జగన్కు భారీ ఊరట-కోర్టు ధిక్కార పిటిషన్కు అటార్నీ అనుమతి నిరాకరణ- సీజే దృష్టిలో ఉందంటూ..
సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, ఏపీ హైకోర్టులోని పలువురు న్యాయమూర్తులతో కలిసి తన ప్రభుత్వాన్ని అస్ధిర పరిచేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ఛీఫ్జస్టిస్ బాబ్డేకు సీఎం జగన్ రాసిన లేఖ వ్యవహారం కీలక మలుపు తిరిగింది. ఈ లేఖపై కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ సుప్రీంకోర్టు లాయర్ అశ్వినీ ఉపాధ్యాయ రాసిన లేఖపై స్పందించిన అటార్నీ జనరల్ దీన్ని తిరస్కరించారు. ఇప్పటికే ఈ అంశం సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్ పరిశీలనలో ఉన్నందున దీనిపై తాను ఎలాంటి అనుమతి ఇవ్వలేనని అటార్నీ జనరల్ ఇచ్చిన సమాధానంలో తెలిపారు.
కబ్జా స్ధలంలో టీడీపీ ఆఫీసు- ఎమ్మెల్యే ఆర్కే పిటిషన్ - టీడీపీ, జగన్ సర్కారుకు సుప్రీం నోటీసులు
జగన్కు భారీ ఊరట...
సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణపై ఫిర్యాదు చేస్తూ ఛీఫ్జస్టిస్కు ఏపీ సీఎం జగన్ రాసిన లేఖ కలకలం రేపుతుండగా.. దీన్ని కోర్టు ధిక్కారంగా పరిగణిస్తూ క్రిమినల్ చర్యలు తీసుకునేందుకు అనుమతించాలని కోరుతూ లాయర్ అశ్వినీ ఉపాధ్యాయ అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్కు రాసిన లేఖ కూడా అంతే కలకలం రేపింది. దీనిపై ఇవాళ అటార్నీ జనరల్ స్పందించారు. అశ్వినీ ఉపాధ్యాయ లేఖకు ఆయన సమాధానం ఇచ్చారు. ఇందులో పలు అంశాలు ప్రస్తావించారు. అయితే అంతిమంగా సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్కు జగన్ రాసిన లేఖపై కోర్టు ధిక్కార చర్యలు తీసుకునేందుకు అనుమతి ఇవ్వలేనని తేల్చేశారు.
ఛీఫ్జస్టిస్ పరిశీలనలో ఉన్నందున..
సీఎం జగన్ రాసిన లేఖ సుప్రీంకోర్టు ఛీఫ్జస్టిస్ బాబ్డే పరిశీలనలో ఉన్నందున దీనిపై తాను ఎలాంటి చర్యలకు అనుమతి ఇవ్వలేనని అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ స్పష్టం చేశారు. దీంతో ఇప్పటివరకూ సీజేకు జగన్ రాసిన లేఖను కోర్టు ధిక్కారంగా పరిగణించి చర్యలు తీసుకోవాలని కోరుతున్న వారందరికీ గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లయింది. అదే సమయంలో సీజేకు జగన్ రాసిన లేఖపై కేంద్ర ప్రభుత్వ వైఖరి కూడా స్పష్టమైనట్లయింది. అంతిమంగా సుప్రీం ప్రధాన న్యాయమూర్తి బాబ్డే దీనిపై స్పందించి తగు చర్యలు తీసుకోవాల్సిన పరిస్దితి ఏర్పడింది. ఇది ఏపీ ప్రభుత్వానికి కూడా ఊరటగానే భావిస్తున్నారు.
Recommended Video
జగన్ లేఖ అనుమానాస్పదమేనన్న ఏజీ..
జస్టిస్ ఎన్వీ రమణపై ఫిర్యాదు చేస్తూ సీఎం జగన్ ఛీఫ్ జస్టిస్కు రాసిన లేఖపై క్రిమినల్ ధిక్కార చర్యలు తీసుకునేందుకు అనుమతి నిరాకరించిన అటార్నీ జనరల్ ఈ లేఖపై మాత్రం తన అనుమానాలు వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులపై నమోదైన కేసుల సత్వర విచారణకు జస్టిస్ ఎన్వీ రమణ ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో 31 కేసులు ఎదుర్కొంటున్న జగన్ ఈ లేఖ రాయడం మాత్రం పలు అనుమానాలకు తావిస్తోందని అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ పేర్కొన్నారు. జగన్పై ఉన్న కేసుల సహా తాజాగా చోటు చేసుకున్న అన్ని పరిణామాలపై సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్కు అవగాహన ఉందని అటార్నీ జనరల్ తెలిపారు. దీంతో జగన్ లేఖ తప్పే అయినా దీనిపై క్రిమినల్ చర్యలు తీసుకోవడంపై నిర్ణయం మాత్రం ఛీఫ్ జస్టిస్కే ఉందని ఏజీ చెప్పినట్లయింది.