ప్రేమలో గెలిచారు.. కానీ విధి వంచనతో కన్నీళ్లే మిగిలాయి..
కాశీరావుపేట వద్దకు రాగానే ఓ గుర్తు తెలియని వాహనం రెడ్డెప్పను ఢీ కొట్టి వెళ్లిపోయింది.
మదనపల్లె: పెద్దలు కాదన్నా.. కలిసి బ్రతకగలమన్న నమ్మకంతో.. వారిద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు. పెళ్లయ్యాక జీవితం సాఫీగా గడిచిపోతున్న తరుణంలో.. విధి వారిని దారుణంగా వంచించింది. రోడ్డు ప్రమాదం రూపంలో వారి జీవితాన్ని కబళించింది.
వాల్మీకిపురం మండలం చింతపర్తి పంచాయతీ ముంగాళ్లమర్రి గ్రామానికి చెందిన రెడ్డెప్ప (26), కృష్ణవేణి అనే మహిళను మూడేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరిద్దరికి వర్షిత్(2) అనే ఓ కుమారుడు ఉన్నాడు.
కాగా, రెడ్డెప్ప స్థానిక శ్రీనివాస పాలడెయిరీకి ఆటోలో పాలు తరలిస్తుంటాడు. ఇదే క్రమంలో రాత్రి ఒంటిగంట ప్రాంతంలో డెయిరీ వద్ద పని ముగించుకుని తన ఆటోలోనే ఇంటికి బయలుదేరాడు. అయితే కాశీరావుపేట వద్దకు రాగానే ఓ గుర్తు తెలియని వాహనం రెడ్డెప్ప ఆటోను ఢీ కొట్టి వెళ్లిపోయింది.
ప్రమాదంలో ఆటో నుజ్జునుజ్జు కాగా.. ఆటో నడుపుతున్న రెడ్డెప్ప అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఉదయం వరకు రెడ్డెప్ప మృతదేహం రోడ్డుపైనే పడి ఉండటం గమనార్హం. సీటీఎం రోడ్డులో వెళ్తున్న కొంతమంది ప్రయాణికులు మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించడంతో రూరల్ ఎస్సై రవిప్రకాష్ రెడ్డి ఘటనాస్థలికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు.
విషయం తెలుసుకున్న రెడ్డెప్ప భార్య కృష్ణవేణి కన్నీరు మున్నీరవుతోంది. పెద్దలను సైతం కాదని ప్రేమ వివాహం చేసుకుని, కుటుంబానికి దూరంగా ఉంటున్న తరుణంలో ఇలాంటి దుర్ఘటన చోటు చేసుకోవడం ఆమెను మరింత ఆవేదనకు గురిచేస్తోంది. రెడ్డెప్ప ఆటోను ఢీ కొట్టిన వాహనాన్ని త్వరలోనే గుర్తిస్తామని ఎస్సై చెప్పారు.