మహిళతో అక్రమ సంబంధం: యజమాని హత్యకు ఎన్ని ప్లాన్లో...
ఓ మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని, ఆమె భర్తను హతమార్చడానికి ఓ వ్యక్తి ప్లాన్ల మీద ప్లాన్లు వేసి విఫలమయ్యాడు. అతన్ని హత్య చేయడానికి కిరాయికి తీసుకున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు.
ఏలూరు: ఓ మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని, ఆమె భర్తను హతమార్చడానికి ఓ వ్యక్తి ప్లాన్ల మీద ప్లాన్లు వేసి విఫలమయ్యాడు. అతన్ని హత్య చేయడానికి కిరాయికి తీసుకున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఓ వ్యక్తి పాలుపోయడానికి వస్తూ ఆ ఇంటి యజమాని భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు.
అడ్డు తొలగించుకోవడానికి యజమాని అయిన పెయింటర్ను హత్య చేయడానికి, ఆ తర్వాత హత్య చేయించడానికి ప్రయత్నించాడు. ఈ సంఘటనలో పోలీసులు 9 మంది అదుపులోకి తీసుకుని వివరాలు రాబట్టారు. కేసు వివరాలను ఆదివారం రాత్రి ఏలూరు వన్టౌన్ పోలీస్స్టేషన్లో ఏలూరు డిఎస్పీ గోగుల వెంకటేశ్వరరావు చెప్పారు.
పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగి మండలం జగన్నాథపురానికి చెందిన ముల్పూరి వెంకటేశ్వరరావు (45) పాల వ్యాపారం చేస్తుంటాడు. అతనికి లారీ, ఇతర వాహనాలు ఉన్నాయి. ఏలూరు రామచంద్రరావుపేటలో ఒక వీధిలో ఉన్న ఒక కుటుంబానికి ఏడాదిన్నర నుంచి పాలు పోస్తున్నాడు. దీనిలో భాగంగానే ఆ ఇంటి యజమాని భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు.
విషయం తెలిసి...
అక్రమ సంబంధం వ్యవహారం మహిళ భర్తకు తెలియడంతో వెంకటేశ్వరరావును గట్టిగా మందలించాడు. దీంతో వెంకటేశ్వరరావు ఏదో విధంగా ఆ మహిళ భర్తను అడ్డం తొలగించుకోవాలని అనుకున్నాడు. తన వద్ద డ్రైవర్గా పనిచేస్తున్న కృష్ణా జిల్లా నందివాడ మండలం కుదరవల్లి గ్రామానికి చెందిన ఒల్లూరుపల్లి సీతారామ ప్రసాద్ అలియాస్ నాని(29) చేత ఆ మహిళ భర్తకు వేంకటేశ్వర రావు ఫోన్ చేయించి మడిచర్లలో పెయింటింగ్ పనులు ఉన్నాయి.. కాంట్రాక్టు ఇస్తామని చెప్పడంతో అక్కడకు వెళ్ళాడు.
లారీ యాక్సిడెంట్లో చంపడానికి..
అక్కడకు వెళ్లిన పెయింటర్ను లారీతో యాక్సిడెంట్ చేసి చంపడానికి వెంకటేశ్వర రావు డ్రైవర్ సీతారామప్రసాద్ ప్రయత్నించాడు. అయితే అతను తప్పించుకున్నాడు. విషంతో కూడిన ఇంజెక్షన్ చేసిచంపాలని ఒక ఇంజెక్షన్ కొనుగోలు చేసి సిద్ధం చేసుకున్నాడు. అది కూడా వీలు కాలేదు. దాంతో ఏలూరు సమీపంలోని సీతారామపురానికి చెందిన దేవినేని నాగఫణి కుమార్కు విషయం చెప్పాడు. అతని ద్వారా గుడివాడకు చెందిన హంతకముఠా వంగూరి సత్యానందం అలియాస్ బుల్లి అలియాస్ అశోక్(26), కొండూరి దుర్గారావు అలియాస్ మోగోడు(25), నడికుదిటి శివనాగరాజు అలియాస్ గని(34), చిలుకూరి విజయ్ కుమార్ అలియాస్ బాబి(24), కత్తి పాపారావు అలియాస్ బాబూరావు(28), నాయక్ ప్రతాప్ అలియాస్ బుడ్డ ప్రతాప్(28)లతో హత్యకు ఒప్పందం చేసుకున్నాడు
80 లక్షలకు బేరం...
పెయింటర్ హత్యకు లక్షా 80 వేలకు వేంకటేశ్వర రావు బేరం కుదుర్చుకున్నారు. దీంతో అతన్ని హత్య చేయడానికి ముఠా ఒక మారుతీ వ్యాన్లో ఏలూరు ఓవర్ బ్రిడ్జి కింద మాటు వేసింది. మరో పల్సర్ మోటార్ సైకిల్పై మూల్పూరి వెంకటేశ్వర రావు,దేవినేని నాగఫణికుమార్, ఒల్లూరు పల్లి సీతా రామప్రసాద్ అలియాస్ నాని కాపు కాశారు. సమాచారం అందుకున్న నగర సీఐ ఎన్.రాజశేఖర్ ఆధ్వర్యంలో త్రీటౌన్ ఎస్ఐ ఎ.పైడి బాబు,వన్టౌన్ ఎస్ఐ వీరంకి రామకోటేశ్వరరావు, క్రైం హెడ్కానిస్టే బుల్ జి.దిలీప్కుమార్,క్రైం కానిస్టేబుళ్ళు షేక్ బాజీ,షేక్ రఫీ, ఎం.నాగరాజు ఆ ముఠాను ఆదివారం సాయంత్రం అదుపులోకి తీసుకున్నారు.
ఇనుప రాడ్లు స్వాధీనం...
ముఠా నుంచి ఇనుపరాడ్లు, కత్తులు, నైలాన్ తాడులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హత్యకు వినియోగించడానికి సిద్ధం చేసిన విషంతో కూడిన ఇంజెక్షన్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.నిందితులు తొమ్మిది మందిని అరెస్టు చేశారు. వీళ్లు పలు కేసుల్లో నిందితులుగా ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు.
పెయింటర్ భార్యపై అనుమానం...
పాల వ్యాపారితో వివాహేతర సంబంధం పెట్టుకున్న పెయింటర్ భార్యపైనే పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పెయింటర్ను చంపడానికి హంతకులు ఒక విషంతో కూడిన ఇంజెక్షన్ సిరంజిని సిద్ధం చేసుకున్నారని, ఇది ఎవరి ద్వారా పెయింటర్కు ఇంజెక్షన్ చేయడానికి సిద్ధం చేశారనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. పాల వ్యాపారితో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఆ మహిళను కూడా పోలీసులు విచారించే అవకాశాలు కనిపిస్తున్నాయి.