్తిగా మంట గలిసిందని ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తే గుండాగిరి చేస్తారా అంటూ నిలదీశారు. వైసీపీ నేతలు తాలిబన్లను మించిపోయారని, వైసీపీ ప్రభుత్వ అరాచక పాలన పై ప్రతిపక్షంగా మాట్లాడడం తప్పా అని ప్రశ్నించిన అచ్చెన్నాయుడు ఎమ్మెల్యే జోగి రమేష్ పై నిప్పులు చెరిగారు. ఆయన ఎమ్మెల్యేనా గూండానా అని ప్రశ్నించారు.
జెడ్ ప్లస్ కేటగిరీ ఉన్న వ్యక్తికే రక్షణ లేదా ? అచ్చెన్న ధ్వజం
మాజీ ముఖ్యమంత్రి, జెడ్ ప్లస్ కేటగిరీ లో ఉన్న చంద్రబాబు ఇంటిపై రౌడీ మూకను వెంటేసుకొని వచ్చి రాళ్లదాడి చేయటం ఏంటని ప్రశ్నించిన అచ్చెన్నాయుడు అధికారాన్ని, పోలీసులను గుప్పిట్లో పెట్టుకుని దాడులను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ పై కేసు నమోదు చేయాలని లేదంటే రాష్ట్రవ్యాప్త ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. ఇదిలా ఉంటే చంద్రబాబు పై జరిగిన దాడి పై టిడిపి నేతలు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో పలు చోట్ల టీడీపీ ఆధ్వర్యంలో ఆందోళనలు సాగిస్తున్నారు.
తొమ్మిదేళ్ళు సీఎంగా చేసిన వ్యక్తి ఇంటికే వెళ్తారా ? ప్రజాస్వామ్యం ఉందా : జేసీ ప్రభాకర్ రెడ్డి
తొమ్మిదేళ్లు పాలించిన వ్యక్తికే భద్రత లేకుంటే సామాన్యుల పరిస్థితి ఏంటని టిడిపి సీనియర్ నాయకుడు జేసీ ప్రభాకర్ రెడ్డి నిప్పులు చెరిగారు . ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఇంటి గేటు వరకూ వెళ్లడం దారుణమని తాడిపత్రి ఎమ్మెల్యే మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా అని ప్రశ్నించారు. జగన్మోహన్రెడ్డి ఎల్లకాలం ముఖ్యమంత్రి సీట్లో కూర్చో లేరని, జగన్ తీరు పట్ల రాష్ట్ర వ్యాప్తంగా అసంతృప్తి చోటు చేసుకుందని పేర్కొన్నారు. జడ్ ప్లస్ కేటగిరి భద్రత ఉన్న వ్యక్తికే రక్షణ లేకపోతే ఎలా అంటూ ప్రశ్నించారు.
రాష్ట్రాన్ని రావణ కాష్టంలా మారుస్తున్న వైసీపీ.. ప్రతిపక్ష నేతలను వదిలిపెట్టారా ?
ఇక వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ చర్య హేయమైన చర్యగా టిడిపి పోలిట్ బ్యూరో సభ్యులు రావుల చంద్రశేఖర రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. జడ్ ప్లస్ భద్రత ఉన్న చంద్రబాబు ఇంటి వద్ద వైసీపీ నేతలకు, కార్యకర్తలకు పని ఏంటని ప్రశ్నించిన ఆయన చంద్రబాబు ఇంటి పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు. చంద్రబాబు ఇంటి పై వైసిపి గుండాల దాడిని ఖండిస్తూ ఉన్నామని టిడిపి మాజీ ఎమ్మెల్యేలు జీవీ ఆంజనేయులు, శ్రీధర్ పేర్కొన్నారు. ఒకపక్క రాష్ట్రాన్ని రావణకాష్టం చేస్తూ అది చాలదన్నట్టు ప్రతిపక్ష నేతల ఇళ్లపై దాడులు చేస్తారా అంటూ టిడిపి నేతలు నిప్పులు చెరిగారు.
తాడేపల్లిలోనే జగన్ ఇల్లు ఉందంటూ .. టీడీపీ నేతల వార్నింగ్
టిడిపి నేతలపై భౌతిక దాడులు చేయడం హేయమైన చర్య అని మండిపడ్డారు. రాజకీయ విమర్శలు ఓర్చుకోలేక పోతే మీరు ఎలాంటి రాజకీయ నాయకులు అంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అసలు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా అంటూ ప్రశ్నించారు. ఇక మరోవైపు చంద్రబాబు నాయుడు ఇంటి వద్ద వైసీపీ నాయకుల ఆందోళనపై తెలుగు తమ్ముళ్లు వార్నింగ్ ఇస్తున్నారు చంద్రబాబు ఇంటికి తాడేపల్లి కొంప ఎంత దూరమో తాడేపల్లి పంపకు చంద్రబాబు గారి ఇల్లు కూడా అంతే దూరమని, దాడులు చేయడం తమకు తెలుసంటూ మండిపడ్డారు. చంద్రబాబు సంయమనం పాటించండి అన్నారు కాబట్టి ఆగుతున్నాము అంటూ పేర్కొన్నారు. జగన్ రెడ్డి ఈ విషయం గుర్తుంచుకోవాలి అంటూ తెలుగు తమ్ముళ్లు వార్నింగ్ ఇస్తున్నారు.