జగన్పై దాడి: లోకేష్ నుంచి పవన్ కళ్యాణ్ వరకు నేతల స్పందన, ‘పిరికిపంద చర్య-అనుమానాలు’
హైదరాబాద్: విశాఖపట్నం విమానాశ్రయంలో గురువారం మధ్యాహ్నం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడిని పలువురు రాజకీయ నేతలు ఖండించారు. ఇది పిరికిపందల చర్య అని మండిపడ్డారు. ఇలాంటి దాడుల జరగడం మంచిది కాదని అన్నారు.
Recommended Video
విశాఖ ఎయిర్పోర్టులో వైయస్ జగన్పై కత్తితో దాడి: రక్తంతో తడిసిన షర్ట్, రోజా వార్నింగ్, కంటతడి
పవన్ కళ్యాణ్ స్పందన
‘వైయస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నం అమానుషం. ప్రజాస్వామ్యంలో ఇటువంటి సంఘటనలు జరగరాదని జనసేన బలంగా విశ్వసిస్తుంది. ఈ హత్యా ప్రయత్నాన్ని ప్రజాస్వామ్యవాదులందరూ ముక్తకంఠంతో ఖండించాల్సిన అవసరం ఉంది. ప్రతిపక్ష నేతపై జరిగిన ఈ దాడిని తీవ్రమైనదిగా జనసేన భావిస్తోంది. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంది. గాయం నుంచి జగన్మోహన్ రెడ్డి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. ఈ ఘటనపై సమగ్ర విచారణ చేసి కుట్రదారులను శిక్షించాలి' అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు.
నారా లోకేష్ స్పందన
వైయస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడిని ఏపీ మంత్రి నారా లోకేష్ తీవ్రంగా ఖండించారు. ఆధునిక సమాజంలో ఇలాంటి క్రూరమైన దాడులకు స్థానం లేదని లోకేష్ అన్నారు.
కేంద్రమంత్రి సురేష్ ప్రభు స్పందన
జగన్మోహన్ రెడ్డిపై విశాఖపట్నం విమానాశ్రయంలో జరిగిన హత్యాయత్నంపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి సురేశ్ ప్రభు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై లోతైన దర్యాప్తు చేపట్టాలని సీఐఎస్ఎఫ్ ప్రధాన కార్యాలయంతో సహా అన్ని శాఖలను ఆదేశించారు. ఎవరు బాధ్యులో గుర్తించాలని విమానయాన శాఖ కార్యదర్శికి సూచించినట్టు వెల్లడించారు. జగన్పై దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. విచారణ జరిపి దోషిని శిక్షిస్తామన్నారు. తక్షణమే దర్యాప్తు మొదలు పెట్టాలని ఆదేశించామని, విచారణ జరుగుతోందని సురేశ్ ప్రభు ట్విట్టర్లో పేర్కొన్నారు. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్న సురేశ్ ప్రభు అదనంగా పౌర విమానయాన శాఖను చూస్తున్నారు. అశోక్గజపతి రాజు ఈ పదవికి రాజీనామా చేయడంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సిఫారసు మేరకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆయనకు మార్చిలో విమానయాన శాఖ అదనపు బాధ్యతలు అప్పగించారు.
ఎంఐఎం అధినేత ఓవైసీ స్పందన
వైయస్ జగన్మోహన్ రెడ్డిపై విశాఖపట్నం ఎయిర్పోర్టులో దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ చెప్పారు. హైదరాబాద్లో మీడియాతో మాట్లాడుతూ.. ఇది పిరికిపందల చర్యగా అభివర్ణించారు. జగన్పై దాడి పూర్తిగా భద్రతా వైఫల్యమేనని పేర్కొన్నారు. విమానయాన శాఖా మంత్రి సురేష్ ప్రభు దీనిపై వెంటనే విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఒక మనిషి కత్తితో ఎయిర్పోర్టు లోపలికి ఎలా వెళ్లగలిగాడని అనుమానం వ్యక్తం చేశారు. ఎయిర్పోర్టు లాంజ్లో కూడా వీఐపీలకు భద్రత లేకుంటే ఎలా అని ప్రభుత్వాన్ని ఓవైసీ నిలదీశారు.
ఏపీ కాంగ్రెస్ స్పందన
జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడిని ఏపీ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపింది. రాజకీయాల్లో ద్వేషం, హింసకు తావులేదని స్పష్టం చేసింది.
కన్నా స్పందన
‘విశాఖ విమానాశ్రయంలో వైయస్ జగన్మోహన్ రెడ్డిపై దాడి, తిరుపతిలో అమిత్ షా వాహనంపై దాడి, రాష్ట్ర పర్యటనలో నాపై దాడికి కుట్ర.. ఇవన్నీ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం, శాంతి భద్రతలు ఏ స్థాయిలో ఉన్నాయో చెబుతున్నాయి' అని బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ వ్యాఖ్యానించారు.
నిందితులను కఠినంగా శిక్షించాలి
వైయస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడిని తీవ్ర ఖండిస్తున్నట్లు టీడీపీ ఎంపీ సీఎం రమేష్ చెప్పారు. ఆధునిక సమాజంలో ఇలాంటి ఘటనలకు స్థానం లేదని అన్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని అన్నారు.