సంచలనం:'జగన్ పై దాడి' శ్రీనివాస్ ను మరోసారి కస్టడీకి కోరుతూ పిటిషన్ వేయనున్న పోలీసులు?
విశాఖపట్నం:ప్రతిపక్షనేత జగన్పై కోడి కత్తితో దాడి చేసిన నిందితుడు జె.శ్రీనివాసరావుకి సంబంధించి పోలీసులు సంచలనం నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది. శ్రీనివాస్ ని మరోసారి తమ కస్టడీకి అప్పగించాలంటూ సోమవారం కోర్టులో పిటిషన్ వేయాలని పోలీసులు భావిస్తున్నట్లు సమాచారం.
అక్టోబర్ 25న వైసిపి అధినేత జగన్ పై హత్యాయత్నం చేసిన అనంతరం నిందితుడు శ్రీనివాసరావుని విచారించిన పోలీసులు ఆ క్రమంలో 26 వతేదీన అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. అయితే ఈ కేసులో నిందితుడు శ్రీనివాస్ ను 6 రోజులు విచారించినా అతడి నుంచి పోలీసులు కీలకమైన సమాచారం రాబట్టలేకపోయారు. దీంతో మరింత సమాచారం సేకరించేందుకు నిందితుడు శ్రీనివాసరావుని మరోసారి తమ కస్టడీకి అప్పగించాలంటూ పోలీసులు పిటిషన్ వేయనున్నట్లు తెలిసింది.
జగన్ పై దాడి నేపథ్యంలో ప్రధాన నిందితుడు శ్రీనివాస్ ను అక్టోబర్ నెల 27 నుంచి నవంబర్ 2 వరకూ ఆరు రోజులపాటు శ్రీనివాసరావుని విచారిస్తూనే, మరోవైపు అతని స్నేహితులు, కుటుంబసభ్యులు, కాల్ డేటా లోని వ్యక్తులు 321 మందిని విచారించి వారి నుంచి సమాచారం సేకరించారు.
అయితే ఈ క్రమంలో శ్రీనివాస్ నుంచి సేకరించిన సమాచారం...ఇతరులు ఇచ్చిన సమాచారానికి మధ్య పొంతన కుదరని నేపథ్యంలో శ్రీనివాస్ నుంచి మరొకసారి సరైన సమాచారం, స్పష్టత, అందుకు సంబంధించిన ఆధారాలు సేకరించాలని పోలీసులు భావిస్తున్నారు.
ఈ క్రమంలో శ్రీనివాస్ ను కస్టడీకి ఇవ్వాలని ఈ నెల రెండునే కోర్టులో పిటిషన్ వేసినప్పటికీ న్యాయస్థానం దానిని తిరస్కరించిన సంగతి తెలిసిందే. తాజాగా ఇదే విషయమై పోలీసులు సోమవారం మరోసారి కోర్టులో కస్టడీ పిటిషన్ వేయాలని నిర్ణయించారని సమాచారం.
Recommended Video