ఏకాంతం కోసం అక్కడికి వెళ్తే..: ప్రేమజంటపై ఊహించని దాడి, పరిస్థితి విషమం..
విజయవాడ:ఫేస్బుక్ పరిచయంతో ప్రేమలో పడ్డ ఓ జంటపై గుర్తు తెలియని వ్యక్తి విచక్షణా రహితంగా దాడి చేశాడు.
ఏకాంతంగా కలవడం కోసం శివారు ప్రాంతానికి వెళ్లిన జంట నుంచి డబ్బు గుంజడమే గాక వారిపై దాడికి పాల్పడ్డాడు. ప్రస్తుతం ప్రాణపాయ స్థితిలో ఆ ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
ప్రేమజంట నేపథ్యం:
నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన గల్లిపోగు షాలెంరాజు(22) రెండేళ్ల క్రితం నూజివీడులో ఇంటర్ సెకడింయర్ చదివాడు. సప్లిమెంటరీ పరీక్షల కోసం నూజివీడులోని మామయ్య ఇంట్లో ఉన్నాడు. ఆ సమయంలో కృష్ణాజిల్లా ముసునూరు మండలానికి చెందిన ఓ యువతి (18)తో ఫేస్బుక్ ద్వారా పరిచయం ఏర్పడింది.
పరీక్ష అయ్యాక అక్కడికి..:
పరిచయం కాస్త ఇద్దరి మధ్య ప్రేమగా మారింది. ప్రస్తుతం ఆ యువతి ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. మంగళవారం ఎగ్జామ్ పూర్తయ్యాక.. సాయంత్రం సమయంలో నూజివీడు శివారులోని శిలువగట్టు వద్ద ఉన్న మరియమాత ఆలయానికి వెళ్లాలనుకున్నారు.
బెదిరించి డబ్బు గుంజుకున్నాడు:
అనుకున్నట్టే మరియమాత ఆలయం వద్దకు వెళ్లారు. సాయంత్రం 6గం. సమయంలో ఆ ప్రాంతం నిర్మానుష్యంగా ఉంది. అదే సమయంలో వీరిద్దరు అక్కడ ఉండటాన్ని చూసిన ఓ గుర్తు తెలియని వ్యక్తి.. దగ్గరికి వచ్చి డబ్బుల కోసం డిమాండ్ చేశాడు. దీంతో యువతి తన వద్దనున్న రూ.3వేలు అతనికి ఇచ్చింది.
విచక్షణారహితంగా దాడి:
ఇంకా డబ్బు కావాలని ఆ వ్యక్తి డిమాండ్ చేయడంతో.. తమ వద్ద అంతే ఉందని ప్రేమికులిద్దరు చెప్పారు. దీంతో వారిపై విచక్షణారహితంగా దాడి చేశాడు. దాడిలో తీవ్రంగా గాయపడిన ఆ ఇద్దరు రక్తపు మడుగులోనే అపస్మారక స్థితిలోకి వెళ్లారు.
పరిస్థితి విషమం..:
బుధవారం ఉదయం మరియమాత ఆలయం వైపు వెళ్లిన కొందరికి యువతీ యువకులు రక్తపు మడుగులో పడి ఉండటం కనిపించింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా.. ఇద్దరిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగానే ఉన్నట్టు తెలుస్తోంది.