హిందూ ఆలయాలపై దాడులు: కర్నూలు జిల్లాలో హనుమాన్ విగ్రహ ధ్వంసం..చేస్తున్నదెవరు?
ఆంధ్రప్రదేశ్లో ఆలయాలపై దాడులు కొనసాగుతూనే ఉంది. అంతర్వేదిలో రథం దగ్ధం ఘటన నుండి నేటి వరకు ఎక్కడో ఒకచోట ఆలయాలలో దేవుళ్ళ విగ్రహాల విధ్వంసం కొనసాగుతూనే ఉంది. ప్రతిపక్ష పార్టీలు, హిందూ సంఘాలు తీవ్రంగా మండిపడుతున్నారు . దేవాలయాలపై దాడులు నిత్యకృత్యంగా మారాయి. తాజాగా మరో ఘటన హిందువులకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పిస్తుంది. ప్రభుత్వ అసమర్థతను ప్రశ్నిస్తోంది.
కర్నూలు జిల్లా పత్తికొండలో ఆంజనేయ స్వామి విగ్రహం ధ్వంసం
కర్నూలు జిల్లాలో పత్తికొండ మార్కెట్ యార్డ్ సమీపాన ఉన్న ఆంజనేయ స్వామి దేవాలయంలో విగ్రహాన్ని కొందరు దుండగులు ధ్వంసం చేశారు. విగ్రహం ఉన్న ప్రదేశం నుంచి దాన్ని తొలగించి రోడ్డుపై పడేసి వెళ్లిపోయారు. తెల్లవారుజామున రోడ్డుపై ఉన్న విగ్రహాన్ని చూసిన స్థానికులు ఆవేదనకు గురయ్యారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిని గుర్తించాలని , కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు, హిందూ ధర్మ సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నాయి.
కేసు నమోదు చేసిన పోలీసులు .. దర్యాప్తు
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రాథమికంగా దర్యాప్తు చేపట్టారు. ఘటన జరిగిన ప్రదేశంలో సీసీ కెమెరాలు లేకపోవడంతో ఈ ఘటనకు బాధ్యులైన వారెవరో తెలుసుకోవడం కష్టంగా మారింది.అంతర్వేది రథ దగ్ధం ఘటన నుండి, నేటి వరకు వరుసగా జరుగుతున్న ఉదంతాలు అన్నీ చూస్తే ఏ ఒక్క ఘటనలోనూ విగ్రహాలను ధ్వంసం చేసిన వారిని కానీ, అమ్మవారి ఆలయంలో వెండి సింహాలను మాయం చేసిన వారిని కానీ, రథం దగ్ధం చేసిన వారిని కానీ పోలీసులు ఇప్పటివరకు పట్టుకున్న దాఖలాలు లేవు.
హిందూ ఆలయాలలో దాడులను చేస్తున్నదెవరు.. ఇది ఎవరి కుట్ర ?
హిందూ సంఘాలు, బిజెపి, టిడిపి తీవ్రస్థాయిలో మండిపడుతున్నా ఇప్పటివరకు ప్రభుత్వం ఈ ఘటనకు బాధ్యులైన వారిని పట్టుకోలేకపోయింది. దీనిపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తమవుతోంది.
అంతర్వేదిలో చర్చలో రెండు అద్దాలు పగిలితే 40 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. అదే హిందూ దేవాలయాలపై ఇంత పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్నా ఎవరిని ఎందుకు పట్టుకోలేకపోతున్నారు అన్న ప్రశ్న ప్రస్తుతం హిందూ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి . ఒకపక్క అధికార వైసిపి ఇది కావాలని మతపరమైన ఉద్రిక్తతలను సృష్టించడానికి కొందరు చేస్తున్న కుట్రగా అభివర్ణిస్తుంటే, ప్రతిపక్షాలు ప్రభుత్వ అసమర్థతగా తిట్టిపోస్తున్నాయి.
Recommended Video
విచారణలు తప్ప దోషులను పట్టుకున్నది లేదని విమర్శలు
ఇంతా జరుగుతున్నా సీఎం జగన్ మోహన్ రెడ్డి స్పందించడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మొత్తంగా తాజా పరిణామాలను చూస్తే హిందూ దేవాలయాలలో ఏదో ఒక చోట నిత్యం దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. అసలు ఈ ఘటనకు బాధ్యులు ఎవరు? ఎందుకు ఇదంతా చేస్తున్నారు? అన్నది తేల్చాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే .ఇక దీని వెనుక రాజకీయ కుట్ర ఉందని ఆరోపిస్తున్న అధికార పార్టీ నిజానిజాల నిగ్గు తేల్చాల్సి ఉంది . హిందూ ఆలయాల్లో దాడులపై దర్యాప్తు చేసి దోషులకు శిక్ష పడేలా చేయాలని డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వం మాత్రం విచారణల పేరుతో మీనమేషాలు లెక్కిస్తోంది. ఫలితంగా దేవాలయాలపై దాడులు, దేవతా విగ్రహాల విధ్వంసాలు నిత్యకృత్యంగా మారుతున్నాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.