అక్కాచెల్లెళ్లపై ఆటోడ్రైవర్ ఘాతుకం: రేప్ యత్నం, రాడుతో దాడి.. కోమాలో స్వాతి!
రాత్రివేళల్లో తాగుబోతుల వీరంగాలు మహిళలపై దాడుల దాకా వెళ్తున్నాయి. చాలాచోట్ల ఆటోడ్రైవర్లు సైతం మద్యం మత్తులో మహిళలపై ఆకృత్యాలకు పాల్పడుతున్న ఘటనలు ఇటీవలి కాలంలో పెరుగుతున్నాయి.
బొబ్బిలి: రాత్రివేళల్లో తాగుబోతుల వీరంగాలు మహిళలపై దాడుల దాకా వెళ్తున్నాయి. చాలాచోట్ల ఆటోడ్రైవర్లు సైతం మద్యం మత్తులో మహిళలపై ఆకృత్యాలకు పాల్పడుతున్న ఘటనలు ఇటీవలి కాలంలో పెరుగుతున్నాయి.
తాజాగా విజయనగరం జిల్లా బొబ్బిలిలో ఓ ఆటోడ్రైవర్ ఇద్దరు యువతులపై దాడికి తెగబడ్డాడు. మార్గమధ్యలో ఓ యువతిపై లైంగిక దాడికి యత్నించి, ప్రతిఘటించినందుకు ఇనుప రాడ్ తో ఆమె తలపై కొట్టాడు. బాధితుడి దాడిలో ఓ యువతి కోమాలోకి వెళ్లిపోగా, మరో యువతి గాయాలపాలై చికిత్స పొందుతోంది.
బాధితుల నేపథ్యం:
బొబ్బిలి మండలం కోమటిపల్లికి చెందిన ఇజ్జురోతు చిన్న, బలరాంలకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె స్వాతికి వివాహమై ఏలూరులో ఉంటోంది. మరో కుమార్తె పావని హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. ఇటీవల దీపావళి పండుగ నిమిత్తం వీరిద్దరు స్వగ్రామానికి వచ్చారు.
షాపింగ్ నుంచి తిరిగొస్తుండగా:
బుధవారం సాయంత్రం 4.30గం. ప్రాంతంలో స్వాతి, పావని ఇద్దరు షాపింగ్ నిమిత్తం బొబ్బిలి పట్టణానికి వచ్చారు. షాపింగ్ పూర్తయ్యాక రాత్రి 7.15గం.కు ఆటో కోసం చర్చి సెంటర్ వద్ద ఎదురుచూస్తుండగా.. ఓ ఆటో వచ్చి ఆగింది. గొల్లపల్లికి చెందిన వంజరాపు నరేష్(35) అనే ఆటో డ్రైవర్.. ఇద్దరిని ఎక్కమన్నాడు. ఆటో నిండేవరకు ఇక్కడే ఉండాల్సి వస్తుందని స్వాతి, పావని తటాపటాయించగా.. అదేమి లేదని ఇద్దరినైనా తీసుకెళ్తానని చెప్పాడు.
ఇనుప రాడుతో దాడి:
ఆటో డ్రైవర్ తీరు పట్ల అక్కాచెల్లెలు ఎందుకో భయం భయంగానే ఆటో ఎక్కారు. ఆటో ఎక్కాక వారి అనుమానం నిజమైంది. మార్గమధ్యలో నరేష్ స్వాతిపై లైంగిక దాడికి యత్నించాడు. స్వాతి గట్టిగా ప్రతిఘటించడంతో పావనిని పట్టుకునేందుకు ప్రయత్నించాడు. దీంతో తమ సోదరుడికి ఫోన్ చేస్తానని చెప్పి పావని సెల్ ఫోన్ తీసింది. తీవ్ర ఆగ్రహావేశానికి లోనైన నరేష్.. ఇనుప రాడ్ తీసుకుని స్వాతి తలపై దాడి చేశాడు.
రోడ్డు పక్కన పడి ఉండగా:
దాడిలో స్వాతి ఆటోలోంచి కింద పడిపోయింది. దీంతో పావని కూడా ఆటోలో నుంచి కిందకు దూకేసింది. మద్యం మత్తులో ఉన్న నరేష్.. జగన్నాథపురం వైపు వెళ్లి అక్కడి ఆంజనేయ స్వామి దేవాలయానికి ఢీకొట్టాడు. ఇంతలో బొబ్బిలి నుంచి తిరిగొస్తున్న కోమటిపల్లికి చెందిన శంకరరావు ఇద్దరు అమ్మాయిలు గాయాలతో రోడ్డు పక్కన పడి ఉండటాన్ని గమనించాడు.
ఆ తరువాత అదే గ్రామానికి చెందిన గణేష్ తదితరులు సంఘటనా స్థలానికి చేరుకుని అంబులెన్స్కు సమాచారమందించారు. అంబులెన్స్ లో వారిని బొబ్బిలి సీహెచ్సీకి తరలించారు. పావని చెప్పిన వివరాలతో పోలీసులు కేసు నమోదు చేశారు.