నా తడాఖా చూపిస్తా: ఏవీ సుబ్బారెడ్డి, ఆడపిల్లను.. మంత్రి కావడం ఓర్వలేకనే: అఖిలప్రియ
ఆళ్లగడ్డ: కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో మంత్రి భూమా అఖిలప్రియ, ఏవీ సుబ్బారెడ్డిల మధ్య అంతర్గత పోరు కొనసాగుతోంది. ఆదివారం రాళ్ల దాడికి నిరసనగా ఏవీ సుబ్బారెడ్డి వర్గం సోమవారం ఆళ్లగడ్డ బంద్కు పిలుపునిచ్చింది. ఆ తర్వాత దానిపై తగ్గింది. సైకిల్ యాత్ర కొనసాగుతుందని పేర్కొంది. ఈ సందర్భంగా ఏవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో మా తడాఖా చూపిస్తామన్నారు.
కాగా, ఆదివారం ఏవీ సుబ్బారెడ్డి సైకిల్ యాత్రపై గుర్తు తెలియని దుండగులు రాళ్లు, కర్రలు విసిరిన విషయం తెలిసిందే. పార్టీ పిలుపు మేరకు తన అనుచరులతో కలిసి ఏవీ సుబ్బారెడ్డి ఆదివారం సైకిల్ యాత్రకు శ్రీకారం చుట్టారు. శిరువెళ్ల నుంచి యాత్రను మొదలు పెట్టారు. మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో యర్రగుంట్లకు యాత్ర చేరుకుంది. దాదాపు 500 మంది అనుచరులతో సైకిల్ యాత్ర కొనసాగుతున్న సమయంలో స్కార్పియోలో వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు కర్రలు, రాళ్లు ఏవీ సుబ్బారెడ్డి సైకిల్ యాత్రపై విసిరారు.
టెన్షన్: ఆళ్ళగడ్డలో సుబ్బారెడ్డిపై రాళ్ళదాడి, మంత్రిపై ఫిర్యాదు, పోటాపోటీ
తేరుకునేలోపు పారిపోయారు
అంతా క్షణాల్లో జరిగింది. తేరుకునేలోపు దాడి చేసిన వారు అక్కడి నుంచి పారిపోయారు. ఏవీ సుబ్బారెడ్డి సైకిల్ యాత్ర ప్రారంభించినప్పటి నుంచి నిఘా పెట్టి పక్కా ప్రణాళికతోనే దాడికి పాల్పడ్డారని, నాలుగు వాహనాల్లో దాదాపుగా నలభై మంది వచ్చారని ఆరోపిస్తున్నారు. ఈ సంఘటన అనంతరం ఏవీ సుబ్బారెడ్డి అనుచరులతో కలసి ప్రధాన వీధులు, పేరూరు రహదారి, ఎస్సీ కాలనీల్లో సైకిల్ యాత్రను కొనసాగించారు. ఏవీ సైకిల్ యాత్ర చేపట్టిన రోజే ఈ సంఘటన జరిగింది.
దగ్గరలోనే మరో వాహనం, భూమా స్టిక్కర్
ఎర్రగుంట్ల జడ్పీ ఉన్నత పాఠశాల సమీపంలో వాహనం నిలిపి ఉంది. ఆ వాహనంపై భూమా స్టిక్కర్ ఉంది. దుండగులు వచ్చిన వాహననాల్లో ఇది ఒకటని, పోలీసులు స్వాధీనం చేసుకోవాలని ఏవీ సుబ్బారెడ్డి వర్గీయులు ఆందోళన చేశారు. దీంతో ఆ వాహనాన్ని పోలీసు స్టేషన్ తరలించారు. ఈ ఘటనపై ఏవీ సుబ్బారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు గూడూరు సంజీవరాయుడు, కుందు రాముడుతో పాటు 12 మందిపై కేసు నమోదు చేసుకున్నారు. పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు. సీసీ కెమరా పుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించే ప్రయత్నాలు చేస్తున్నారు.
మంత్రి అఖిలప్రియ వర్గీయుల పనే
తనపై రాళ్ల దాడి మంత్రి అఖిలప్రియ వర్గీయుల పనేనని ఏవీ సుబ్డారెడ్డి ఆరోపించారు. శిరివెళ్ల, గోవిందపల్లె ముగించుకొని ఎర్రగుంట్ల గ్రామం సంతలో యాత్ర చేస్తుండగా నాలుగు స్కార్పియో వాహనాల్లో వచ్చిన దుండగులు రాళ్లు, కర్రలతో దాడులు చేశారన్నారు. తాము ప్రతిఘటించేలోగా పారిపోయారన్నారు. భూమా నాగిరెడ్డితో ముప్పై అయిదేళ్లు కలిసి ఉన్నానని, భూమా కుటుంబానికి నిత్యం అండగా ఉన్నానని చెప్పారు.
న్యాయం జరగకుంటే ఏవీ సుబ్బారెడ్డి సత్తా చూపిస్తా
మంత్రి అఖిలప్రియ, తాను ఒకే పార్టీలో ఉన్నామని, ఆమె ఈ వ్యవహారాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినా ఇబ్బంది లేదని ఏవీ సుబ్బారెడ్డి చెప్పారు. ఫ్యాక్షన్ సంస్కృతి వీడి శాంతియుతంగా జీవిస్తున్న తమపై దాడి సరికాదని, ఇది తనను తీవ్ర మనస్తాపానికి గురి చేసిందన్నారు. పోలీసులు చట్టపరమైన చర్చలు తీసుకోవాలన్నారు. న్యాయం జరగకుంటే వ్యక్తిగతంగా పోరాడతానని చెప్పారు. ఏవీ అంటే ఏమిటో చూపిస్తానన్నారు. సైకిల్ యాత్రను ఆపే ప్రసక్తే లేదని అన్నారు.
ఆడపిల్లను, మంత్రి కావడంతో ఓర్వలేకపోతున్నారు
మరోవైపు, ఏవీ సుబ్బారెడ్డి తనకు తండ్రిలాంటి వారని, ఆయన పిల్లలను తన చేతులతో పెంచానని, ఆ పిల్లలకు అన్యాయం చేయాలనే ఆలోచన తనకు కలలో కూడా రాదని భూమా అఖిలప్రియ చెప్పారు. తల్లిదండ్రులు లేని తనకు ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసన్నారు. తాను ఆడపిల్లను అని, రాజకీయాల్లో వచ్చిన వెంటనే ఎమ్మెల్యే, మంత్రి అవడంతో కొందరు ఓర్వలేక తనపై ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఆళ్లగడ్డ లాంటి సున్నితమైన నియోజకవర్గంలో రాజకీయాలు ఎంతో జాగ్రత్తగా చేస్తున్నానని చెప్పారు.
పోలీసులకు సహకరిస్తా
నంద్యాల ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యే రోజా తనను అనరాని మాటలన్నా ఆమె విజ్ఞప్తికే వదిలేశానే తప్ప ఒక్క మాట అనలేదని అఖిలప్రియ చెప్పారు. అలాంటి తాను ఇతరులపై దాడి చేయిస్తానా అని ప్రశ్నించారు. తన తల్లిదండ్రులు శోభా నాగిరెడ్డి, భూమా నాగిరెడ్డిలు తనకు విలువలతో కూడిన రాజకీయం నేర్పారన్నారు. కుయిక్తులు నేర్పలేదన్నారు. రాజకీయాల్లో ఇలాంటివి సరైనవి కాదని, ఏవీపై జరిగిన దాడిలో పోలీసుల విచారణలో ఏమి తేలాలన్నారు. పోలీసులకు పూర్తిగా సహకరిస్తానని చెప్పారు.