బాబుపై మాటల దాడి .. టీడీపీ ఆఫీస్ లో ఏపీ సీఎం జగన్ ఫోటో పెట్టుకోండి బాబుగారూ
Recommended Video
ఏపీలో టీడీపీ చావు దెబ్బ తింది. ఊహించని రీతిలో ఘోర పరాజయాన్ని చవి చూసింది . ఇక ఎన్నికల ఫలితాల తర్వాత అసలే ఓటమి బాధలో ఉన్న చంద్రబాబు మీద వైసీపీ నేతలు టార్గెట్ చేస్తున్నారు. మాటల తూటాలు పేలుస్తున్నారు. చంద్రబాబుపై తీవ్ర విమర్శలతో విరుచుకుపడుతున్నారు.
చంద్రబాబుపై మాటల దాడి చేసిన వైసీపీ నేత దాడి .. జగన్ ను చూసైనా బుద్ధి తెచ్చుకో అని హితవు
వైసీపీ నేత దాడి వీరభద్ర రావు చంద్రబాబుపై మండిపడ్డారు. చంద్రబాబుకు నైతిక విలువలు లేవని ఆయన అన్నారు .పార్టీ ఫిరాయింపులకు పాల్పడి నైతిక విలువలను చంద్రబాబు తుంగలో తొక్కారని పేర్కొన్న దాడి తనకంటే చిన్నవాడైన వైఎస్ జగన్ ని చూసి చంద్రబాబు బుద్ధి తెచ్చుకోవాలని హితవు పలికారు. జగన్ కనుక పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహిస్తే టీడీపీలో చంద్రబాబు ఒక్కరు మాత్రమే మిగిలిపోతారని అన్నారు .విలువలతో కూడిన రాజకీయం చేస్తున్న వై ఎస్ జగన్ ఫోటోను తెలుగుదేశం పార్టీ ఆఫీసులో పెట్టుకోవాలని టీడీపీ నేతలను ఉద్దేశించి దాడి వీరభద్రరావు అన్నారు. ఇక ఫిరాయింపుల విషయంలో ఏపీ సీఎం జగన్ నిర్ణయాన్ని దేశంలోని అన్ని చట్టసభల్లోనూ అమలు చేయాలని దాడి అభిప్రాయపడ్డారు . ఇప్పటికైనా చంద్రబాబు తీరు మారాలని ఆయన తన వైఖరి మార్చుకోవాలని, నైతిక విలువలు పాటించాలని కోరారు. అలా చేస్తే కనీస గౌరవం దక్కుతుందని హితవు పలికారు దాడి వీరభద్రరావు .
ఓటర్ల తీర్పుని గౌరవించి చంద్రబాబు రాజకీయాల నుంచి తప్పుకుంటే మంచిదన్న దాడి
అంతే కాదు చంద్రబాబు రాజకీయాల నుంచి తప్పుకుంటే మంచిదని ఇదివరకే ఆయన హితవు పలికారు. దేశంలో ఎక్కడా లేనంతగా చంద్రబాబు రాజకీయాలను భ్రష్టుపట్టించారని విమర్శించారు. ఎన్నికల్లో ఓటర్లు టీడీపీకి గట్టిగా బుద్ధి చెప్పారని ఆయన పేర్కొన్నారు . ఓటర్లు చంద్రబాబు పార్టీకి ఇచ్చిన ప్రాధాన్యత ఏ పాటిదో అందరూ చూశారని , ఓటర్ల తీర్పుని గౌరవించి చంద్రబాబు రాజకీయాల నుంచి తప్పుకుంటే మంచిదని దాడి వీరభద్రరావు తెలిపారు.
జగన్ ఫిరాయింపులపై తన నిర్ణయం చెప్పిన నేపధ్యంలో చంద్రబాబుని విమర్శిస్తున్న నేతలు
అసెంబ్లీ వేదికగా పార్టీ ఫిరాయింపులపై సీఎం జగన్ చేసిన సంచలన కామెంట్స్ నేపధ్యంలో తెలుగు రాష్ట్రాల్లో దీనిపైన చర్చ జరుగుతుంది . జగన్ తాను పార్టీ ఫిరాయింపులకి వ్యతిరేకమని తేల్చి చెప్పారు. ఒకవేళ టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీలోకి రావాలని అనుకుంటేమాత్రం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన తర్వాతే పార్టీలోకి తీసుకుంటామని కూడా ఆయన స్పష్టం చేశారు . పదవికి రాజీనామా చేయకుండా పార్టీ ఫిరాయింపులకు పాల్పడితే అనర్హత వేటు వేయాలని స్పీకర్ ని కోరారు వైఎస్ జగన్. గత ప్రభుత్వం వైసీపీ ఎమ్మెల్యేలను సంతలో పశువులు కొన్నట్టు కొనుగోలు చేసిందని 23 మందిని ఫిరాయింపులకు ప్రోత్సహిస్తే చివరకు ఆ 23 మందే మిగిలారని జగన్ ఎద్దేవా చేశారు. తాను చంద్రబాబులా చేస్తే తనకు బాబుకు తేడా ఏమి ఉంటుంది అన్న జగన్ ఫిరాయింపుల విషయంలో చాలా స్పష్టతతో ఉన్నారు .