టాయిలెట్ వెళ్తామన్న కనికరించలేదు: భార్యా బిడ్డలపై ఓ అటెండర్ పైశాచికత్వం..
నీళ్లు, టాయిలెట్ లేని గదిలో భార్యాబిడ్డలను నిర్బంధించడంతో వారు నరకయాతన అనుభవించారు.
కడప: ప్రభుత్వ కార్యాలయంలో అటెండర్గా పనిచేస్తున్న ఓ వ్యక్తి తాగుడుకు బానిసై భార్యాబిడ్డలను చిత్రహింసలు పెడుతూ వస్తున్నాడు. ఇదే క్రమంలో భార్యను, బిడ్డను 20గం. పాటు గదిలో బంధించి వారికి నరకం చూపించాడు. ఆఖరికి టాయిలెట్ కు వెళ్లాలని ప్రాధేయపడినా అతను కనికరించలేదు.
Recommended Video
బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం పోలీసులు వచ్చేవరకు వాళ్లిద్దరు లోపలి గదిలోనే బంధించబడి ఉన్నారు. ఎట్టకేలకు ఇంటిపై దాడి చేసిన పోలీసులు.. వారికి విముక్తి కల్పించారు.
తాగుడుకు బానిస:
నంద్యాలలోని కేసీ కెనాల్ కార్యాలయంలో అటెండర్గా విధులు నిర్వహిస్తున్న రత్నరాజ్ మైదుకూరులోని రేణుకా ఎల్లమ్మ ఆలయం వీధిలో కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు. రత్నరాజ్-సునీత దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కొడుకు ఉన్నారు. తాగుడుకు బానిసైన రత్నరాజ్ మద్యం తాగి వచ్చినప్పుడల్లా భార్య సునీతతో గొడవపడుతుండేవాడు.
భార్యతో గొడవ, నిర్బంధం:
బుధవారం ఉదయం పెద్దకుమార్తె, కొడుకు కళాశాలకు వెళ్లిన తర్వాత భార్య సునీతతో రత్నరాజ్ గొడవ పడ్డాడు. అక్కడే ఉన్న చిన్న కుమార్తెపై కూడా చెయ్యి చేసుకున్నాడు. ఇద్దరిని కొట్టి ఇంట్లోని ఓ గదిలో నిర్బంధించి తాళం వేశాడు. అలాగే బయటివాళ్లెవరూ ఇంట్లోకి రాకుండా లోపలి నుంచి గడియ పెట్టుకుని ఇంట్లోనే ఉండిపోయాడు.
టాయిలెట్ వెళ్లాలని ప్రాధేయపడ్డా:
నీళ్లు, టాయిలెట్ లేని గదిలో భార్యాబిడ్డలను నిర్బంధించడంతో వారు నరకయాతన అనుభవించారు. దాహమవుతోందని, ఆకలి అవుతోందని ఎన్నిసార్లు తలుపులు కొట్టినా అతను కనికరించలేదు. ఆఖరికి టాయిలెట్ వెళ్లాలని ప్రాధేయపడ్డా అతను తలుపులు తీయలేదు. సాయంత్రం కాలేజీ నుంచి తిరిగి వచ్చిన కుమారుడు, కుమార్తెకు కూడా తలుపులు తీయకపోవడంతో.. ఆరుబయటే పడుకున్నారు.
ఎట్టకేలకు విముక్తి:
రాత్రంతా ఆరుబయట పడుకున్న కొడుకు, కుమార్తె.. తెల్లవారుజామున విషయాన్ని స్థానికులకు చెప్పారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో వారు ఇంటిపై దాడి చేశారు. తలుపులు బద్దలుకొట్టి రత్నరాజ్ను అదుపులోకి తీసుకున్నారు. రత్నరాజ్ తరుచూ తాగొచ్చి కుటుంబాన్ని వేధిస్తున్నాడని స్థానికులు చెప్పారు.