పరిటాల శ్రీరాం కారుపై రాళ్ల దాడి: ఏపీలో 75 శాతం పోలింగ్, ఏ జిల్లాలో ఏంత అంటే?
అనంతపురం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లోకసభ, అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సాయంత్రం ఆరు గంటలకు ముగిసింది. ఏపీలో పలు నియోజకవర్గాల్లో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. అనంతపురం, కర్నూలులోని కొన్ని ప్రాంతాల్లో హింసాత్మక సంఘటనలు కనిపించాయి. టీడీపీ, వైసీపీ కార్యకర్తలు పరస్పరం దాడులు చేసుకున్నాయి. చిత్తూరు జిల్లా సుదంలోను ఇరువర్గాల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి. టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ఒకరు మృతి చెందారు. ఈ ఎన్నికల్లో రాజకీయ ప్రత్యర్థుల మధ్య పాత వివాదాలు కూడా తెరపైకి వచ్చాయని చెప్తున్నారు.
ఏమైందో తెలియాలి: ఓటేసిన పవన్ కళ్యాణ్, ఈవీఎం ధ్వంసం.. జనసేన అభ్యర్థి అరెస్ట్! ఏం జరిగిందంటే?
పరిటాల శ్రీరాంపై రాళ్ల దాడి
రాప్తాడు నియోజకవర్గం తోపుదుర్తిలో టీడీపీ అభ్యర్థి పరిటాల శ్రీరామ్ వాహనం పైన వైసీపీ కార్యకర్తలు రాళ్ల దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో పరిటాల శ్రీరామ్ కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. తాడిపత్రి నియోజకవర్గంలోను టీడీపీ, వైసీపీ మధ్య ఘర్షణ జరిగింది. ఇక్కడ జరిగిన దాడిలో స్థానిక టీడీపీ నేత చింతా భాస్కర రెడ్డి మృతి చెందారు. ఇతను జేసీ దివాకర్ రెడ్డి వర్గానికి చెందిన నాయకుడు. వైసీపీ వర్గీయులు వేటకొడవళ్లతో దాడి చేయడంతో అతను మృతి చెందాడని చెబుతున్నారు. చిత్తూరు జిల్లా తంబళ్ళపల్లిలోను టీడీపీ దాడిలో వైసీపీ కార్యకర్త మృతి చెందాడని తెలుస్తోంది. కాగా, హింసాత్మక ఘటనలపై సీఎం చంద్రబాబు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ రౌడీ గ్యాంగులను రాష్ట్రంపైకి ఉసిగొల్పారని ధ్వజమెత్తారు. తాడిపత్రిలో టీడీపీ నేతను వేటకొడవళ్లతో నరుకుతారా.. స్పీకర్ పైనే కిరాతకంగా దాడి చేస్తారా అని మండిపడ్డారు.
మావోయిస్టు ప్రాంతంలో ముందుగానే
ఏపీలో ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. పలుచోట్ల ఈవీఎంలు మొరాయించాడు. దీంతో కొన్నిచోట్ల పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన అరకు, పాడేరు, చోడవరం నియోజకవర్గాల్లో సాయంత్రం నాలుగు గంటల వరకే పోలింగ్ ముగిసింది. కురుపాం, పార్వతీపురం, సాలూరుల్లో సాయంత్రం 7 గంటలకు ముగిసింది. ఐదు గంటల వరకు ఏపీలో 65.96 శాతం పోలింగ్ నమోదయింది. చాలామంది క్యూలో ఉన్నారు.
ఏ జిల్లాలో ఎంత శాతం అంటే?
శ్రీకాకుళంలో 63.77 శాతం, విజయనగరంలో 74.18 శాతం, విశాఖపట్నంలో 55.82 శాతం, తూర్పు గోదావరిలో 69.85 శాతం, పశ్చిమ గోదావరిలో 67.28 శాతం, కృష్ణాలో 64.50 శాతం, గుంటూరులో 61.12 శాతం, ప్రకాశంలో 70.74 శాతం, నెల్లూరులో 66.90 శాతం, కడపలో 63.90 శాతం, కర్నూలులో 63.00 శాతం, అనంతపురంలో 67.08 శాతం, చిత్తూరులో 69.32 శాతం పోలింగ్ జరిగింది. ఆరు గంటల సమయానికి 74.71 శాతం ఓటింగ్ జరిగింది.