ఆపరేషన్ టెంపుల్ డిమాలిషన్ కుట్ర: నేతలకు టార్గెట్లు: చంద్రబాబు సొంత మనుషులే లీక్: సాయిరెడ్డి
అమరావతి: రాష్ట్రంలో కొంతకాలంగా వరుసగా చోటు చేసుకుంటూ వచ్చిన ఆలయాలపై దాడులు, విగ్రహాల విధ్వంసానికి సంబంధించిన సంఘటనల్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఆలయాలపై దాడులకు పాల్పడిన ఘటనలో తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీకి చెందిన కొందరు నాయకులు, కార్యకర్తల ప్రమేయం ఉన్నట్లు డీజీపీ గౌతమ్ సవాంగ్ చేసిన ప్రకటనతో ఈ వివాదం మరింత ముదిరింది. టీడీపీ, బీజేపీ నాయకులు ఉమ్మడిగా వైఎస్సార్సీపీ నేతలు, డీజీపీని టార్గెట్గా చేసుకుని ఘాటు విమర్శలను సంధిస్తున్నారు.
దీనిపై వైసీపీ నాయకులు కౌంటర్ అటాక్కు దిగారు. జలవనరుల శాఖ మంత్రి పీ అనిల్ కుమార్ యాదవ్, పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని, శాసన సభ్యుడు అంబటి రాంబాబు, జోగి రమేష్ వంటి నేతలు టీడీపీ, బీజేపీ నేతలపై ఎదురుదాడికి దిగుతున్నారు. తాజాగా- వైసీపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు వీ విజయసాయి రెడ్డి ఈ జాబితాలో చేరారు. చంద్రబాబుపై ఘాటు విమర్శలు చేశారు. ఆరోపణలను సంధించారు. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో విధ్వంసాలకు పాల్పడటం చంద్రబాబుకు అలవాటేనని ఎద్దేవా చేశారు.
ఉమ్మడి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్న ప్రతీసారీ.. చంద్రబాబు బంద్లు, నిరసనలకు పిలుపునిచ్చేవాడని గుర్తుచేశారు. వాటిని అడ్డుగా పెట్టుకుని బస్సులను తగులబెట్టేవారని, ఫలితంగా రాష్ట్రంలో అశాంతి వాతావరణం నెలకొనడానికి కారణం అయ్యేవాడని విమర్శించారు. ఎన్ని బస్సులను తగులబెట్టాలనే విషయంపై పార్టీ జిల్లా స్థాయి నాయకులకు టార్గెట్లను కూడా ఇచ్చేవాడని ధ్వజమెత్తారు. ఈ విషయాన్ని చంద్రబాబు సొంత మనుషులే బయటపెట్టారని అన్నారు.
ఇప్పుడు బస్సులకు బదులుగా దేవాలయాలు, విగ్రహాల విధ్వంసానికి పూనుకుంటున్నారని సాయిరెడ్డి ఆరోపించారు. ఆపరేషన్ టెంపుల్స్ డిమాలిషన్కు సేమ్ స్కెచ్ వేసి అడ్డంగా దొరికిపోయారని మండిపడ్డారు. పోలీసులు అసలు విషయాన్ని బయటపెట్టడంతో దాన్ని తట్టుకోలేక పోతోన్నారని ఆరోపించారు. అందుకే గౌతమ్ సవాంగ్పై అనవసరపు నిందలు వేస్తున్నారని విజయసాయి రెడ్డి మండిపడ్డారు. కుట్రపూరిత రాజకీయాలు చేయడానికి తమ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు అవకాశం ఇవ్వబోమని అన్నారు.