రాజధానిలో ఉష్ణోగ్రత 10 డిగ్రీలు తగ్గించండి:చంద్రబాబు ఆదేశంతో అధికారుల విస్మయం
Recommended Video
అమరావతి:నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నీరు- ప్రగతి పథకంపై టెలీకాన్ఫరెన్స్ జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్రంలో మండుతున్న ఎండలపై చర్చ సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు అధికారులను విస్మయానికి గురిచేసినట్లు సమాచారం. ఇంతకూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఏమన్నారంటే...
రాష్ట్రంలో ఎండల తీవ్రత చాలా ఎక్కువగా ఉందని, ఉష్ణోగ్రతలు తగ్గించాలని ఆయన అధికారులకు సూచించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా రాజధాని ప్రాంతంలో ఉష్ణోగ్రతలను 10 డిగ్రీలు తగ్గించాలని అధికారులను ఆదేశించారట. చంద్రబాబు తాజా ఆదేశాలకు ఒక్కసారిగా అధికారులందరూ షాక్ తిన్నారని తెలుస్తోంది. ఇలా హఠాత్తుగా ఎండలను తామెలా తగ్గించాలో అర్థంకాకపోవడమే వారి విస్మయానికి కారణం.
అంతకుముందు నీరు- ప్రగతి పథకంపై చంద్రబాబు మాట్లాడుతూ 30% వర్షపాతం లోటు ఉన్నా, 3 మీటర్లు భూగర్భ జలాలు పెంచామని చెప్పారు. దీనికి నీరు-ప్రగతి, జల సంరక్షణ ఉద్యమాలేకారణమని ఆయన వెల్లడించారు. అలాగే ఇబ్బందుల్లో సైతం వ్యవసాయంలో 17% వృద్ధి సాధించామని చెప్పారు. భూసారంలో సూక్ష్మ పోషకాల సమతుల్యత ఉండాలని ఈసందర్భంగా అధికారులకు చంద్రబాబు సూచించారు. బోరాన్, పాస్పరస్ హెచ్చుతగ్గులు లేకుండా చూడాలని, జీబా వినియోగాన్ని కూడా బాగాప్రోత్సహించాలని సిఎం దిశానిర్దేశం చేశారు.
525 గ్రామాలలో జలసంరక్షణ చర్యలు చేపట్టాలని...ప్రకాశం జిల్లాలో ఇంజక్షన్ వెల్స్తో సత్ఫలితాలు వచ్చాయని...వరదనీరు ఇంజక్షన్ వెల్స్కు, పంటకుంటలకు చేరేలా చూడాలని అధికారులకు సూచించారు. పాల దిగుబడి విషయంలో 20% లక్ష్యానికి గాను ఇప్పటికే 16.2 శాతం వరకూ చేరినట్లు తెలిపారు. ఊరూరా పశుగ్రాస క్షేత్రాలపై దృష్టిపెట్టాలన్నారు. ఆక్వా రైతుల సమస్యలు పరిష్కరించాలని, ఆక్వా దిగుబడుల నాణ్యత పెంచాలంటూ అధికారులకు చంద్రబాబు ఈ సమావేశంలో సూచనలు చేశారు.