దారుణం: ఆభరణాల కోసం కొత్త జంటపై దుండగుల దాడి, భర్త మృతి
విజయగరం: విజయనగరం జిల్లాలో దారుణం జరిగింది. గరుగుబిల్లి మండలం ఐటీడీఏ పార్కు వద్ద బైక్ పైన వెళ్తున్న కొత్తగా పెళ్లైన జంట పైన గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. వారి మెడలో నుంచి బంగారు ఆభరణాలు లాక్కొని పారిపోయారు.
వారు పారిపోతుండగా భర్త ప్రతిఘటించే ప్రయత్నం చేశాడు. దీంతో ఆ దుండగులు భర్త, భార్యపై దాడి చేశారు. ఈ దాడిలో భర్త మృతి చెందాడు. అనంతరం వారు అక్కడి నుంచి పరారయ్యారు. భార్యకు గాయాలయ్యాయి. బాధితులను శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండలం కెల్ల గ్రామానికి చెందిన వారుగా గుర్తించారు.
భార్యను చంపిన భర్త
తూర్పు గోదావరి జిల్లా కడియం మండలం గుబ్బలవారిపాలెం ప్రాంతంలో ఆదివారం దారుణం చోటు చేసుకుంది. మాధవరాయుడుపాలెం గ్రామానికి చెందిన దొంగల శ్రీనివాసుకు పదహారేళ్ల కిందట వేమగిరి గ్రామానికి చెందిన దుర్గతో పెళ్లయింది. శ్రీనివాస్ అదే గ్రామంలో భూమిని కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నాడు. భార్య కూలి పనికి వెళుతుంటుంది. వీరికి ఇద్దరు పిల్లలు. ఇటీవల భర్త అనుమానంతో చిత్రహింసలకు గురిచేస్తుండడంతో భార్య వేరుగా ఉంటోంది.
ఆదివారం ఉదయం ఆరు గంటల సమయంలో భార్య మరో ఇద్దరు మహిళలతో కలిసి కూలి పనికి వెళ్తుండగా పొలంలో పని చేసుకుంటున్న శ్రీనివాస్ చూశాడు. మన మధ్య గొడవలు వద్దని, కాపురానికి రావాలని కోరాడు. పెద్దల సమక్షంలో గొడవ తేలే వరకూ తాను వచ్చేదిలేదని ఆమె చెప్పడంతో ఆవేశంతో కత్తితో దాడి చేశాడు. తొమ్మిదిసార్లు మెడ భాగంపై నరికాడు. ఆమె మృతి చెందింది. నిందితుడు పరారీలో ఉన్నాడు.