రాజుల వారసత్వ పోరులో మరో ట్విస్ట్- సంచైతకు పోటీగా చిన్నమ్మ సుధ, చెల్లెలు ఊర్మిళ...
విజయనగరంలోని పూసపాటి రాజవంశీయులకు చెందిన మాన్సాస్, ఇతర ట్రస్టుల వారసత్వ బాధ్యతలను సంచైత గజపతిరాజు చేపట్టడం ఇప్పుడు వారి కుటుంబంలోని వారికే నచ్చడం లేదు. పూసపాటి వంశానికి తామే అసలైన వారసులమంటూ సంచయితకు వ్యతిరకంగా ఆనంద గజపతిరాజు రెండో భార్య సుధ, ఆమె కుమార్తె ఊర్మిళ గళం విప్పడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. ఇప్పటికే ఆనంద్ సోదరుడు అశోక్ గజపతి రాజు సంచయితకు మాన్సాస్ బాధ్యతలు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో తాజాగా ఆయనకు మద్దతుగా సుధ, ఊర్మిళ రంగంలోకి దిగడం అనుమానాలకు తావిస్తోంది.
రోజురోజుకూ రాటుదేలుతున్న సంచయిత.. బాబాయ్ పై ప్రతీకారమే లక్ష్యంగా జేజమ్మ అడుగులు.....
రాజుల కోటలో మరో వారసత్వ పోరు..
విజయనగరం పూసపాటి రాజుల వారసత్వం, ఆస్తుల వ్యవహారం ఇపుడు పెద్ద ఎత్తున చర్చకు వస్తున్నాయి. గత మూడు నెలల వరకూ తెరచాటు పోరాటాలకే పరిమితం అయిన ఈ వ్యవహారాలు.. ఇపుడు సంచయిత గజపతిరాజుకు మాన్సాస్ పగ్గాలు అప్పగించడంతో ఒక్కొక్కటిగా బహిరంగమవుతున్నాయి. నాలుగేళ్ళ క్రితం దివంగతులైన ఆనందగజపతిరాజుకు తామే అసలైన వారసులమని ఆయన రెండవ భార్య సుధా గజపతిరాజు, వారి అమ్మాయి ఊర్మిళా గజపతిరాజు తెరముందుకు రావడంతో రాజుల కోట రచ్చ సరికొత్త మలుపు తిరిగినట్లైంది.
అందరి టార్గెట్ సంచయితే...
ఈ ఏడాది మార్చిలో ఆనందగజపతిరాజు మొదటి భార్య ఉమా గజపతిరాజు కుమార్తె సంచయిత గజపతి రాజును మాన్సాస్ ట్రస్ చైర్ పర్సన్ గా, సింహాచలం దేవస్థానం ట్రస్ట్ చైర్ పర్సన్ గా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో అంతవరకూ ఈ రెండు కీలకమైన బాధ్యతలు చూసిన కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు ఒక్కసారిగా మాజీ అయిపోయారు. ఆయన ఈ విషయంలో కోర్టుకు ఎక్కారు. తానే అసలైన వారసుణ్ణి అని అక్కడ వాదనలు వినిపిస్తున్నారు. ఇవన్నీ ఇలా ఉంటే ఇపుడు సుధా, ఊర్మిళా గజపతి రాజుల రంగప్రవేశంతో కధ మొత్తం మారిపోయింది.
ఆనంద్ కుటుంబం, పంపకాలు...
1991లోనే ఆనందగజపతిరాజు సంచయిత గజపతిరాజు తల్లి ఉమాగజపతిరాజుకు విడాకులు ఇచ్చారని, నాడే ఆస్తిపంపకాలు మొత్తం పూర్తి అయ్యాయని, వారికి పూసపాటి సంస్థానంతో, వారసత్వంతో ఏ రకమైన సంబంధం లేదని తల్లీ కూతుళ్ళు సుధా, ఊర్మిళ అంటున్నారు. తామే అసలైన వారసులమని చెబుతున్నారు. వారసత్వ హక్కుల కోసం తాము న్యాయపోరాటం చేస్తామని అంటున్నారు. మొత్తానికి చూస్తే పూసపాటి వారి అనువంశిక వారసత్వం ఎవరికి దక్కుతుంది, ఎవరు నిజమైన వారసులు, అశోక్ గజపతి చెప్పినట్లుగా ఆయనే మళ్ళీ మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ అవుతారా. ఇవన్నీ ప్రశ్నలే. మొత్తం మీద చూసుకుంటే ఈ వ్యవహారంతో రాజుల కోటలో రచ్చ సంచలనం రేపుతోంది.
Recommended Video
అందరి కన్నూ ఆస్తుల పైనే....
సంచైత గజపతిరాజు నిర్వహించే మాన్సాన్ ట్రస్ట్ కు 14,800 ఎకరాల భూములున్నాయి. దేవాలయాల నిర్వహణ చూసే ఈ అతిపెద్ద ట్రస్ట్ అశోక్ గజపతి చేతుల మీద రాజు చేతుల నుంచి మారిపోయింది. ఇలా పూసపాటి రాజుల కోటలో ఇప్పుడు ఆనందగజపతి రాజుల ఇద్దరు భార్యలు అశోక్ గజపతి రాజుతో కలిపి ముగ్గురు వేర్వేరుగా ఆస్తుల కోసం కొట్లాడుకుంటున్నారు. ఈ ముగ్గురిలో ఎవరికి ఆస్తి దక్కుతుందనేది కోర్టులే తేల్చాల్సి ఉంది.