టీడీపీ కార్యకర్తలపై దాడులు సహించం .. టీడీపీ పునాదులు కదిపే శక్తి ఎవరికీ లేదన్న అయ్యన్నపాత్రుడు
ఏపీలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీడీపీ ఘోర ఓటమి పాలయ్యింది. కేవలం 23 స్థానాలకే పరిమితం అయ్యింది. అయితే ఈ నేపధ్యంలో టీడీపీ నేతలపై వైసీపీ నేతలు మాటల దాడికి దిగుతున్నారని, ఇక టీడీపీ కార్యకర్తలపై శారీరక దాడులకు దిగుతున్నారని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఈ విషయంపై మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజమేనని పేర్కొన్నారు . తెలుగుదేశం పార్టీ ఇక ఉండదు అనే మాటలు సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.
టీడీపీ ప్రజల పార్టీ అని, ప్రజలే అండగా ఉంటారని టీడీపీ పట్ల ప్రజా విశ్వాసం ఉంటుందని అయన్న పాత్రుడు అన్నారు. టీడీపీ పునాదులు కదిపే శక్తి ఎవరికి లేదని ఆయన గట్టిగా చెప్పారు . టీడీపీ కార్యకర్తలపై దాడులు చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని, కార్యకర్తలకు అండగా ఉంటామని అయ్యన్న పాత్రుడు స్పష్టం చేశారు.టీడీపీకి పూర్వ వైభవం తీసుకురావడానికి కృషి చేస్తామని ఆయన పేర్కొన్నారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థలు ఎన్నికలకు సమాయత్తం అవుతున్నామని అన్నారు. టీడీపీ పార్టీని బలోపేతం చేసే దిశగా సమావేశంలో చర్చించుకున్నామని పేర్కొన్నారు. మండల వారిగా సమావేశాలు పెడతామని, పంచాయతీ ఎన్నికల్లో ఎవరిని నిలబెట్టాలో గ్రామస్థాయిలో వారే నిర్ణయం చేసుకునేలా ప్రణాళిక సిద్ధం చేశామని అయ్యన్న పాత్రుడు పేర్కొన్నారు.
ఇక ప్రాజెక్టులలో అవినీతి జరిగిందని కమిటీ వేసి నిర్ణయిస్తామని మాట్లాడుతున్నారని కమిటీ నివేదిక ఇచ్చాక స్పందిస్తానని ఆయన పేర్కొన్నారు . జగన్ సర్కారు పనితీరుని ఆరు, ఏడు నెలలు గమనిస్తామని చెప్పిన ఆయన మంచి పనులు చేస్తే సహకరిస్తామని తెలిపారు . అదే సమయంలో టీడీపీకి పూర్వ వైభవం తీసుకొచ్చే దిశగా టీడీపీ శ్రేణులు సమాయత్తం కావాలని కోరారు.రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటేందుకు టీడీపీ శ్రేణులను సన్నద్ధం చేస్తామని అయ్యన్న పాత్రుడు తెలుగు దేశం పార్టీ శ్రేణుల్లో ధైర్యం నింపారు.